రణస్థలం:లావేరు మండలంలోని శిగిరి కొత్తపల్లి గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. చాలామందికి కుక్క కరవడంతో గ్రామస్తులు అందోళన చెందారు. అందులో పి.నారాయణమ్మ, డోకల ఎర్రయ్యకు తీవ్రంగా గాయాలవ్వడంతో, 108 వాహనంపై శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 108 సిబ్బంది ఈశ్వరరావు, కృష్ణలు సమాచారాన్ని తెలిపారు.
నేపాల్లో కొత్తూరు వాసి మృతి
కొత్తూరు:మండల కేంద్రంలోని ఎన్ఎన్ కాలనీకి చెందిన మల్ల మీనాక్షి (60) నేపాల్లో మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. 10 రోజుల క్రితం మీనాక్షి కుటుంబ సభ్యులతో కలిసి నేపాల్లోని యమునా పుష్కరాలకు వెళ్లారు. రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురై అక్కడ ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. స్వగ్రామం కొత్తూరులోని ఎన్ఎన్ కాలనీలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు.
మహిళకు పాటుకాటు
పోలాకి:మండలంలోని మబగాం గ్రామానికి చెందిన మద్దిలి కళావతి అనే ఉపాధి వేతనదారు పని ప్రదేశంలో పాముకాటుకు గురైంది. వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్, తోటి వేతనదారులు నరసన్నపేటలోని గొలివి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతానికి చికిత్స అందుతోందని ఏపీవో రమణ తెలిపారు. పాముకాటుకు గురైన కళావతిని ఆస్పత్రిలో జెడ్పీటీసీ సభ్యుడు ధర్మాన కృష్ణచైతన్య, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కరిమి రాజేశ్వరరావులు పరామర్శించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు.
రహదారి ప్రమాదంలో యువకుడు మృతి
సోంపేట:మండలంలోని బారువ – సోంపేట ప్రధాన రహదారి కంబవద్ద బుధవారం రాత్రి జరిగిన రహదారి ప్రమాదంలో సోంపేటలో పకోడి షాప్ నిర్వహిస్తున్న యువకుడు శశిభూషణ్ (38) మృతి చెందాడు. మృతుడు శశిభూషణ్ వేరే రాష్ట్రం నుంచి ఉపాధి నిమిత్తం వచ్చి జీవనాధారం పొందుతున్నాడు. బుధవారం రాత్రి బారువ వెళ్లి తిరిగి వచ్చే సమయంలో కంబ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోయాడు. దీంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు సోంపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తలకు తీవ్రగాయం కావడంతో ఘటన స్థలంలోనే యువకుడు మృతి చెందాడు. సోంపేట సామాజిక ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. సోంపేట ఎస్ఐ మోహిని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.