Chandrababu: దేవరపల్లి ఘటన.. బాధ్యులపై చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశం

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

అమరావతి: పోలవరం జిల్లా రంపచోడవరంలోని దేవరాపల్లి ఆశ్రమ బాలుర వసతిగృహంలో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu ).. అధికారులతో సమీక్ష నిర్వహించారు. 92 మంది విద్యార్ధులకు వాంతులు, కడుపునొప్పి, జ్వరం, డయేరియా లక్షణాలు కనిపించటంతో హుటాహుటిన మారేడుమిల్లి, రంపచోడవరం ఏరియా ఆస్పత్రులకు తరలించినట్టు అధికారులు సీఎంకు వివరించారు.
నిన్న ఉదయం అల్పాహారం తీసుకున్న తరువాత విద్యార్ధులు అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్టు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే హాస్టల్ తనిఖీకి వెళ్లి అక్కడి పరిస్థితులను కూడా అధ్యయనం చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. హాస్టల్ లోని మిగిలిన విద్యార్ధులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించి డయేరియా లక్షణాలు ఉన్నవారికి చికిత్స అందించినట్టు చెప్పారు. ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు ఆహార పదార్ధాల, నీటి నమూనాలు కూడా సేకరించామన్నారు. ఘటనపై విచారణ జరిపేందుకు జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీని కూడా నియమించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రంపచోడవరం ఏరియా అస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్ధుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. ఎప్పటికప్పుడు విద్యార్ధుల ఆరోగ్య పరిస్థితిపై తనకు నివేదించాలన్నారు. ఘటనపై రేపటి లోగా పూర్తి నివేదికను అందజేయాలని కలెక్టర్ను అదేశించారు. ఘటనకు కారకులపై శాఖా పరమైన చర్యలతో పాటు, అవసరమైతే క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీచేశారు.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :