TG News: ప్రజావాణిలో 74శాతం ఫిర్యాదులు పరిష్కరించాం: డిప్యూటీ సీఎం భట్టి

Eenadu icon
By Telangana News Team Published : 19 Dec 2025 18:21 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా సమస్యల పరిష్కారమే రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజావాణి ప్రారంభించిన రెండేళ్లల్లో ఇప్పటి వరకు 74 శాతం ఫిర్యాదులు పరిష్కరించామని తెలిపారు. బేగంపేట ప్రజాభవన్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి ప్రజావాణి 2వ వార్షికోత్సవానికి భట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రజావాణి ఇన్‌ఛార్జి దివ్యదేవరాజన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు లబ్ధిదారుల తమ అనుభవాల పంచుకున్నారు.

అంకితభావంతో సేవలు అందించి.. ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేసిన అధికారులను సన్మానించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... రాష్ట్రంలోని వివిధ వర్గాల నుంచి వస్తున్న అనేక సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించి, అన్ని శాఖలతో సమన్వయం చేస్తున్నామని తెలిపారు. ప్రజావాణికి స్పందన లేదని విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆక్షేపించారు. ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అధికారానికి దూరమైన విపక్షం ఎన్ని విమర్శలు చేసినా.. తాము మరింత ముందుకు వెళ్తామన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో వనరులు ప్రజలకు ఉపయోగపడేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజావాణి విజయవంతం చేసిన చిన్నారెడ్డి, దివ్యాదేవరాజన్‌కు భట్టి అభినందనలు తెలిపారు.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :