అసలు సవాలు ఇప్పుడు..

Eenadu icon
By Sports News Desk Updated : 22 Feb 2026 11:19 IST Ee Font size
  • A
  • A+
  • A++
5 min read

గ్రూప్‌ దశలో కాస్త సవాలు ఎదురైనా అంతిమంగా టీమ్‌ఇండియాదే పైచేయి. పాకిస్థాన్‌ సహా ఏ జట్టూ భారత్‌ను అడ్డుకోలేకపోయింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అజేయంగా సూపర్‌-8లోకి అడుగు పెట్టింది. కానీ ఇక్కడి నుంచి మాత్రం ప్రయాణం అంత సాఫీగా ఉండకపోవచ్చు. ఏ ప్రత్యర్థితోనైనా పోరు కఠినమే. అందులోనూ ఈ దశలో తొలి మ్యాచ్‌ దక్షిణాఫ్రికాతో. గ్రూప్‌ దశలో భారత్‌ను మించి ఆధిపత్యం చలాయించిన జట్టది. కాబట్టి సూపర్‌-8లో శుభారంభం చేయాలంటే సూర్యసేన తమ ఆటను టాప్‌ గేర్‌లోకి తీసుకెళ్లాల్సిందే. 

టీ20ప్రపంచకప్‌లో ఆతిథ్య భారత్‌కు అసలైన సవాల్‌! సూపర్‌ ఫామ్‌లో ఉన్న దక్షిణాఫ్రికాను ఆదివారం సూపర్‌-8 మ్యాచ్‌లో ఢీకొనబోతోంది టీమ్‌ఇండియా. భారత్‌ లాగే గ్రూప్‌ దశను నాలుగు విజయాలతో ముగించింది సఫారీ జట్టు. రెండు నెలల ముందు భారత్‌లో టీ20 సిరీస్‌ ఆడడం ఆ జట్టుకు అతి పెద్ద సానుకూలత. ఆ సిరీస్‌లో 1-3తో ఓడినప్పటికీ.. ఆతిథ్య జట్టుకు గట్టి పోటీనే ఇచ్చింది దక్షిణాఫ్రికా. ఆ సిరీస్‌ అనుభవంతోనే టీ20 ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో ఆ జట్టు అదరగొట్టింది. గ్రూప్‌ దశలో అజేయంగా నిలిచినప్పటికీ.. భారత్‌ ఆట సాధికారికంగా సాగలేదు. నమీబియాతో మినహా మ్యాచ్‌ల్లో తడబాటు తప్పలేదు. జోరుమీదున్న సఫారీలపై నెగ్గాలంటే భారత్‌ తన అత్యుత్తమ ఆటను ఆడాల్సిందే.

అభిషేక్‌ ఇప్పుడైనా?:ఎన్నో అంచనాలతో టీ20 ప్రపంచకప్‌లో అడుగు పెట్టిన అభిషేక్‌ శర్మ.. గ్రూప్‌ దశ అంతా అసలు ఖాతానే తెరవడని ఎవ్వరూ ఊహించి ఉండరు. అనారోగ్యంతో నమీబియా మ్యాచ్‌ ఆడని అతను.. మిగతా మూడు మ్యాచ్‌ల్లోనూ డకౌటయ్యాడు. మరి సూపర్‌-8 నుంచి అయినా అతను అసలు ఆటను బయటికి తీస్తాడేమో అని అభిమానులు ఆశతో ఉన్నారు. అతడి ఓపెనింగ్‌ భాగస్వామి ఇషాన్‌ కిషన్‌ మాత్రం జోరుమీదున్నాడు. పాక్‌పై విధ్వంసక ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించిన అతడిపై మంచి అంచనాలున్నాయి. మూడో నంబర్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ.. చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడుతున్నప్పటికీ.. స్ట్రైక్‌ రేట్‌ అతడికి సమస్యగా మారింది. అతను మరింత ధాటిగా ఆడాల్సిన అవసరముంది. కెప్టెన్‌ సూర్యకుమార్‌ అమెరికాపై విలువైన ఇన్నింగ్స్‌ ఆడాక ఇబ్బంది పడుతున్నాడు. తన సహజ శైలిలో చెలరేగలేకపోతున్నాడు. హార్దిక్‌ పాండ్య, శివమ్‌ దూబె లయలోనే ఉన్నారు. చివరి లీగ్‌ మ్యాచ్‌లో జట్టుకు భారీ స్కోరు సాధించి పెట్టింది వీళ్లే. రింకుకు పెద్దగా అవకాశాలు రాలేదు. అహ్మదాబాద్‌ పిచ్‌ స్పిన్‌కు అనుకూలమైనప్పటికీ.. ప్రధానంగా పేసర్ల మీదే ఆశలు పెట్టుకుంది దక్షిణాఫ్రికా. రబాడ, యాన్సెన్, ఎంగిడి, బోష్‌లతో ఆ జట్టు పేస్‌ విభాగం ఎంతో మెరుగ్గా కనిపిస్తోంది. స్పిన్‌లో ఆ జట్టు బలహీనమే. కేశవ్‌ మహరాజ్‌ భారత బ్యాటర్లను అడ్డుకోగలడా అన్నది సందేహమే. అతడికి కెప్టెన్‌ మార్‌క్రమ్‌ పార్ట్‌టైం స్పిన్‌తో సహకారం అందిస్తాడు.

ప్రమాదకర లైనప్‌:దక్షిణాఫ్రికాకు ఎంతో లోతైన, ప్రమాదకర బ్యాటింగ్‌ లైనప్‌ ఉంది. ఆ జట్టు ప్రధాన బ్యాటర్లందరూ ఫామ్‌లో ఉన్నారు. మార్‌క్రమ్, డికాక్‌లతో స్థిరమైన ఓపెనర్లు ఆ జట్టు సొంతం. తర్వాత రికెల్టన్, బ్రెవిస్, స్టబ్స్, మిల్లర్‌లతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌కు తిరుగులేదు. 7, 8 స్థానాల్లో ఆడే బోష్, యాన్సెన్‌ సైతం బ్యాటుతో చెలరేగగలరు. డికాక్, బ్రెవిస్‌ లాంటి బ్యాటర్లను త్వరగా పెవిలియన్‌ చేర్చకపోతే కష్టమే. గ్రూప్‌ దశలో ఉత్తమ ప్రదర్శన చేసిన భారత బౌలర్లు.. ఈ మ్యాచ్‌లో ఎలా రాణిస్తారో చూడాలి. కొత్త బంతితో అదరగొడుతున్న బుమ్రా.. టాప్‌ఆర్డర్‌కు కళ్లెం వేయాల్సిన అవసరముంది. పేస్‌ ఆల్‌రౌండర్లు హార్దిక్, దూబె కొన్ని ఓవర్లు పంచుకుంటారు. నిలకడగా రాణిస్తున్న అక్షర్, వరుణ్‌ స్పిన్నర్లకు అనుకూలించే అహ్మదాబాద్‌లో.. బలమైన దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ విభాగానికి సవాలు విసురుతారేమో చూడాలి. పిచ్‌ను బట్టి మూడో స్పిన్నర్‌గా కుల్‌దీప్‌ను లేదా రెండో పేసర్‌గా అర్ష్‌దీప్‌ను తుది జట్టులోకి తీసుకుంటారు.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తుంది. నెదర్లాండ్స్‌తో భారత్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌లోనూ బంతి బాగా తిరిగింది. డచ్‌ స్పిన్నర్‌ ఆర్యన్‌ దత్‌ 4 ఓవర్లలో 19 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అనంతరం వరుణ్, అక్షర్‌ అదరగొట్టారు. కొంచెం మందకొడిగా ఉన్న ఈ పిచ్‌పై బంతి బ్యాట్‌ మీదికి రాక బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. ఆదివారం కూడా పిచ్‌ అలాగే ఉండొచ్చని అంచనా. కానీ రెండు జట్లకూ బలమైన బ్యాటింగ్‌ విభాగాలున్న నేపథ్యంలో స్పిన్నర్లను కొంచెం జాగ్రత్తగా ఆడుకుంటే పెద్ద స్కోర్లే నమోదయ్యే అవకాశాలున్నాయి.

దక్షిణాఫ్రికాతో సూపర్‌-8 మ్యాచ్‌ ముంగిట టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు గట్టి దెబ్బ తాకింది. శనివారం ప్రాక్టీస్‌ సందర్భంగా హార్దిక్‌ పాండ్య కొట్టిన షాట్‌ కాలికి బలంగా తాకడంతో అతను బాధతో విలవిలలాడుతూ కింద పడుకున్నాడు. తర్వాత లేచి నడిచే ప్రయత్నం చేసినా.. అడుగులు తడబడ్డాయి. గాయం తీవ్రత ఎంత అన్నది తెలియరాలేదు. టోర్నీలో అతను ఒకే మ్యాచ్‌ ఆడాడు. అమెరికాతో ఆరంభ పోరుకు జ్వరం వల్ల బుమ్రా అందుబాటులో లేకపోవడంతో సిరాజ్‌ తుది జట్టులో ఆడాడు. 3 వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. హర్షిత్‌ రాణా టోర్నీ ఆరంభానికి ఒక్క రోజు ముందు గాయపడితే.. అతడి స్థానంలో సిరాజ్‌ జట్టులోకి వచ్చాడు.

భారత్‌:అభిషేక్, ఇషాన్, తిలక్, సూర్యకుమార్‌ (కెప్టెన్‌), హార్దిక్, దూబె, రింకు, అక్షర్, కుల్‌దీప్‌/అర్ష్‌దీప్, బుమ్రా, వరుణ్‌; దక్షిణాఫ్రికా: మార్‌క్రమ్‌ (కెప్టెన్‌), డికాక్, రికెల్టన్, బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్, బోష్, యాన్సెన్, కేశవ్, రబాడ, ఎంగిడి. 

టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో భారత్‌ ఆడిన మ్యాచ్‌లు. అయిదుసార్లు నెగ్గి, రెండు మ్యాచ్‌లు ఓడింది.

భారత్, దక్షిణాఫ్రికా తలపడ్డ టీ20లు. 21 మ్యాచ్‌ల్లో భారత్‌ గెలవగా.. 13 సార్లు దక్షిణాఫ్రికా నెగ్గింది. ఒక మ్యాచ్‌ టై అయింది. 

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Feb 2026 02:34 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • జూన్‌ 14న పాక్‌తో భారత్‌ ఢీ జూన్‌ 14న పాకిస్థాన్‌తో పోరుతో భారత జట్టు మహిళల టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ వేటను ఆరంభించనుంది. ఇంగ్లాండ్‌ ఆతిథ్యమిచ్చే ఈ టోర్నీ షెడ్యూలును ఐసీసీ.. మంగళవారం ప్రకటించింది.
  • సెమీస్‌లో ఇంగ్లాండ్‌ ఇంగ్లాండ్‌ అదరగొట్టింది. సూపర్‌ 8లో వరుసగా రెండో విజయంతో టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. కెప్టెన్‌ బ్రూక్‌ సూపర్‌ శతకం సాధించిన వేళ.. ఆసక్తికర పోరులో పాకిస్థాన్‌ను ఇంగ్లాండ్‌ మట్టికరిపించింది.
  • సచిన్‌ను ఔటివ్వడం తప్పే అది భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్టు మ్యాచ్‌. ఆసీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జేసన్‌ గిలెస్పీ బంతి సచిన్‌ తెందుల్కర్‌ ప్యాడ్లకు చాలా ఎత్తులో తగిలింది. గిలెస్పీ, అతడి సహచరులు గట్టిగా అప్పీలు చేయడంతో దిగ్గజ అంపైర్‌ స్టీవ్‌ బక్నర్‌.. సచిన్‌ను ఎల్బీడబ్ల్యూగా ఔటిచ్చాడు.
  • జట్టును వీడిన రింకు! టీమ్‌ఇండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ రింకు సింగ్‌ గురువారం జింబాబ్వేతో టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-8 మ్యాచ్‌కు అనుమానంగా మారాడు. కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా అతడు జట్టును వీడినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
  • భారత్‌కే పంచ్‌ ఆస్ట్రేలియాలో టీ20 సిరీస్‌ సాధించిన ఉత్సాహంలో వన్డేల్లోనూ బోణీ కొట్టాలనుకున్న భారత మహిళల జట్టుకు పంచ్‌! మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విఫలమైన హర్మన్‌ప్రీత్‌ బృందం..
  • బోణీ ఎవరిదో? టీ20 ప్రపంచకప్‌లో ఆసక్తికర సమరానికి వేళైంది. సూపర్‌-8లో ఇంకా గెలుపు ఖాతా తెరవని శ్రీలంక, న్యూజిలాండ్‌ బుధవారం అమీతుమీ తేల్చుకోనున్నాయి. సెమీస్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ పోరులో గెలవడం శ్రీలంకకు తప్పనిసరి.
  • జమ్మూకశ్మీర్‌ 284/2 కర్ణాటకతో రంజీ ట్రోఫీ ఫైనల్లో జమ్మూకశ్మీర్‌ అదరగొడుతోంది. మంగళవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో మొదటి రోజు జమ్మూకశ్మీర్‌ సంపూర్ణ ఆధిపత్యం కనబరిచింది.
  • సంక్షిప్త వార్తలు (2) అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ ఎదుగుదలలో కీలకపాత్ర పోషించిన కోచ్‌ జొనాథన్‌ ట్రాట్‌ (ఇంగ్లాండ్‌) ఆ జట్టుకు వీడ్కోలు పలికాడు. టీ20 ప్రపంచకప్‌లో అఫ్గాన్‌ జట్టు సూపర్‌-8కు అర్హత సాధించకపోవడంతో అతడు కోచ్‌ పదవి నుంచి తప్పుకున్నాడు.
  • అక్షర్‌ ఆడుతున్నట్లే.. దక్షిణాఫ్రికాతో సూపర్‌-8 మ్యాచ్‌కు ఫామ్‌లో ఉన్న స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ను పక్కన పెట్టి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న భారత జట్టు యాజమాన్యం.. జింబాబ్వేతో తర్వాతి పోరుకు అతణ్ని తుది జట్టులోకి తీసుకోవడం లాంఛనంగా కనిపిస్తోంది.