Iran: ముందు మీ దేశంపై దృష్టి పెట్టండి: ట్రంప్‌ తీరుపై ఖమేనీ

Eenadu icon
By International News Team Published : 10 Jan 2026 00:15 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చోటుచేసుకుంటున్న అల్లర్లపై ఆ దేశ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ స్పందించారు. తమ దేశంలో ఆందోళనకారులను హెచ్చరించిన ఆయన.. విదేశీ శక్తుల చేతుల్లో కిరాయి సైనికుల్లా వ్యవహరించే వారిని సహించే ప్రసక్తే లేదన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఉద్దేశిస్తూ.. ఇతర దేశాలకు చెప్పే ముందు సొంత దేశంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇతర దేశాధ్యక్షుడిని సంతోష పెట్టేందుకు సొంత వీధులను నాశనం చేసుకుంటున్నారంటూ ఆందోళనకారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ప్రవాసంలో తలదాచుకున్న యువరాజు రెజా పహ్లావి (గతంలో అమెరికా మద్దతుతో దేశాన్ని పాలించిన ‘షా’ వారసుడు) ఇచ్చిన పిలుపు మేరకు ఇరాన్‌లో ఆందోళనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. గురువారం మొదలైన ఈ నిరసనలు శుక్రవారం ఉదయం వరకు కొనసాగాయి. ఇంటర్నెట్, టెలిఫోన్‌ సేవలను ప్రభుత్వం నిలిపేసినప్పటికీ ఆందోళనకారులు పెద్ద ఎత్తున పాల్గొనడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే స్పందించిన సుప్రీం లీడర్‌.. యువత ఏకతాటిపై ఉండాలని, దేశం ఐకమత్యంగా ఉన్నప్పుడే ఎలాంటి శత్రువునైనా ఎదుర్కోవచ్చన్నారు.

► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :