Budget 2026-27: నిర్మలమ్మ పద్దు.. లెక్కలేసింది వీళ్లే..!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: మరికొద్ది రోజుల్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. వరుసగా తొమ్మిదోసారి ఆర్థిక పద్దు (Budget 2026-27)ను ప్రవేశపెట్టి.. మాజీ మంత్రి పి.చిదంబరం రికార్డును సమం చేయనున్నారు. ఫిబ్రవరి 1న లోక్సభ వేదికగా ఆమె చేయబోయే బడ్జెట్ ప్రకటనలపై యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రధాని మోదీ మూడో హయాంలో ప్రవేశపెట్టనున్న మూడో పూర్తిస్థాయి బడ్జెట్ ( Union Budget) ఇది. ఈ సందర్భంగా కేంద్ర పద్దు లెక్కలేసిన నిర్మలమ్మ ( Nirmala Sitharaman) టీమ్ ఎవరో చూద్దాం..!
అనురాధ ఠాకూర్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి:
బడ్జెట్ రూపకల్పనలో ప్రధాన అధికారి ఈమెనే. 2026-27 సంవత్సరానికి వనరుల కేటాయింపుతో స్థూల-ఆర్థిక ఫ్రేమ్వర్క్ను ఈమే నిర్ణయిస్తారు. బడ్జెట్ డాక్యుమెంట్లను సిద్ధం చేసే బడ్జెట్ డివిజన్కు నాయకత్వం వహిస్తారు. ఆర్థికశాఖ అధికారిగా అనురాధకు ఇదే తొలి బడ్జెట్. 1994 హిమాచల్ కేడర్ ఐఏఎస్ అధికారిణి అయిన అనురాధ.. గతేడాది జులైలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా బాధ్యతలు అందుకున్నారు. ఈ పదవి చేపట్టిన తొలి మహిళా ఐఏఎస్ ఈమే కావడం విశేషం.
అరవింద్ శ్రీవాత్సవ, రెవెన్యూ కార్యదర్శి:
బడ్జెట్ ప్రసంగంలోని పార్ట్-బిలో ఉండే పన్ను ప్రతిపాదనలను రూపొందించేది ఈయనే. ఆదాయ పన్ను, కార్పొరేట్ ట్యాక్స్ వంటి ప్రత్యక్ష పన్నులు, జీఎస్టీ, కస్టమ్స్ వంటి పరోక్ష పన్నుల లెక్కలన్నీ ఈయన బృందమే పర్యవేక్షిస్తుంది. రెవెన్యూ కార్యదర్శిగా అరవింద్కు ఇదే తొలి బడ్జెట్ అయినప్పటికీ.. ఆర్థిక మంత్రిత్వ శాఖలో పనిచేసిన అనుభవం ఉంది. గతంలో ఆయన బడ్జెట్ డివిజన్కు జాయింట్ సెక్రెటరీగా వ్యవహరించారు. ఈసారి ఆర్థిక పద్దులో కస్టమ్స్ సుంకాలు, టీడీఎస్ హేతుబద్ధీకరణ వంటివి ఉండొచ్చన్న అంచనాలున్నాయి.
- కేంద్ర బడ్జెట్లో.. రక్షణ రంగ కేటాయింపులపై భారీ అంచనాలు!
ఉమ్లున్మంగ్ వ్యూల్నామ్, ఎక్స్పెండిచర్ సెక్రెటరీ:
కేంద్ర ప్రభుత్వ పర్స్కు ఈయనే గార్డియన్. ప్రభుత్వ వ్యయాలు, రాయితీ హేతుబద్ధీకరణ, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలను పర్యవేక్షిస్తారు. ద్రవ్య లోటును పరిమితం చేయడంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరానికి మార్గనిర్దేశనం చేయడం వంటివి ఉమ్లున్మంగ్ బృందం చూస్తుంది.
ఎం. నాగరాజు, ఆర్థిక సేవల కార్యదర్శి:
ప్రభుత్వ ఆర్థిక సమ్మిళిత, సామాజిక భద్రతా పథకాలను అమలు బాధ్యతలను ఆర్థిక సేవల విభాగం చూసుకుంటుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీలు, పింఛను వ్యవస్థల ఆర్థిక పరిస్థితిని ఈ విభాగం పర్యవేక్షిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక అజెండాను ముందుకు తీసుకెళ్లడంలో ఈ విభాగానిదే కీలక పాత్ర.
అరునిష్ చావ్లా, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ సెక్రెటరీ
ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ వంటి వ్యవహారాలను ఈయన బృందమే పర్యవేక్షిస్తుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో వాటాలను విక్రయించడంతో వచ్చే పన్నేతర ఆదాయ లక్ష్యాలను అందుకోవడంలో ఈయన విభాగం కీలక పాత్ర పోషిస్తుంది.
కె. మోజస్ చాలై, డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెక్రెటరీ
ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల మూలధన వ్యయ ప్రణాళికలను ఈయన విభాగమే పర్యవేక్షిస్తుంది. బడ్జెట్ కేటాయింపులు సమర్థవంతంగా వినియోగించేలా చూస్తారు. ఆస్తుల విక్రయం, ప్రభుత్వ రంగ సంస్థల ఆర్థిక పరిస్థితిని సమీక్షించడంలో ఈ విభాగం కీలక పాత్ర పోషిస్తుంది.
ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఈ విభాగాలతో పాటు ప్రధాన ఆర్థిక సలహాదారు కార్యాలయం కూడా బడ్జెట్ రూపకల్పనలో కీలకంగా వ్యవహరిస్తుంది. ప్రస్తుతం వి. అనంత నాగేశ్వరన్ కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా ఉన్నారు. ఆర్థిక వృద్ధిని అంచనా వేయడం, రంగాల వారీగా పనితీరు, ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఆర్థిక సంక్షోభాలను అధ్యయనం చేయడం వంటివి ఈయన బృందం పరిశీలిస్తుంది. ఇక, ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరీ కూడా బడ్జెట్ రూపకల్పనలో భాగమవుతారు.
► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :