colonial era: మళ్లీ వలసవాద యుగంలోకి?

Eenadu icon
By Editorial Team Published : 09 Jan 2026 04:00 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

అమెరికా సైనికులు ఇటీవల వెనెజువెలా రాజధాని కరాకస్‌లోని అధ్యక్ష భవనంపై మెరుపు దాడి చేసి, ఆ దేశాధ్యక్షుడు నికొలస్‌ మదురో దంపతులను అపహరించి న్యూయార్క్‌కు తీసుకుపోయారు! మాదకద్రవ్య ఉగ్రవాదానికి పాల్పడ్డారంటూ మదురోపై క్రిమినల్‌ కేసు పెట్టి, అక్కడ విచారిస్తున్నారు. దేశాధ్యక్షుడి అపహరణను పలు దేశాలు నిర్ద్వంద్వంగా ఖండించాయి. భారత్‌ మాత్రం సమస్యను శాంతియుతంగా, సంప్రదింపులతో పరిష్కరించుకోవాలంటూ పిలుపిచ్చింది!

వెనెజువెలా దేశాధ్యక్షుడితో పాటు ఆయన భార్యనూ అమెరికా సైన్యం అపహరించుకుని తీసుకుపోవడం యావత్‌ ప్రపంచాన్నీ నివ్వెరపరచింది. అధ్యక్షుడు మదురో, ఆయన భార్య, కుమారుడు అగ్రరాజ్యానికి కొకైన్‌ను అక్రమంగా రవాణా చేస్తున్నారని ట్రంప్‌ సర్కారు ఆరోపిస్తోంది. పైగా వారు అమెరికా ఉగ్రవాద గ్రూపులుగా ప్రకటించిన డ్రగ్‌ ముఠాలతో కుమ్మక్కయ్యారనీ, ఇది మాదకద్రవ్య ఉగ్రవాదమనీ (నార్కో టెర్రరిజమనీ) అంటోంది. ఒక సార్వభౌమ దేశ అధిపతి, ఆయన భార్యను సైనిక చర్యతో అపహరించి, వేరే దేశానికి తీసుకురావడం ఐక్యరాజ్యసమితి నిబంధనలకు పూర్తి విరుద్ధం. అగ్రరాజ్య చర్య అంతర్జాతీయ ప్రమాణాలనూ, న్యాయపాలన సూత్రాన్నీ ఉల్లంఘిస్తోంది. ఒకవేళ అమెరికా ఆరోపిస్తున్నట్లు మదురో దంపతులు నిజంగానే నార్కో టెర్రరిజానికి పాల్పడుతున్నా, ఆయనపై విచారణ చేపట్టడానికి అంతర్జాతీయ సమాజానికి ఆమోదనీయమైన పద్ధతులను అవలంబించాల్సింది. కానీ, తానే అంతర్జాతీయ పోలీసుగా, న్యాయమూర్తిగా వ్యవహరిస్తూ బలప్రయోగంతో  ఏకపక్ష చర్యకు ఉపక్రమించడం అమెరికాకు తగదు. ఒక స్వతంత్ర దేశాధ్యక్షుణ్ని సాధారణ నేరస్థుడిగా పరిగణించడం అంతర్జాతీయ గౌరవమర్యాదలకు విరుద్ధం. న్యూయార్క్‌ న్యాయస్థానం నుంచి మదురో బయటికి వస్తూ, తాను అపహరణకు గురైన అధ్యక్షుడిననీ, యుద్ధఖైదీనని పేర్కొన్నారు!

బలవంతుడిదే రాజ్యమా?

దురదృష్టవశాత్తూ ఇటీవలి కాలంలో దేశాల మధ్య విభేదాలూ వివాదాలను బలప్రయోగంతో పరిష్కరించుకునే ధోరణి ప్రబలుతోంది. ఆర్మీనియాపై అజర్‌ బైజాన్, ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు దిగడం; ఇజ్రాయెల్‌-హమాస్‌లు పరస్పరం దాడులు చేసుకోవడం ఇందుకు నిదర్శనం. ఇరాన్‌ అణు కేంద్రాలపై అమెరికా దాడి కూడా ఈ కోవలోకే వస్తుంది. ప్రపంచంలో ఇలా ‘బలవంతుడిదే రాజ్యం’ అనే ధోరణి ప్రబలితే- చిన్న దేశాలకూ సైనికంగా బలహీనమైన రాజ్యాలకూ దినదినగండమే. వెనెజువెలాపై వాషింగ్టన్‌ దండనీతిపై వివిధ దేశాలు రకరకాలుగా స్పందించాయి. రష్యా, చైనా, బ్రెజిల్‌తో పాటు పలు లాటిన్‌ అమెరికా దేశాలు అగ్రరాజ్య దుందుడుకుతనాన్ని నిర్ద్వంద్వంగా ఖండించాయి. ఐరోపాలోని అమెరికా మిత్రదేశాలేమో మెత్తగా స్పందిస్తూ, అందరూ అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలంటూ సన్నాయి నొక్కులు నొక్కాయి. ఐరోపా సమాఖ్య(ఈయూ) మాత్రం అమెరికాను ఖండించడానికి ముందుకురాలేదు. సరికదా, మదురో సర్కారుకు చట్టబద్ధత లేదంటూ అమెరికాకే వంతపాడింది. ఇండియా మాత్రం సమస్యను శాంతియుతంగా, సంప్రదింపులతో పరిష్కరించుకోవాలని పిలుపిచ్చింది. దిల్లీలో విడుదలైన ప్రకటనలో, వెనెజువెలా తాజా పరిణామాలపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడి పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నామంటూ వెనెజువెలా ప్రజల శ్రేయస్సు, భద్రతకు మద్దతు ప్రకటించింది. సంబంధిత పక్షాలన్నీ శాంతియుతంగా విభేదాలను పరిష్కరించుకుని సుస్థిరత సాధించాలని కోరింది. అంటే వెనెజువెలాపై అమెరికా సైనిక చర్యను భారత్‌ ఖండించనూ లేదు, అంతర్జాతీయ ప్రమాణాలను అగ్రరాజ్యం ఉల్లంఘించిందనీ అభ్యంతర పెట్టనూలేదు. అదే సమయంలో సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలనడం ద్వారా రాజకీయ లక్ష్యాల సాధనకు బలప్రయోగం సరికాదని హితవు చెప్పింది. ప్రస్తుతం ట్రంప్‌ సర్కారు భారత ఎగుమతులపై సుంకాలను భారీగా పెంచేసింది. భారత్‌-అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇంకా ఖరారు కాలేదు. అందువల్ల రెండు దేశాల సంబంధాలు సజావుగా లేవనే చెప్పాలి. అవి మరీ దెబ్బతినిపోకుండా చూసుకోవాలన్న లక్ష్యంతో  దిల్లీ వెనెజువెలా వ్యవహారంలో ఆచితూచి స్పందించింది. వాషింగ్టన్‌-కరాకస్‌ సంబంధాలు మళ్లీ గాడినపడితే వెనెజువెలాలోని అపార చమురు నిక్షేపాల తవ్వకంలో భారతీయ చమురు కంపెనీలూ పాలుపంచుకోగలుగుతాయి. వెనెజువెలాపై ఆంక్షలను అమెరికా ఎత్తివేస్తే భారత్‌ అక్కడి నుంచి చమురు దిగుమతి చేసుకోగలుగుతుంది. పైగా ట్రంప్‌ వెనెజువెలా పాలనను తమ గుప్పిట్లోకి తీసుకుని, అక్కడి చమురు ఆదాయాన్ని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. దాంతో ప్రపంచం మళ్లీ వలసవాద యుగంలోకి వెళ్తోందా అనే ఆందోళన పెరుగుతోంది. పైకి మదురో నార్కో టెర్రరిజాన్ని దెబ్బతీయడమే లక్ష్యమని అమెరికా చెబుతున్నా, అక్కడి చమురు నిక్షేపాలను కబ్జా చేయడమే అసలు ఉద్దేశమని తెలుస్తోంది.

తెరపైకి ‘డాన్రో’ సిద్ధాంతం!

అంతర్జాతీయ వాణిజ్యాన్ని డాలరల్లో కాకుండా ఇతర కరెన్సీలలో జరపాలని బ్రిక్స్‌ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ట్రంప్‌నకు కంటగింపుగా మారాయి. ఆయా దేశాలు తమ వాణిజ్యాన్ని స్థానిక కరెన్సీలలోనే నిర్వహించేందుకు ప్రయత్నిస్తుండటాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. అంతర్జాతీయ రిజర్వు కరెన్సీగా డాలర్‌ ఆధిపత్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలనూ గట్టిగా నిరోధిస్తున్నారు. ఇలాంటి తరుణంలో, మదురో చైనాకు చమురు అమ్మకాలను డాలర్లలో కాకుండా చైనా కరెన్సీ యువాన్లలో జరపడం ట్రంప్‌ను చిర్రెత్తించింది. డాలర్‌ ఆధిపత్యాన్ని దెబ్బతీయడానికి జరుగుతున్న కృషిలో పాల్గొనవద్దని లాటిన్‌ అమెరికా దేశాలను ఆయన హెచ్చరిస్తున్నారు. తద్వారా అవి తన గుప్పిట నుంచి జారిపోకుండా చూసుకుంటున్నారు. ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల్లో- అంటే పశ్చిమార్ధ గోళంలో అమెరికాదే సర్వంసహాధిపత్యమనీ... ఇక్కడ ఐరోపా దేశాలు సహా మరెవరూ వేలుపెట్టకూడదని 1823లో నాటి అమెరికా అధ్యక్షుడు జేమ్స్‌ మన్రో హెచ్చరించారు. దీన్నే మన్రో సిద్ధాంతమంటున్నారు. దాన్ని ట్రంప్‌ పునరుద్ధరిస్తున్నారు. అందుకే దీన్ని ఇప్పుడు ‘డాన్రో సిద్ధాంతం’ అంటున్నారు. అమెరికా ఒకప్పుడు పాటించిన అంతర్జాతీయ ప్రమాణాలను ఇప్పుడు తానే ఉల్లంఘిస్తోంది. తనకొక నీతి, ప్రపంచానికి వేరొక నీతి అన్నట్లు ప్రవర్తిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో, అమెరికా చర్యలను ఖండించడంవల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువని భారత్‌ భావిస్తోంది. అందుకే ఇవి యుద్ధానికి రోజులు కావనీ, వివాదాలను బలప్రయోగంతో కాకుండా దౌత్యం, సంప్రదింపుల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలనీ సూచిస్తోంది.

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :