జన ‘గణ’ మన అధినాయిక జయహో

త్రివిధ దళాల్లో మహిళా నాయకత్వం పెరుగుతోంది. కవాతుల్లో పాల్గొంటూ, సేనల్ని నడిపిస్తూ... దేశ రక్షణలో నారీ భేరి మోగిస్తున్నారు.

Eenadu icon
By Vasundhara Team Updated : 26 Jan 2026 01:14 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
18 min read

త్రివిధ దళాల్లో మహిళా నాయకత్వం పెరుగుతోంది. కవాతుల్లో పాల్గొంటూ, సేనల్ని నడిపిస్తూ... దేశ రక్షణలో నారీ భేరి మోగిస్తున్నారు. విధి నిర్వహణలో, వ్యవసాయంలో అహర్నిశలూ శ్రమిస్తూ సామాన్య మహిళలూ అసామాన్య ప్రతిభను కనబరుస్తూ... దేశ ప్రగతిలో నారీశక్తిని చాటుతున్నారు. తమ సేవలకు గుర్తింపుగా ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే గౌరవాన్ని పొందారీ మహిళలు. కళలు, ప్రజాసేవ, వైద్యం... ఏ రంగంలో ఉన్నా తమ పాత్రకు నూటికి నూరు పాళ్లు న్యాయం చేస్తూ అక్కడ సమూల మార్పు తెస్తున్నారు మహిళలు. అందుకు ఉదాహరణే గణతంత్ర దినోత్సవం వేళ విరిసిన ఈ పద్మాలు...

ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలంలోని మారుమూల ఆదివాసీ గ్రామం ఖైర్‌డాట్వా. ఇక్కడ ఇప్పపువ్వు లడ్డూలు తయారుచేస్తున్నశాంతాబాయికి రాష్ట్రపతి భవన్‌ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది.

క్తహీనతతో బాధపడుతున్న ఆదివాసీ చిన్నారులకు ప్రొటీన్, విటమిన్‌-సి పుష్కలంగా ఉండే ఇప్పపువ్వుతో చేసిన తినుబండారాలు అందించాలన్నారు వైద్యులు. దీంతో ఐటీడీఏ అధికారులు గతేడాది ఖైర్‌డాట్వాకు వచ్చి పెందోర్‌ శాంతాబాయికి లడ్డూల తయారీపై శిక్షణ ఇప్పించారు. తర్వాత గ్రామంలో లడ్డూల తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు ఆమె. మహిళా సంఘానికి చెందిన మరో 12 మందికీ తయారీని నేర్పించారు. 5 కిలోల ఇప్పపువ్వు, 2 కిలోల నువ్వులు, 40గ్రాముల చొప్పున బాదం, ఎండుద్రాక్ష, జీడిపప్పు, యాలకులు, రెండు కిలోల బెల్లం, కిలో చక్కెర, రెండు కిలోల వేరుసెనగలను మిక్సీ చేస్తారు. వీటన్నింటినీ నెయ్యిలో వేయించి చేతితోనే లడ్డూలు తయారుచేసేవారు. గతేడాది ఆగస్టులో జిల్లా కలెక్టర్‌ రాజర్షీషా చొరవతో మహిళా సంఘానికి ఇందిరా క్రాంతిపథం ద్వారా రూ.5 లక్షల రుణం మంజూరైంది. ప్రస్తుతం యంత్రాలతో లడ్డూలు తయారు చేస్తున్నారు. వీటిని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని కస్తూర్బా విద్యాలయాలు, ఆశ్రమ పాఠశాలల్లో అందిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌ తదితర ప్రాంతాల్లోనూ విక్రయిస్తున్నారు. ‘ఆదివాసీల లడ్డూలకు జాతీయస్థాయిలో గుర్తింపు రావడంతో గర్వంగా ఉంది. రాష్ట్రపతి భవనానికి లడ్డూల్ని తీసుకువెళ్తున్నా. దీన్నో అదృష్టంగా భావిస్తున్నా. పోషకాలు కలిగిన ఈ లడ్డూలను అధికారులు గుర్తించి ప్రాచుర్యం కలిగించడం సంతోషకరం’ అని చెబుతారు శాంతాబాయి.

మైసూర్‌ మల్లిక, బ్లాక్, రెడ్‌ రైస్‌... తదితర దేశీ వరి వంగడాలను సేంద్రియ విధానంలో పండిస్తున్నారుయర్రు స్వాతి. ప్రకృతి సాగు ఆమెకు ఆర్థిక బలాన్ని చేకూర్చడమే కాదు, రాష్ట్రపతితో తేనేటి విందులో పాల్గొనే గౌరవాన్నీ అందించింది.

గుంటూరు జిల్లా, అత్తోటకు చెందిన స్వాతి డిగ్రీ చేశారు. 2016లో బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైన స్వాతి... తర్వాత కోలుకున్నారు. దాంతో ఆమెకు ఆరోగ్య స్పృహ మరింత పెరిగింది. పొదుపు సంఘాల మహిళలకు ప్రకృతి వ్యవసాయ విభాగం వాళ్లు సేంద్రియ సాగుపై నిర్వహించిన అవగాహన సదస్సులకు హాజరయ్యారు. ‘అనేక అనారోగ్యాలకు రసాయనాలే కారణం, సహజ సాగుతో ఆ సమస్యను నివారించి భూమి నిస్సారంగా మారడాన్ని నియంత్రించవచ్చ’న్న మాటలతో, క్షేత్ర స్థాయి పర్యటనలతో స్ఫూర్తిపొందారు. భర్త సత్యనారాయణ ప్రోత్సాహంతో 2017లో తమకున్న రెండు ఎకరాల్లో ప్రకృతి సాగుకు సిద్ధమయ్యారు. అందుకు దేశీ వరి రకాలనే ఎంచుకున్నారు. ప్రకృతి వ్యవసాయ విభాగం ప్రోత్సాహం అందడంతో మరో 18 ఎకరాలను కౌలుకు తీసుకున్నారు. ఈమె సాగు విధానాల్ని తెలుసుకునేందుకు సుదూర ప్రాంతాల రైతులు వస్తుంటారు. గతేడాది అక్టోబరులో దిల్లీలో జరిగిన సేంద్రియ సాగు సదస్సులో ప్రధాని మోదీ నుంచి అభినందనలు పొందారు స్వాతి. అక్కడ ‘పార్టిసిపేటెడ్‌ గ్యారంటీ సర్టిఫికెట్ (పీˆజీసీ)’ ధ్రువపత్రాన్ని అందుకున్నారు. దీంతో సేంద్రియ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సులభంగా లభిస్తుంది. తాజాగా గణతంత్ర దినోత్సవం రోజు రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే ఎట్ హోం కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్నారు. ‘రైతులందరూ ఈ విధానాన్ని అవలంబిస్తే ఇటు ప్రజలకూ అటు భూమాతకూ ఎంతో మేలు’ అని వివరిస్తారు స్వాతి.

కొన్ని పాటలు కొందరు తప్ప వేరెవరు పాడినా... ప్రేక్షకుల మనసు దోచుకోలేవు. ఎందు కంటే... పాటలు మనల్ని అలరించడమే కాదు, ఒక థెరపీలానూ పనిచేస్తాయి. అలా తన మధురమైన గాత్రంతో అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు బాలీవుడ్‌ ప్రముఖ గాయనిఅల్కా యాగ్నిక్‌.

‘చమ్మా... చమ్మా’, ‘ఏక్‌... దో... తీన్‌’ అంటూ నాటి అభిమానుల్ని ఉర్రూతలు ఊగించినా... ‘అగర్‌ తుమ్‌ సాత్‌ హో’ అంటూ నేటి తరాన్ని ఆకట్టుకున్నా ఆమెకే సొంతం. అల్కా గాత్ర సామర్థ్యం, బహుముఖ ప్రజ్ఞ, శాస్త్రీయ సంగీతానికి ఆమె అందించిన సేవల్ని ప్రశంసించని వాళ్లు లేరు. ఈ సేవలకు గానూ పద్మభూషణ్‌ని అందుకున్నారీమె. అయితే ఈ రంగంలో ఆమె ప్రవేశం అంత సులభంగా జరగలేదు. కోల్‌కతాలో పుట్టి పెరిగారీమె. అమ్మ శుభ, శాస్త్రీయ సంగీత కళాకారిణి. అల్కాకు నాలుగేళ్లు ఉన్నప్పట్నుంచే సంగీతం నేర్పడం మొదలుపెట్టారు శుభ. ఆరేళ్లప్పుడే ఆల్‌ ఇండియా రేడియోలో పాటలు పాడించారు. విన్నవారంతా మంత్రముగ్ధులై... ‘సినీరంగంలో అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంటుంది’ అన్నారట. దాంతో అల్కాను తీసుకుని ముంబయికి వచ్చారు శుభ. అసలు సవాళ్లు మొదలైంది అక్కడ్నుంచే. ‘గొంతు బాగుంది కానీ, గాయనిగా పరిచయం చేయడానికి ఈమెకు ఇంకా వయసుంద’ని చెప్పేవారట. అలా ఎన్నో విఫలయత్నాల తర్వాత... 14ఏళ్ల వయసులో తొలిసారిగా సినిమాలో పాడారు అల్కా. అది మొదలు ఆమె వెనుదిరగలేదు. ఇప్పటివరకూ 25 భాషల్లో దాదాపు 22వేల పాటల్ని పాడారీమె. బాలీవుడ్‌ మహిళా విభాగంలో లతామంగేష్కర్, ఆశా భోస్లే తర్వాత అత్యధిక సోలో సాంగ్స్‌ పాడిన గాయని అల్కానే. పాత పద్ధతులు, బాణీలే పాడతాను అంటూ గిరిగీసుకోలేదీమె. బీటీఎస్, టేలర్‌ స్విఫ్ట్‌ వంటి బ్యాండ్‌లతోనూ పోటీ పడి... యూట్యూబ్‌లో అత్యధికంగా స్ట్రీమింగ్‌ అయిన గాయనిగా గ్లోబల్‌ ర్యాంకునూ సాధించారు అల్కా.

‘మీ పాప మంచి నృత్యకారిణి అవుతుందేమోనమ్మా’ అన్నారట డాక్టర్‌...దీపికా రెడ్డిపుట్టినప్పుడు. ఆ మాట నిజం చేస్తూ నిజంగానే కూచిపూడిలో తనదైన ముద్ర వేశారు దీపిక. దేశవిదేశాల్లో గుర్తింపు సాధించిన ఆమె కళారంగంలో తన కృషికి గుర్తింపుగా తాజాగా పద్మశ్రీకి ఎంపికయ్యారు.

ల్లి కూడా శాస్త్రీయ నృత్యకారిణి. దీంతో దీపిక కూడా నాట్యంవైపు ఆకర్షితురాలయ్యారు. ఆరేళ్ల వయసులోనే నేర్చుకోవడం మొదలుపెట్టారు. 11ఏళ్ల వయసులోనే ప్రదర్శనలూ ఇవ్వడం ప్రారంభించారీమె. చిన్నవయసులోనే అరంగేట్రం కూడా చేశారు. అయితే నేర్చుకున్నది మాత్రం కూచిపూడి. మొదట సుమతి కౌశల్‌ దగ్గర నాట్యంలో ఓనమాలు దిద్దిన ఆమె వెంపటి చిన సత్యం శిష్యరికంలో మరింత రాటుదేలారు. పెళ్లయ్యాకా నాట్యాన్ని వదల్లేదు. దేశీయంగా ఖజురహో, కోణార్క్, హంపి... వంటి ఎన్నో

చరిత్రాత్మక ప్రాంతాల్లోనే కాదు... జర్మనీ, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, రష్యా, జపాన్‌... ఇలా ఎన్నో దేశాల్లోనూ ప్రదర్శనలు ఇచ్చారు. వర్క్‌షాప్‌లు, సెమినార్లు నిర్వహించారు. శివ సతీయం, శాంతి జీవనం, స్త్రీ త్రయం వంటి డ్యాన్స్‌- డ్రామాలనీ కంపోజ్‌ చేశారు. అయిదు పదుల వయసు దాటినా ప్రదర్శనలిచ్చారు. అయోధ్య రామమందిరం, తాజా మహా కుంభమేళాల్లోనూ నర్తించారు. కూచిపూడి కళాకారిణిగా తనకంటూ గుర్తింపు సాధించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి కళారత్న, తెలంగాణ రాష్ట్ర అవార్డు, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మక సంగీత నాటక అకాడమీ వంటి పురస్కారాలెన్నో అందుకున్నారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీకి ఛైర్‌పర్సన్‌గానూ పనిచేశారు. కూచిపూడి నృత్యాన్ని తరవాతి తరాలకీ అందించాలని భావించిన ఆమె 2000వ సంవత్సరంలో ‘దీపాంజలి’ పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు. అన్ని వర్గాలవారికీ శాస్త్రీయ నృత్యాన్ని అందుబాటులోకి తెచ్చి, ఎంతోమందిని నృత్యకారులుగానూ తీర్చిదిద్దారు. ఇప్పుడు తన శిష్యులు దేశవిదేశాల్లో ప్రదర్శనలిస్తున్నారు. నృత్యం మన సంస్కృతిలో భాగం. దాని ద్వారానూ సమాజాన్ని తీర్చిదిద్దొచ్చు అని నమ్ముతారీమె.

సామాజికాంశాలతో...

కూచిపూడి నాకు ఓ కళ కాదు.. భగవంతుడికి చేసే ఆరాధన. ఈ కళను భావితరాలకు అందించడమే కాదు... దీని వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు నా వంతు ప్రయత్నిస్తున్నా. పద్మశ్రీ అవార్డు ఆ కృషికి దక్కిన గౌరవంగా భావిస్తున్నా. వెంపటి చినసత్యంగారు నేర్పిన మెలకువలే నేనీ రంగంలో మరింత గొప్పగా రాణించేలా చేశాయి. అమ్మ కూడా నృత్య కళాకారిణే. 1961లో రవీంద్ర భారతి ప్రారంభోత్సవ సమయంలో చిత్రాంగద బ్యాలే చేసింది తను. నేనూ 11ఏళ్ల వయసులో ఆ వేదిక మీదే రంగ ప్రవేశం చేశా. ఆ కార్యక్రమానికి హాజరైన అక్కినేని నాగేశ్వరరావుగారు నేను కూచిపూడి నృత్యానికి టార్చ్‌బేరర్‌గా నిలుస్తానని చెప్పారు. ఇప్పుడు ఆ మాట సార్థకమైందని అంతా అంటుంటే నాకెంతో గర్వంగా అనిపిస్తుంది.

ఈ కళ భవిష్యత్తు తరాలకూ చేరువ కావాలనే ఆలోచనతో కూచిపూడి నృత్యాన్ని కేవలం పౌరాణిక, ఇతిహాస ఇతివృత్తాల మీదే కాదు... పర్యావరణం, మహిళా సమస్యలు, సహజ రంగులు, తెలుగు రాష్ట్రాల కళలు వంటివెన్నో చూపించడానికీ ప్రయత్నిస్తున్నాం. నా తల్లిదండ్రులతో పాటు నా భర్త శ్యామ్‌గోపాల్, పిల్లలు శ్లోక, అభినవ్‌ల ప్రోత్సాహం ఎంతో!

చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పండే యాపిల్‌ని...ఎడారి ప్రాంతంలో పెంచడం సాధ్యమేనా అనేది మనందరి ప్రశ్న అయితే, దాన్ని సుసాధ్యం చేసి చూపించారు రాజస్థాన్‌కి చెందిన రైతుసంతోష్‌ దేవి. ఈ కృషికి గుర్తింపుగానే రాష్ట్రపతి నుంచి ప్రత్యేక ఆహ్వానాన్ని అందుకున్నారు.

ది ఏళ్ల కష్టానికి దక్కిన గౌరవం అంటారామె. సంతోష్‌ దేవి ఖేదర్‌ది రాజస్థాన్‌లోని బెరి. ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తితో 2008లో ఆమె ఇటువైపు వచ్చారు. భర్త ఉద్యోగానికీ, పిల్లలు స్కూలుకీ వెళ్లాక ఆమె పొలం పనులు మొదలుపెట్టేవారు. రకరకాల ప్రయోగాలూ చేసేవారు. ఆ అనుభవమే ఆమెకు యాపిల్‌ పండించాలన్న ఆలోచన కలిగించింది. ఇందుకోసం హిమాచల్‌ ప్రదేశ్‌కి చెందిన ఓ రైతు అభివృద్ధి చేసిన ప్రత్యేక యాపిల్‌ రకాన్ని ఎంచుకున్నారు. ఆ సమయంలో ఆమెను చూసి అంతా అధిక ఉషోగ్రతలు నమోదయ్యే చోట అసాధ్యమని కొట్టిపారేశారు. కానీ, తాను మాత్రం అవేవీ పట్టించుకోలేదు. మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి  ఆవుమూత్రం, వేప, ఉమ్మెత్త... లాంటివి వాడి సొంతంగా ఎరువులు తయారు చేసుకునేవారు. జీవామృతం, పంచగవ్య లాంటివి వాడేవారు. నీటికొరతను అధిగమించడానికి డ్రిప్‌ ఇరిగేషన్‌ పద్ధతిని ఎంచుకున్నారు. ఇవన్నీ ఫలించాయి. రెండో ఏడాది నుంచే కాపు మొదలైంది. ఎటువంటి రసాయనాలూ వాడకుండా సహజంగా పండించడంతో మంచి ధర కూడా పలుకుతోంది. దాంతో అదే వ్యాపారంగా మలుచుకున్నారామె. వీటితో పాటు దానిమ్మ, బత్తాయి, నిమ్మ, సపోటాలనూ పండిస్తున్నారు. ఎకరం భూమిలో పండ్లతోటలు సాగు చేస్తుండగా, మరో అరెకరంలో నర్సరీని ఏర్పాటు చేశారు. ఏటా లక్షల రూపాయలు ఆదాయన్ని అందుకుంటున్నారు. ఔత్సాహికులకు సేంద్రియ సాగులో శిక్షణా అందిస్తున్నారు.

పోరాటం, కృతనిశ్చయం, ఆత్మవిశ్వాసాలకు ఓ రూపం ఇవ్వమంటే కెప్టెన్‌హంసజా శర్మని చూపించొచ్చేమో! సైన్యంలోకి రావడానికీ, తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికీ ఆమె చేసిన కృషి ఎంతో. కాబట్టే, గణతంత్ర దినోత్సవం నాడు ఏవియేషన్‌ స్క్వాడ్రన్‌ని ముందుండి నడిపే అవకాశాన్ని అందుకున్నారామె.

‘నీతో నువ్వు కఠినంగా ఉండు’... హంసజాని చిన్నప్పట్నుంచీ ఎక్కువ ఆకర్షించిన వాక్యమిది. స్కూల్లో పరిచయమైన దీన్ని తను జీవితాంతం పాటిస్తూనే ఉన్నారు. కాబట్టే, తను కోరుకున్న రంగంలోకి అడుగుపెట్టగలిగారామె. హంసజాది జమ్మూ. చుట్టూ ఎన్నో ఆకర్షణలున్నా... ఆమెను ఆకట్టుకున్నది మాత్రం సైన్యం. అమ్మాయివి, కష్టమని ఎవరైనా అన్నా... ‘అవును అమ్మాయినే! అయితేనేం రెక్కలు కట్టుకుని ఎగురుతూ దేశాన్ని రక్షిస్తా. నాకు ఆ బలముంది’ అని సమాధానమిచ్చేవారట. కాబట్టే, తిరస్కరణలు ఎన్ని ఎదురైనా తలవంచలేదామె. అర్హత సాధించాకా అనారోగ్యం అడ్డుపడింది. అయినా సర్జరీ చేయించుకుని మరీ నాసిక్‌లోని కంబాట్‌ ఆర్మీ ఏవియేషన్‌ ట్రైనింగ్‌ స్కూల్‌లో అడుగుపెట్టారు. టాపర్‌గా నిలిచి బెస్ట్‌ కంబాట్‌ ఏవియేటర్లు అందుకునే ‘సిల్వర్‌ చీతా ట్రోఫీ’ని గెలిచారు. దాన్ని పొందిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. రుద్ర ఆర్మ్‌డ్‌ హెలికాప్టర్‌ని నడిపిన తొలి భారతీయ మహిళ హంసజా. ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ నిర్వహిస్తోన్న ఎయిర్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఎయిర్‌ లాస్‌ కోర్సునీ చేశారు. ఆ పట్టా అందుకున్న తొలి వ్యక్తి కూడా కెప్టెన్‌ హంసజానే. ఆ పట్టుదల, ధైర్యంతోనే తాజాగా గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ఆర్మీ ఏవియేషన్‌ నాయకత్వం వహించే అవకాశం అందుకున్నారు. 251 మందితో కూడిన బృందాన్ని ముందుండి నడిపించనున్నారామె. ఒంటరి తల్లి పెంపకంలో పెరిగారు హంసజా. జర్నలిస్ట్‌ అయిన తల్లి నుంచే ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ వంటివి తనకు అలవడ్డాయంటారామె. కాబట్టే, అమ్మాయిలు అరుదుగా ఉండే రంగంలోకి అడుగుపెట్టగలిగా అంటారు హంసజా. ఈమె విజయాల్ని సైన్యంలో నారీశక్తికి చిహ్నంగా అభివర్ణిస్తున్నారంతా.

రిపబ్లిక్‌ పరేడ్‌లో ఎంతోమంది మహిళలు దళాలను నడిపించారు. కానీ అసిస్టెంట్‌ కమాండెంట్‌సిమ్రన్‌బాలా మాత్రం చరిత్ర సృష్టించారు. ‘ఆల్‌ మేల్‌ సీఆర్‌పీఎఫ్‌ కంటింజెంట్‌’ను ముందుండి నడిపించనున్నారామె. ఆ ఘనత సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గానూ నిలిచారు.

26ఏళ్ల సిమ్రన్‌ బాలాది జమ్మూ కశ్మీర్‌లోని నౌషెరా. సరిహద్దు ఊరది. సైనికులు, వాళ్ల విధులు, పాటించే క్రమశిక్షణ వంటివెన్నో ఆమెను ఆకర్షించాయి. దీంతో సైన్యంలోకి రావాలని కలలు కన్నారు. 2023లో యూపీఎస్‌సీ... సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ పరీక్ష రాసి, తొలి ప్రయత్నంలోనే ర్యాంకును సాధించారు. ఆ ఏడాది తన రాష్ట్రం నుంచి అర్హత సాధించిన ఏకైక మహిళ సిమ్రన్‌. తన ఊరి నుంచి ఆఫీసరైన తొలి మహిళ. దీంతో అక్కడి యువతకు స్ఫూర్తిగానూ నిలిచారామె. తాజాగా కర్తవ్యపథ్‌లో సీఆర్‌పీఎఫ్‌ దళాన్ని నడిపించే అవకాశాన్ని అందుకున్నారు. 140 మంది బృందమది. మొత్తం పురుషులే. ఇలా ఒక మహిళా ఆఫీసర్‌ ఇంతమంది మగవాళ్లని నడిపించడం దేశ చరిత్రలోనే తొలిసారి. దీంతో ఆమె పేరు మారుమోగుతోంది. ఆమె ఆత్మవిశ్వాసం, కచ్చితత్వం, కంటింజెంట్‌ని కమాండ్‌ చేయగల నైపుణ్యం అన్నీ పై అధికారులను ఆకర్షించాయి. దీంతో సిమ్రన్‌కి ఈ అవకాశమొచ్చింది. తన ప్రతిభతో ఈ అవకాశాన్ని అందుకున్నారామె. ఒక యువ మహిళా ఆఫీసర్‌... ఇలా నాయకత్వం వహించడం, దళాన్ని ధైర్యంగా ముందుకు నడిపించడం సైన్యంలో మహిళలకు ప్రాధాన్యం పెరుగుతోందన్న దానికి ఉదాహరణగా చెబుతున్నారంతా. అధికారిణులూ సైన్యంలో అందరితో సమాన పాత్ర పోషిస్తూ సత్తా చాటగలరనడానికి సంకేతంగానూ చెబుతున్నారు.

మార్చింగ్‌ కంటింజెంట్లలో, యుద్ధ విమానాలకు సారథులుగా, బ్యాండ్‌లో వాద్యాలను మోగిస్తూ... తమదైన ముద్ర వేస్తున్నారు మహిళా అధికారిణులు. వీళ్లందరికీ  భిన్నంగా ఈసారి గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సహాయకురాలిగా వ్యవహరించే అవకాశాన్ని దక్కించుకున్నారు ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌అక్షిత ధన్‌కర్‌.

‘రిపబ్లిక్‌ డే పరేడ్‌లో భాగం అవ్వడం నా చిన్ననాటి కల. నాన్న ఎప్పుడూ దేశభక్తి గాథలు చెబుతుండేవారు. గణతంత్ర దినోత్సవ కవాతులో ఆయన పాల్గొన్నారు కూడా. ఆయన్ని చూసే... నేను ఏదో ఒక రోజు దీనిలో పాల్గొనాలి అనుకున్నా. కానీ, వైమానిక దళంలో చేరిన అనతి కాలంలోనే ఈ అవకాశం వస్తుందని ఊహించలేదంటారు అక్షిత. ఈమె హరియాణలోని కాస్నీ గ్రామంలో పుట్టారు. దేశానికి ఎందరో వీరుల్ని అందించిన కేంద్రపాలిత ప్రాంతం జాట్‌లో పెరిగారీమె. ఈ నేపథ్యమే దేశసేవపై ఆమెకు మక్కువను పెంచింది. అయితే సైన్యంలోకి వెళ్లాలన్న సంకల్పం ఏర్పడింది మాత్రం... కాలేజీ రోజుల్లోనేనట. ‘దిల్లీలోని శ్రీ గురు తేజ్‌ బహదూర్‌ ఖల్సా కాలేజీలో చదువుతున్నపుడు ఎన్‌సీసీలో భాగం అయ్యా. అక్కడ నేర్పిన క్రమశిక్షణ, దేశభక్తి పాఠాలే సైన్యంలో భాగం కావాలన్న ఆలోచనల్ని పెంచాయంటారామె. చదువు పూర్తయ్యాక అర్హత పరీక్ష రాసి పాసై 2023లో వైమానిక దళంలో చేరారు అక్షిత. అప్పట్నుంచి అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో తనదైన శైలిలో రాణించారు. పదోన్నతులూ పొందారు. ఇవన్నీ కర్తవ్య పథ్‌పై రాష్ట్రపతితో కలిసి వేదికను పంచుకునే అవకాశాన్ని కల్పించాయి. ఈ బాధ్యతలు అందుకున్న తొలి మహిళ ఈమే కావడం విశేషం.

నెలలు నిండకుండా, తక్కువ బరువుతో పుట్టిన వారితోపాటు తల్లిపాలు దొరక్క తీవ్ర అనారోగ్యానికి గురైన చిన్నారులెందరో. డా.ఆర్మిడా ఫెర్నాండెజ్‌తన కెరియర్‌లో ఇలాంటి వాళ్లెందరినో చూశారు. ఆమె ముంబయిలోని లోకమాన్య తిలక్‌ మున్సిపల్‌ జనరల్‌(సియోన్‌) ఆసుపత్రిలో నియోనాటాలజిస్ట్‌గా పనిచేసేవారు. 1977లో ఆర్మిడా ఆ విభాగ బాధ్యతల్ని తీసుకున్నారు. ఎలాగైనా శిశు మరణాలను తగ్గించాలని అనుకున్నారు. కారణాలు అన్వేషిస్తున్నప్పుడు- నెలలు నిండకుండా చనిపోతున్న పిల్లలు డబ్బా పాలు తాగడం వల్ల ఓ రకమైన ఇన్ఫెక్షన్‌ బారిన పడుతున్నారని గుర్తించారామె. దానికి పరిష్కారం తల్లిపాలే... కానీ, అవి అందరికీ అందడంలేదు. దాంతో హ్యూమన్‌

మిల్క్‌ బ్యాంక్‌ ఏర్పాటు అవసరమని భావించారు. అదే సమయంలో యూకేలో ఫెలోషిప్‌ చేయడానికి వెళ్లిన ఆమె... ఆక్స్‌ఫర్డ్, బర్మింగ్‌హామ్‌ల్లో విజయవంతంగా నడుస్తోన్న తల్లిపాల బ్యాంకులను పరిశీలించారు. ఆ వివరాలు తెలుసుకుని తిరిగొచ్చాక తాను పనిచేస్తోన్న ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటుచేశారు. ఇది దేశంలోనే కాదు... ఆసియాలోనే మొదటి తల్లిపాల బ్యాంకు. ఆమె చేసిన ఈ ప్రయత్నం ఫలించింది. క్రమంగా ఆసుపత్రిలో శిశు మరణాల రేటుని గణనీయంగా తగ్గించడానికి సాయపడింది. ఆపై 1999లో సొసైటీ ఫర్‌ న్యూట్రిషన్, ఎడ్యుకేషన్‌ అండ్‌ హెల్త్‌ యాక్షన్‌(స్నేహ) పేరుతో ఎన్జీవోని ఏర్పాటుచేశారు. ఇది పట్టణ ప్రాంత మురికివాడల్లోని తల్లీ పిల్లల ఆరోగ్యానికి కృషి చేస్తోంది. కెరియర్‌ నుంచి పదవీ విరమణ తీసుకున్నాక... క్యాన్సర్‌ బారిన పడ్డ కూతుర్ని కోల్పోయారామె. తన జ్ఞాపకార్థం ‘రోమిలా పాలియేటివ్‌ కేర్‌ సెంటర్‌’ని ఏర్పాటుచేసి జీవిత చరమాంకంలో తీవ్ర అనారోగ్యాల బారిన పడిన వృద్ధులకు సేవలందిస్తున్నారు. దశాబ్దాలుగా శిశు సంరక్షణ, ప్రజారోగ్య విభాగాల్లో ఆమె అందిస్తోన్న సేవలకు గుర్తింపుగానే పద్మశ్రీ అవార్డు వరించిందీమెను.

కలి లేని ప్రపంచాన్ని చూడాలి అంటారు ఎస్‌.జి.సుశీలమ్మ. అందుకే ‘సుమంగళి సేవా ఆశ్రమం’ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసి అనాథలకు ఉచిత విద్య, ఆదరణలేని వృద్ధులకు, మహిళలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. అనాథలకు అమ్మా, నాన్న అన్నీ తానే అవుతున్నారు. వందమంది పిల్లలకీ, 400కు పైగా మహిళలకీ ఆశ్రయం కల్పిస్తున్నారు. 174 అంగన్‌వాడీ కేంద్రాలు ప్రారంభించి చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్‌ క్లినిక్‌ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటుచేశారు. రోజూ 800 మందికి ఉచిత భోజనం సరఫరా చేస్తున్నారు సుశీలమ్మ. అందుకే అంతా ఆమెను ‘కర్ణాటక మదర్‌ థెరెసా’ అని పిలుచుకుంటారు. కర్ణాటకలోని మారుమూల గ్రామంలో పుట్టిపెరిగారీమె. అమ్మానాన్నలు చెన్నమ్మ, గణేశప్ప. పద్నాలుగుమంది సంతానంలో ఈమె ఒకరు. నాన్నది నేత పని. సంపాదన అంతంత మాత్రమే. పేదరికం కారణంగా సరైన తిండి లేక చిన్నతనంలోనే నలుగురు తోడబుట్టినవాళ్లని పోగొట్టుకున్నారీమె. తరవాత వీళ్ల కుటుంబం బెంగళూరుకి వలస వచ్చింది.

కానీ, తండ్రి మరణం కుటుంబాన్ని మరింత ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేసింది. కుటుంబ పోషణకోసం ఆమె అన్నయ్యలు చదువు మానేసి వ్యాపారం చేశారు. సుశీలమ్మ మాత్రం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నారు. ఒకరోజు ఉచితంగా అందించే పుస్తకాలు ఆలస్యం అయ్యాయట. ఆ క్షణం తన చదువు ఆగిపోయిందనుకున్నారట. అందుకే తనలా పేదరికంతో ఇబ్బంది పడే విద్యార్థులకు సహాయం చేయాలనుకున్నారు. బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగం వచ్చాక సుశీలమ్మ తన జీతంలో కొంతమొత్తాన్ని విద్యార్థుల చదువుకు వినియోగించేవారు. ‘1975లో ముగ్గురు అనాథలు ఆశ్రయం కావాలంటూ వచ్చారు. వాళ్లకి ఎలాగయినా సాయం చేయాలనుకున్నా. అప్పుడు నా చేతిలో ఉన్నది రూ.15 మాత్రమే. కానీ ధైర్యంగా ముందడుగు వేశా. ఎం.కాంతమ్మ నేనూ కలిసి ‘సుమంగళి సేవాశ్రమం’ స్థాపించాం’ అంటారీమె. దాదాపు ఐదు దశాబ్దాలుగా సేవలందిస్తున్న సుశీలమ్మ ఆశ్రమ నిర్వహణ కోసం తొలిరోజుల్లో కూలీగా మూటలు కూడా మోశారు. ఆశ్రమంలో ఉన్నవారి కడుపు నింపేందుకు ఎన్నోసార్లు పస్తులున్నారట కూడా. ఆ సేవల్ని మెచ్చి ఇప్పటికే దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్, గ్రామ జ్యోతితో సహా మరెన్నో అవార్డులూ రాగా తాజాగా పద్మశ్రీ వరించిందీమెను.

‘పుట్టగానే పువ్వు పరిమళిస్తుంది’ అన్నది బుధరీ తాతీకి చక్కగా సరిపోతుంది. ఈమెది ఛత్తీస్‌గఢ్, దంతేవాడలోని హిరానార్‌ గ్రామంలోని గిరిజన కుటుంబం. చిన్నప్పటి నుంచీ ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపడంతో తల్లిదండ్రులు ఐదేళ్ల వయసులోనే దివ్య జీవన సంఘ్‌ గుమ్మార్గుండా ఆశ్రమంలో చేర్చారట. తరవాత అక్కడే దీక్ష తీసుకుని

నాలుగు దశాబ్దాలుగా గిరిజన సంక్షేమానికే అంకితమయ్యారీమె. హిరానార్, దంతేవాడ... వంటి నక్సల్‌ ప్రభావిత ప్రాంతాలతోపాటు దక్షిణ బస్తర్‌ వంటి వెనకబడ్డ ప్రాంతాల్లో మహిళల అభివృద్ధికీ వృద్ధుల సేవకీ కృషిచేస్తున్నారు. కుట్టుపనిలో శిక్షణ ఇప్పించడంతోపాటు బాలికలకు విద్యను అందించే సాహసం చేశారు. ఆమె వల్లే సుమారు ఆరు వందల మంది మహిళలు ఆర్థిక స్వావలంబన పొందారు. టైలర్లుగా, ఉపాధ్యాయినులుగా, నర్సులుగా తాము ఉపాధి పొందడమే కాదు, మరెందరో గిరిజనులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆల్‌ ఇండియా వనవాసి కళ్యాణ్‌ ఆశ్రమంతో కలిసి హిరానార్‌లో శంఖనీ మహిళల ఉత్థాన కేంద్రాన్ని ప్రారంభించారు. ఇందులోని మహిళా సహాయక బృందం గురుకులాల్లోని పిల్లల బాగోగులు చూడటంతోపాటు ఆరోగ్యం, పోషకాహారం పట్ల గిరిజన స్త్రీలకి అవగాహనా కల్పిస్తోంది. బాల్యవివాహాల్నీ అడ్డుకుంటోంది. వృద్ధులకోసం ఆశ్రమాన్నీ నిర్వహిస్తున్నారు బుధరీ.  

► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 26 Jan 2026 01:03 IST