శ్రీకాకుళం:పీఎం స్వానిధి పథకం చిరు వ్యాపారుల పెన్నిధిగా నిలుస్తోందని లీడ్ బ్యాంక్ మేనేజర్ పి.శ్రీనివాసరావు అన్నారు. బుధవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన పీఎం స్వానిధి ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. చిరువ్యాపారుల ఆర్థిక స్వావలంబనకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రుణాలను సకాలంలో చెల్లించేవారికి అదనపు రుణ సాయంతో పాటు క్రెడిట్ కార్డు సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. అర్హులైన వారికి సత్వర రుణ సాయం అందిస్తామని తెలిపారు. మెప్మా ప్రతినిధి జి.కిషోర్ బాబు మాట్లాడుతూ జిల్లాలోని నగరపాలక సంస్థతోపాటు, మూడు పురపాలక సంఘాల పరిధిలో వీధి వ్యాపారుల గుర్తింపు, నమోదు, రుణాల మంజూరు కోసం ఆర్పీల ద్వారా చర్యలు చేపడుతున్నామన్నారు. శ్రీకాకుళం గ్రామీణం, బలగ, నరసన్నపేట, పొందూరు, టెక్కలి, హిరమండలం, సోంపేట మండలాల్లో కూడా పీఎం స్వానిధి కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మెప్మా బాధ్యులు వై.శారదావాణి, బి.రామారావు, సీఎంఎండీ కృష్ణారావు, పట్టణ జిల్లా సమాఖ్య అధ్యక్షుడు బి.నాగలక్ష్మి, యూనియన్, ఇండియన్, ఏపీజీబీ బ్యాంకు మేనేజర్లు బి.శ్రీనివాసరావు, ఎం.నారాయణరావు, భారతి, పి.వెంకటేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Sakshi
June 18, 2026, 12:23 AM