ఆ నలుగురూ వచ్చేశారు

Eenadu icon
By Telangana News Desk Published : 25 Feb 2026 04:36 IST Ee Font size
  • A
  • A+
  • A++
7 min read

ఈనాడు, హైదరాబాద్‌: మావోయిస్టు పార్టీ చరిత్రలో అత్యంత కీలక లొంగుబాటు.. మునుపెన్నడూ లేని రీతిలో ఒకేసారి నలుగురు అగ్రనేతలు జనజీవన స్రవంతిలో కలిశారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీ అయిన పొలిట్‌బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి ఎలియాస్‌ దేవ్‌జీ ఎలియాస్‌ కుమ్ముదాదా (62), కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి ఎలియాస్‌ సంగ్రామ్‌ (76), తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు ఎలియాస్‌ దామోదర్‌ (47), రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నర్సింహారెడ్డి ఎలియాస్‌ గంగన్న (62) మంగళవారం డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. దేవ్‌జీ, సంగ్రామ్‌లకు రూ.25 లక్షల చొప్పున.. మిగిలిన ఇద్దరికీ రూ.20 లక్షల చొప్పున పునరావాసం చెక్కుల్ని అందించారు. 

సుదీర్ఘ ప్రస్థానం

దేవ్‌జీ 44 ఏళ్లు, రాజిరెడ్డి 46 ఏళ్లు, దామోదర్‌ 28 ఏళ్లు, గంగన్న 36 ఏళ్లు పార్టీతో కొనసాగించిన అనుబంధం.. ఈ లొంగుబాటుతో ముగిసింది. ఈ సందర్భంగా ఎలాంటి ఆయుధాల్ని ప్రదర్శించకపోవడం గమనార్హం.

పార్టీలో ప్రస్తుతం ఒకే ఒక్క పొలిట్‌బ్యూరో సభ్యుడు మిసిర్‌బెస్రా ఎలియాస్‌ సునిర్‌మాల్‌ మాత్రమే మిగిలారు. తెలంగాణ నుంచి అజ్ఞాతంలో ఉన్నవారు 11 మంది మాత్రమే. తాజా లొంగుబాటు.. మావోయిస్టులపై లభించిన ప్రధాన విజయమని తెలంగాణ పోలీసులు ప్రకటించారు. దీంతో మావోయిస్టు పార్టీ శకం చివరిదశకు చేరినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీకి ఏడాది కాలంగా సారథ్యం కరవైందని తేలింది. గత ఏడాది పార్టీ చీఫ్‌ బస్వరాజ్‌ మృతిచెందిన అనంతరం.. దేవ్‌జీ చీఫ్‌గా వ్యవహరించారనే ప్రచారం జరిగినా, అది వాస్తవం కాదని డీజీపీ వెల్లడించారు. 

జగిత్యాల జైత్రయాత్ర ప్రభావంతో..

జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిరుపతి.. ఇంటర్‌ చదువుతున్నప్పుడే ర్యాడికల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఆర్‌ఎస్‌యూ)లో చేరి.. టౌన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. 1978 నాటి జగిత్యాల జైత్రయాత్ర ప్రభావంతో 1982లో ‘పీపుల్స్‌వార్‌’లో చేరారు. పార్టీ అగ్రనేత గణపతి సూచనల మేరకు రాజిరెడ్డితో కలిసి దండకారణ్యానికి వెళ్లారు. 1984-87లో గడ్చిరోలి జిల్లా సిరొంచ దళానికి, 1987-89లో పెరిమిలి దళానికి కమాండర్‌గా పనిచేశారు. 1989లో గడ్చిరోలి డివిజన్‌ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. 1991లో పెరిమిలి దళ సభ్యురాలు అరికె జైనీ ఎలియాస్‌ సృజనను వివాహం చేసుకున్నారు. 1993లో ఉత్తర గడ్చిరోలి సబ్‌డివిజన్‌ కార్యదర్శిగా.. 1995లో స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2001లో కేంద్ర కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి కీలకమైన సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ (సీఎంసీ) సభ్యుడిగా కొనసాగారు. 2017లో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు. 

జైలు నుంచి పారిపోయి అజ్ఞాతవాసం..

పెద్దపల్లి జిల్లా మంథని మండలం శాస్త్రులపల్లెకు చెందిన రాజిరెడ్డి 1974లో ఆర్‌ఎస్‌యూలో చేరారు. 1976లో కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల్లో నమోదైన కేసుల్లో అరెస్టయి ఏడాది తర్వాత విడుదలయ్యారు. 1980లోనే పీపుల్స్‌వార్‌లో చేరగా.. 1982లో ఆయన భార్య రత్తమ్మ కూడా ఉద్యమ బాట పట్టారు. రాజిరెడ్డి గడ్చిరోలి డివిజన్‌ కమిటీ సభ్యుడిగా, కార్యదర్శిగా పనిచేసి.. 1987లో దండకారణ్య కమిటీ తొలి కార్యదర్శిగా నియమితులయ్యారు. ఓ కేసులో అరెస్టయి.. 1988 ఆగస్టులో ఆదిలాబాద్‌ సబ్‌జైలు నుంచి పారిపోయి అడవిబాట పట్టారు. 1990లో కేంద్ర కమిటీ సభ్యుడిగా నియమితుడయ్యారు. దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ (డీకేఎస్‌జడ్‌సీ), మహారాష్ట్ర కమిటీలకు మార్గనిర్దేశకుడిగా వ్యవహరించారు. 2001లో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళలతో కూడిన సౌత్‌వెస్ట్‌ రీజినల్‌ బ్యూరోకు ఇన్‌ఛార్జి అయ్యారు. 2007లో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నియమితుడయ్యాక కేరళలో అరెస్టయ్యారు. రెండేళ్ల తర్వాత విడుదలై అజ్ఞాతంలోకి వెళ్లారు. 2022 నుంచి డీకేఎస్‌జడ్‌సీ ఇన్‌ఛార్జిగా కొనసాగారు.

ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన దామోదర్‌ 1996లో రాయనిగూడెంలో పదో తరగతి చదువుతున్న సమయంలోనే ఆర్‌ఎస్‌యూలో చేరారు. రెండేళ్ల అనంతరం సమీప బంధువు బడే నాగేశ్వర్‌రావు ప్రోద్బలంతో పీపుల్స్‌వార్‌లో చేరి ఏటూరునాగారం-మహదేవ్‌పూర్‌ దళ సభ్యుడిగా పనిచేశారు. 2000లో ఏటూరునాగారం దళ డిప్యూటీ కమాండర్‌గా, 2001లో కొత్తగూడెం-పాల్వంచ ఏరియా కమిటీ కమాండర్‌గా, 2005లో ఏటూరునాగారం-మహదేవ్‌పూర్‌ కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2006లో ఖమ్మం-కరీంనగర్‌-వరంగల్‌ (కేకేడబ్ల్యూ) కమిటీ సభ్యుడిగా, తర్వాత కార్యదర్శిగా పనిచేశారు. 2015లో తెలంగాణ కమిటీ సభ్యుడిగా, 2019లో మిలిటరీ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. గత ఏడాది నుంచి తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా కొనసాగారు.

ఏపీలోని ఉమ్మడి గుంటూరు జిల్లా కాకుమాను మండలం వల్లూరుకు చెందిన గంగన్న నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ చదువుతున్న సమయంలో 1987లో ఆర్‌ఎస్‌యూలో చేరారు. 1990లో పీపుల్స్‌వార్‌ దుర్గి దళానికి ఇన్‌ఛార్జిగా నియమితులయ్యారు. 1995లో సౌత్‌ కోస్టల్‌ బెల్ట్‌ కమిటీకి బదిలీ అయి మూడేళ్లు పనిచేశారు. అనంతరం గుంటూరు డివిజనల్‌ కమిటీ సభ్యుడిగా 2001 వరకు పనిచేశారు. 2002 ఫిబ్రవరిలో విజయవాడలో అరెస్టయి రెండేళ్ల అనంతరం విడుదలయ్యారు. 2005లో ఏవోబీఎస్‌జడ్‌సీకి బదిలీ అయి రాజకీయ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. 2008లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. 2010లో బొకారోలో అరెస్టయి నాలుగేళ్ల తర్వాత విడుదలై అడవిబాట పట్టారు. 2020లో డీకేఎస్‌జడ్‌సీకి బదిలీ అయి.. అక్కడి కేడర్‌కు రాజకీయ శిక్షణ ఇచ్చారు. గత ఏడాది మే నెలలో తెలంగాణ రాష్ట్ర కమిటీకి బదిలీ అయ్యారు. ఈ కార్యక్రమంలో శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీ మహేశ్‌ భగవత్, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ విజయ్‌కుమార్, ఎస్‌ఐబీ చీఫ్‌ సుమతి, ఆపరేషన్స్‌ అదనపు డీజీపీ అనిల్‌కుమార్, గ్రేహౌండ్స్‌ ఎస్పీ రాఘవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

1993 నుంచి ఇప్పటివరకు తెలంగాణకు చెందిన 5865 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారికి ఎలాంటి ప్రాణభయం లేదు. అవసరమైతే మా ప్రాణాలు అడ్డు వేస్తాం. దేవ్‌జీ మావోయిస్టు ప్రధానకార్యదర్శిగా ఇంకా నియమితులు కాలేదు. ఒకవేళ కేంద్ర కమిటీ సమావేశమై ఉంటే ఆయన నియమితులయ్యే అవకాశముండేది. తెలంగాణలోనే పుట్టిన మావోయిస్టు పార్టీ ఇక్కడే అంతమైనట్లు కనిపిస్తోంది. కీలకమైన నలుగురు లొంగిపోవడమే అందుకు తార్కాణం. ఆ పార్టీ గతంలో చాలాసార్లు ఒడిదొడుకులు ఎదుర్కొని పుంజుకున్నా.. ఈసారి ఆ అవకాశాల్లేవు. గణపతి ఎక్కడో పట్టణ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారముంది. ఆయన లొంగుబాటుకూ ప్రయత్నిస్తున్నాం. తెలంగాణలో చివరిసారిగా 2019లోనే రిక్రూట్‌మెంట్లు ఆగిపోయాయి. అజ్ఞాతంలో ఉన్న 11 మంది తెలంగాణ మావోయిస్టుల్లో ముప్పిడి సాంబయ్య మాత్రమే క్రియాశీలంగా ఉన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాల నాయకత్వంలో ‘మావోయిస్టు ముక్త్‌ భారత్‌’ కార్యక్రమం వేగంగా కొనసాగుతోందని, దేవ్‌జీ, రాజిరెడ్డి, దామోదర్, నర్సింహారెడ్డిలు లొంగిపోయి ప్రజాస్వామ్య బాట పట్టడం మంచి పరిణామమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ పేర్కొన్నారు. ‘ఆపరేషన్‌ కగార్‌’ కోసం తెలంగాణ పోలీసులు బాగా పనిచేస్తున్నారని, డీజీపీ శివధర్‌రెడ్డి, ఐజీ సుమతిలను బండి సంజయ్‌ ప్రశంసించారు. 

అనారోగ్య కారణాల వల్లే రహస్య జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలోకి వచ్చానే తప్ప.. వ్యక్తిగత జీవితం కొనసాగించేందుకు మాత్రం కాదు. ప్రజల సమస్యలపై చట్టబద్ధంగానే పనిచేయాలని నిర్ణయించుకున్నా. ఇకముందూ నా రాజకీయ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నా. దశాబ్దాల తరబడి నమ్మిన సిద్ధాంతాల మేరకే ముందుకు సాగుతా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీడియా అడిగే ప్రశ్నలకు సమయాభావం వల్ల సమగ్రంగా జవాబివ్వలేను. 15 నిమిషాల పాటు చెప్పాల్సిన జవాబును రెండు నిమిషాల్లో ముగిస్తే అపార్థాలకు, అనర్థాలకు, అనవసర చర్చలకు దారితీస్తుంది. దాన్ని నివారించేందుకు ఎక్కువగా మాట్లాడొద్దని నిర్ణయించుకున్నా. ఇది మీడియాను అగౌరవపర్చడం ఎంతమాత్రం కాదని విజ్ఞప్తి చేస్తున్నా. కొంతకాలం తర్వాత మీరు అడిగే ఎలాంటి ప్రశ్నలకైనా సుదీర్ఘంగా సమాధానాలిస్తాం.

మావోయిజం ఎప్పుడూ ముగియదు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. సాయుధ పోరాటం ముగిసిందా అంటే అవుననీ.. కాదనీ చెప్పలేం. ఇకపై మేం ప్రజల తరఫున వారితో నిలబడి పని చేస్తాం. ప్రజాస్వామిక పద్ధతుల్లోనే వ్యవహరిస్తాం కానీ.. పార్లమెంటరీ విధానంలోకి వెళ్లాలనేది మా ఉద్దేశం కాదు. ప్రజల్ని సంఘటితపరిచేందుకు.. ఇంతకాలం మేం చెప్పిన రాజకీయాలు, సిద్ధాంతాలను వదులుకోకుండానే చట్టబద్ధమైన రీతిలో పనిచేస్తాం. అవకాశం ఉన్నంతవరకు ప్రజల పోరాటాల వెనక నిలుస్తాం.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఫీజుల నియంత్రణకు కమిటీ రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు విశ్రాంత న్యాయమూర్తి లేదా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటుచేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
  • పది పరీక్షలకు హాజరవుతున్నా.. అమ్మ చంకలో బిడ్డనే! ఈ చిత్రంలో అమ్మ చంకలో ఉన్న బాలిక పేరు సుమిత. పుట్టుకతోనే మూగ, వినికిడి లోపంతో బాధపడుతోంది. ఎత్తు 1.5 అడుగులు మాత్రమే.
  • పసిపిల్లల హృదయాలయం కల్లాకపటం తెలియని పసి మనసులు.. హృద్రోగ సమస్యలతో తల్లడిల్లుతుంటే.. మేమున్నాం అంటూ అక్కున చేర్చుకుంటోంది సిద్దిపేట జిల్లా కొండపాకలోని శ్రీసత్యసాయి సంజీవని సెంటర్‌ ఫర్‌ చైల్డ్‌ హార్ట్‌కేర్‌ అండ్‌ రీసెర్చ్‌.
  • మీరే ప్రభుత్వానికి కళ్లు.. చెవులు సివిల్‌ సర్వీసెస్‌ అధికారులకు ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌ అందించేందుకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రానికి హార్వర్డ్‌ వర్సిటీ రానుందని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
  • అధికార గర్వంతో పేదల ఇళ్లు కూల్చారు భూదాన్‌ భూముల్లో నిర్మించిన ఇళ్లను కూల్చడంతో వీధినపడిన నిరుపేదల పక్షాన సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని, అసెంబ్లీలోనూ గళం విప్పి ప్రభుత్వంతో కొట్లాడతామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు.
  • ఎప్‌సెట్‌ రద్దు చేయాలి రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఈఏపీసెట్‌ (ఎప్‌సెట్‌)ను రద్దు చేయాలని తెలంగాణ విద్యా కమిషన్‌ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
  • నేరాలను ఆపేది చదువే! నేర ప్రవృత్తికి... అక్షరాస్యతకు మధ్య సంబంధం ఉందని చెబుతున్నాయి గణాంకాలు. రాష్ట్రంలో ఏటా సగటున 5 వేల మంది విచారణ ఖైదీలు, 2 వేల మంది శిక్ష పడ్డ ఖైదీలు జైళ్లకు వస్తున్నారు.
  • కాళేశ్వరంలో భారాస అవినీతికి భాజపా సహకారం ‘కాళేశ్వరం సహా నీటిపారుదల ప్రాజెక్టుల్లో దోచుకున్న సొమ్ములో కొంతైనా పాపపరిహారం కింద కేసీఆర్‌ పేదలకు పంచి ప్రజలను క్షమాపణ కోరాలి.
  • న్యుమోనియాకు బిట్స్‌ హైదరాబాద్‌ ఆచార్యుల కొత్త టీకా! న్యుమోనియా నియంత్రణకు కొత్త టీకాను కనుగొన్నట్లు బిట్స్‌ హైదరాబాద్‌ ఆచార్యులు, పరిశోధకులు యోగేశ్వర్‌ దేవరకొండ, ఎం.వి.ఎన్‌. జనార్దన్‌రెడ్డి, అరుణిమ, కీర్తిమాన్‌ స్యాల్‌లు గురువారం తెలిపారు. ‘‘స్ట్రెప్టోకోకల్‌ న్యుమోనియా కట్టడికి ఏడాది నుంచి పరిశోధనలు చేస్తున్నా.
  • ప్లాస్టిక్‌ వ్యర్థాలతో ఇం‘ధనం’! రోజువారీ వినియోగ వస్తువుల ప్యాకేజింగ్‌ వ్యర్థాలను ఇంధనంగా మార్చే సాంకేతికతను హైదరాబాద్‌లోని భారతీయ రసాయన సాంకేతిక పరిశోధన సంస్థ ్బఐఐసీట్శీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
  • కొండాపూర్‌ భూములపై స్టేటస్‌కో ఇవ్వం హైదరాబాద్‌ కొండాపూర్‌లోని సర్వే నం.59లో ఉన్న 57.09 ఎకరాల వివాదాస్పద భూమిపై స్టేటస్‌కో ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
  • 8.68 లక్షల భూభారతి దరఖాస్తులు ఏమయ్యాయి?: హరీశ్‌రావు ‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రెవెన్యూ సమస్యలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.. భూభారతి పేరిట రెవెన్యూ సదస్సుల్లో ఇప్పటివరకు 8.68 లక్షల దరఖాస్తులు వచ్చినా.. పరిష్కారం కాలేదు’ అని శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఆరోపించారు.
  • ఖనిజాల పరిశోధనలకు ఎన్‌ఎండీసీ, ఐఐటీ-హెచ్‌ భాగస్వామ్యం ఖనిజాల పరిశోధనల కోసం హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)తో జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ(ఎన్‌ఎండీసీ) పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఒప్పందం చేసుకుంది.
  • ఇది పదాలు పలికించే ‘పలక’ తల్లి ఒడిని వదిలి అప్పుడప్పుడే బడిబాట పట్టే బాలలు భయం, బెరుకు లేకుండా... అలవోకగా అక్షరాలు, పదాలు నేర్చుకునేందుకు సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం నాగారం జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు కేతావత్‌ తావుర్యానాయక్‌ ‘మైస్లేట్‌’ పేరుతో ప్రత్యేకంగా ఓ పలకను రూపొందించారు.
  • అరుదైన ఖనిజాలపై ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలిసి పనిచేయాలి: ఎన్‌సీఎంఎం నేటి ఆధునిక ప్రపంచంలో అరుదైన ఖనిజాలకు అధిక ప్రాధాన్యముందని, ఈ రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరముందని నేషనల్‌ క్రిటికల్‌ మినరల్‌ మిషన్‌(ఎన్‌సీఎంఎం) కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది.
  • టీఎస్‌జీఆర్‌ఈఏ అధ్యక్షుడిగా పేరి వెంకట్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం(టీఎస్‌జీఆర్‌ఈఏ) అధ్యక్షుడిగా పేరి వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎంసీ లింగన్నలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
  • అగ్నిమాపక శాఖలోని సౌకర్యాలపై వివరణివ్వండి: హైకోర్టు విపత్తులను ఎదుర్కోవడానికి అగ్నిమాపక శాఖలో ఉన్న సౌకర్యాలు, వనరులు, పరికరాల స్థితిగతులపై వివరాలు సమర్పించాలంటూ ప్రభుత్వానికి గురువారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
  • సంక్షిప్త వార్తలు కాంగ్రెస్‌ పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న పీసీసీ మాజీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెట్టి కుసుమ కుమార్, మాజీ ఎంపీ వి.హనుమంతరావులకు రాజ్యసభ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు విజ్ఞప్తి చేశారు.
  • వసతులు లేవు.. అధ్యాపకులు లేరు విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సగటున 72 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 80 శాతం డిగ్రీ కళాశాలల్లో మౌలిక సౌకర్యాల కొరత వేధిస్తోంది.
  • మహిళా సంఘాల్లోని 42 లక్షల మందికి 30 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు టీ-డయాగ్నస్టిక్స్‌ ద్వారా 42 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు 30 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు... గ్రామీణ మహిళలకు డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ రూపకల్పన సహా పలు కార్యక్రమాలకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది.