India Seniors Bypass Gambhir Seek Clarity From BCCI Over ODI Future: Report

గంభీర్‌- రోహిత్‌- కోహ్లి (ఫైల్‌ ఫొటో)

అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌తో టీమిండియా వన్డే ప్రపంచకప్‌-2027 సన్నాహకాలు మొదలుకానున్నాయి. గిల్‌ సేన స్వదేశంలో అఫ్గన్‌తో మూడు వన్డేలు ఆడేందుకు సన్నద్ధమైంది. గాయం కారణంగా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఈ సిరీస్‌కు దూరం కాగా.. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా సైతం కాలు నొప్పితో దూరమయ్యే పరిస్థితి నెలకొంది.

మరోవైపు.. లెజెండరీ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడం టీమిండియాకు సానుకూలాంశంగా మారింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన దిగ్గజ ద్వయం రోహిత్‌- కోహ్లి వన్డేల్లో మాత్రం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

గంభీర్‌, అగార్కర్‌ విముఖత?
వన్డే ప్రపంచకప్‌-2027 ఆడటమే లక్ష్యంగా రో-కో ముందుకు సాగుతున్నారు. అయితే, హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌, చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ మాత్రం వీరి పట్ల సుముఖంగా లేనట్లు సమాచారం. వరల్డ్‌కప్‌ ఆడే విషయంలో రో-కో తమకు ఎలాంటి హామీ ఇవ్వలేదని అగార్కర్‌ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించాడు.

తలవంచను
అయితే, ఇందుకు కోహ్లి ఇటీవలే గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. తనను తాను నిరూపించుకోవాలని పదే పదే ఒత్తిడి చేస్తే.. అందుకు తాను తలవంచనని చెప్పేశాడు. డ్రెసింగ్‌రూమ్‌లో తన అవసరం లేదనుకుంటే తన గురించి చర్చే అనవసరం అని పేర్కొన్నాడు.

ఈ పరిణామాల నేపథ్యంలో రో-కో భవితవ్యం గురించి మరోసారి చర్చ మొదలైంది. ఈ క్రమంలో బీసీసీఐ వర్గాలు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. సంచలన విషయాలు వెల్లడించాయి. సీనియర్‌ ఆటగాళ్లు గంభీర్‌, అగార్కర్‌లను కాదని యాజమాన్యంతో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నాయి.

గంభీర్‌తో మాకు సంబంధం లేదు
‘‘జట్టులో దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. కెప్టెన్‌ గిల్‌ ప్రతీ విషయంలో డ్రెసింగ్‌రూమ్‌ గట్టిగా తన గొంతు వినిపించాల్సి ఉంది. టెస్టు, టీ20 ఫార్మాట్లలో మాదిరి గంభీర్‌ వన్డే జట్టు విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోవడం లేదు.

అయితే ఇప్పుడు పరిస్థితి కాస్త మారింది. వన్డే వరల్డ్‌కప్‌ సన్నాహకాలు మొదలైపోయాయి. గంభీర్‌- గిల్‌ ఇకపై మరి కాస్త కఠినంగా ఉండవచ్చు. డ్రెసింగ్‌రూమ్‌లో తన ఐడియాలను బలంగా వినిపించవచ్చు.

చాలా ఏళ్లుగా అత్యంత గొప్పగా.. సేవలు అందిస్తున్న సీనియర్లు వచ్చే పదహారు నెలల్లో జట్టులో తమ పాత్ర ఏమిటన్న అంశం గురించి గంభీర్‌తో కాకుండా నేరుగా యాజమాన్యంతో చర్చిస్తున్నారు. తమ భవితవ్యంపై స్పష్టతనివ్వాలని కోరుతున్నారు’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. 

చదవండి: వాళ్లకే దిక్కులేదు.. అతడిని ఎలా ఎంపిక చేస్తారు?