T20 World Cup: సూర్య కుమార్ తన ఫామ్లోకి వచ్చాడు.. ఆ పరుగులు ప్రత్యేకం: రవిచంద్రన్ అశ్విన్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్లో భాగంగా యూఎస్ఏతో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ ( Suryakumar Yadav) జట్టును ఓటమి నుంచి కాపాడాడు. కష్ట సమయంలో తనదైన శైలిలో బ్యాటింగ్ చేసి.. 49 బంతుల్లో 84 పరుగులతో అజేయంగా నిలిచాడు. మొత్తం భారత జట్టు స్కోర్లో 52 శాతం పరుగులు సూర్య బ్యాట్ నుంచే రావడం విశేషం. భారత్ 77/6 స్థితి నుంచి 161 పరుగులకు చేరడంలో, జట్టు విజయం సాధించడంలో సూర్య కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ( Ravichandran Ashwin) సూర్య ఇన్నింగ్స్పై ప్రశంసలు కురిపించాడు. గతేడాది నిరాశాజనక ఫామ్ తర్వాత సూర్య.. తిరిగి ఫామ్లోకి వచ్చాడని కొనియాడాడు. సూర్య.. వికెట్ల వెనుక నుంచి పరుగులు రాబట్టడం ఈ మ్యాచ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పాడు.
తన యూట్యూబ్ ఛానల్ ‘యాష్ కి బాత్’ కార్యక్రమంలో అశ్విన్ మాట్లాడాడు. ‘‘మొదట అమెరికా జట్టును అభినందించాల్సిందే. వాంఖడే స్టేడియం లాంటి సాధారణ బ్యాటింగ్కు అనుకూలమైన మైదానంలోనూ ఆ జట్టు బౌలర్లు సరైన ప్రణాళికతో వచ్చారు. షాడ్లీ వేగంగా బంతులు వేయలేదు. కానీ, కట్టర్లు.. వేరియంట్స్తో బౌలింగ్ చేశాడు. సూర్య కోసం ప్రత్యేక ప్రణాళికతో బౌలింగ్ చేసినట్లు అర్థమవుతుంది.
సూర్య క్రీజులోకి వచ్చాక మొదట ఆచితూచి ఆడాడు. పరుగులు తీసేందుకు కొంత ఇబ్బంది పడ్డాడు. 31 బంతుల్లో 45 పరుగులు చేయగలిగాడు. డెత్ ఓవర్లలో విజృంభించి.. 16 బంతుల్లోనే 38 పరుగులు రాబట్టాడు. అమెరికా జట్టులో ఉత్తమ బౌలరైన సౌరభ్ నేత్రావల్కర్ను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. సూర్య చేసిన పరుగుల్లో 37 శాతం స్కోర్ వికెట్ల వెనుక నుంచే రావడం విశేషం. ఇది నిజమైన 360 డిగ్రీ మాస్టర్ క్లాస్ బ్యాటింగ్. గతంలో కొన్ని జట్లు ఆ ఏరియాలోనే సూర్యని కట్టడి చేశాయి. కానీ, ఈ మ్యాచ్లో అతడు సమయం తీసుకున్నా.. మంచి ఫామ్లోకి వచ్చాడు. కెప్టెన్గా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు’’అని అశ్విన్ తెలిపాడు.
- నాకు కోచ్ గౌతమ్ గంభీర్ ఏం చెప్పాడంటే.. : సూర్యకుమార్ యాదవ్
సూర్య బ్యాటింగ్ పక్కన పెడితే.. భారత జట్టుకు ఈ మ్యాచ్ ఒక హెచ్చరికగా నిలుస్తుందని అశ్విన్ వ్యాఖ్యానించాడు. పవర్ప్లేలోనే నాలుగు వికెట్లు కోల్పోవడం ఆందోళనకర విషయమన్నాడు. 2, 3 వికెట్లు పడిన తర్వాత కూడా భారత్.. పిచ్ను సరిగా అర్థం చేసుకోలేదని అన్నాడు. ఇది సాధారణ వాంఖడే పిచ్ కాదని ముందే గ్రహించి ఉంటే వికెట్లు కాపాడుకుంటూ చివర్లో దూకుడుగా ఆడేవారని, అలా చేసి ఉంటే మరో 20-30 పరుగులు వచ్చేవని అభిప్రాయపడ్డాడు. 161 పరుగులు కూడా డిఫెండ్ చేయగలిగే స్కోరేనని, శనివారం రాత్రి భారత్ అదే చేసిందని చెప్పాడు.
మ్యాచ్ అనంతరం సూర్య మాట్లాడాడు. గతేడాది తనకు చాలా కష్టంగా గడిచిందని చెప్పాడు. దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత కొంతకాలం క్రికెట్ నుంచి మానసికంగా దూరంగా ఉండటం.. తను మళ్లీ ఫామ్లోకి రావడానికి దోహదపడిందని తెలిపాడు.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :