ఎవరు గొప్ప?

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

నన్ను మించిన వారెవరూ లేరు అనే అహంభావం వల్ల మనుషుల మధ్య గొడవలు జరగడం సహజమే. కానీ మునులు, మహాపురుషులు, దేవతలు సైతం వాటి ప్రభావంలో పడి, తరవాత పశ్చాత్తాపం చెందడం ఆశ్చర్యపరుస్తుంది.
పరమేశ్వరుడి ‘డమరుకం’ నుంచి సంగీతం ఆవిర్భవించింది. శ్రవణ శుభగమైన ఆ సంగీతకళను లోకానికి అందించి పునీతం చేయాలని మహేశ్వరుడు సంకల్పించాడు. అదే సమయంలో తుంబురుడు, నారదుడు పరమేశ్వరుడి దర్శనార్థం వచ్చారు. ఆ సంగీత విద్యను తమకు నేర్పాలని అర్థించారు. అర్ధనారీశ్వరుడు అంగీకరించాడు.
తుంబురుడు సంగీతం నేర్చుకుని దేవలోకంలో ప్రచారం సాగించాడు. నారదుడు భూలోకంలో సంచారం చేస్తూ సంగీత కళను పరివ్యాప్తం చేయసాగాడు. కొంతకాలం గడిచింది. కాకతాళీయంగా వారిద్దరూ ఓసారి కలిశారు. సంగీతంలో నేను నిష్ణాతుణ్ని అంటే నేను గొప్పవాణ్ని అని వాదోపవాదాలు మొదలయ్యాయి. తీర్పు కోసం సరస్వతీదేవి దగ్గరికి వెళ్లారు. ‘ఇద్దరూ ప్రవీణులే’ అంటూ తప్పించుకుందామె. శివుడి చెంతకు వెళ్లి తమ కలహాన్ని తీర్చమని కోరారు. శివుడూ నొప్పింపక, తానొవ్వక తప్పించుకున్నాడు.అప్పుడిక పార్వతీదేవిని ఆశ్రయించారు. ‘మీరు ఆంజనేయుణ్ని అడగండి. ఆయన గొప్ప సంగీత విద్వన్మణి!’ అని సలహా ఇచ్చిందామె.
తుంబుర నారదులు వింధ్య పర్వత ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న హనుమను చేరి, ‘పవనసుతా! మమ్మల్ని పరీక్షించి మా ఇద్దరిలో గొప్ప ప్రతిభాశాలి ఎవరో చెప్పాలి’ అని కోరారు. ‘మీ వీణలు ఇవ్వండి ముందు’ అన్నాడు వాయుసుతుడు. తుంబురుడు తన ‘కళావతి’ని, నారదుడు ‘మహతి’ని హనుమకు ఇచ్చి ఎదుట కూర్చున్నారు. మారుతి తన సుమధుర స్వరంతో గానం చేయడం మొదలుపెట్టాడు. తుంబుర నారదులు ఆ మధుర మనోహర ఆలాపనను వింటూ పరవశులైపోయారు. తన అపూర్వ గానమాధుర్యానికి అక్కడి కొండరాళ్లన్నీ కరిగి నీరై ప్రవహిస్తుంటే హనుమ హఠాత్తుగా గానం ఆపేసి, చేతిలోని రెండు వీణలను ప్రవాహంలోకి విసిరేశాడు. గానం ఆగిపోగానే ఆ నీళ్లన్నీ రాళ్లుగా మారాయి. తుంబుర నారదులు అవాక్కయ్యారు. ‘అయ్యో, మా వీణలేవీ?’ అని వాపోయారు. ‘మీరిద్దరూ మీ సంగీతంతో రాళ్లను నీళ్లుగా మార్చి, వీణలు తీసుకుని పోవచ్చు’ అన్నాడు హనుమంతుడు. తుంబురుడు గానం చేశాడు. రాళ్లు రాళ్లుగానే ఉన్నాయి. తెల్లమొహం వేసి, అలసి పాడటం మానేశాడు. నారదుడూ స్వరం సవరించాడు. రాళ్లలో మార్పులేదు. మళ్లీ హనుమ గానం చేసి రాళ్లను నీళ్లుగా మార్చి వీణలు బయటికి తీసి వారికిచ్చాడు. ‘ఏ విద్యలోనైనా అహంకారం పనికిరాదు. గర్వం పతనానికి నాంది. నిజానికి మీరిద్దరూ సమానులే. మీ విధులను మీరు నిర్వర్తించండి’ అన్నాడు. హనుమకు నమస్కరించి తుంబుర నారదులు తమ వీణలతో తిరుగుముఖం పట్టారు. ‘నేనే గొప్పవాణ్ని’ అన్న అహంకారం ఎక్కువైతే ఎవరికైనా భంగపాటు తప్పదని ఈ వృత్తాంతం తెలియజేస్తుంది.
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :