● అధికారులకు పేరాడ తిలక్ హెచ్చరిక
టెక్కలి:నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల అక్రమాలు, దౌర్జన్యాలకు వత్తాసు పలుకుతూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు, దళితులు, సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఏ ఒక్క అధికారినీ విడిచిపెట్టేది లేదని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ హెచ్చరించారు. కోటబొమ్మాళి మండలం కొత్తపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్తల ప్రోద్బలంతో అధికారులు చేసిన దౌర్జన్యానికి నష్టపోయిన బాధిత దళితుడు బాద లక్ష్మీనారాయణ కుటుంబాన్ని బుధవారం తిలక్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అచ్చెన్నాయుడి అండతో టీడీపీ నాయకులు సామాన్యులపై రెచ్చిపోతున్నారని గుర్తు చేశారు. పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికారుల ఆగడాలు శృతిమించుతున్నాయని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక అధికారులు చేస్తున్న అక్రమ చర్యలకు వారు ఎక్కడికి బదిలీ అయినా సమాధానం చెబుతామని హెచ్చరించారు. అనంతరం బాధితుడికి భరోసా కల్పించే విధంగా మానసిక స్థైర్యం కల్పించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ దుబ్బ వెంకట్రావు, పార్టీ మండల అధ్యక్షుడు ఎస్.హేమసుందర్రాజు, నాయకులు నూక సత్యరాజ్, బి.దివాకర్, ఎస్.వినోద్ తదితరులు పాల్గొన్నారు.