Visakhapatnam: అందరూ చూస్తుండగా రైలు కింద పడి ఆత్మహత్య

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

విశాఖపట్నం (కూర్మన్నపాలెం), న్యూస్టుడే: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ మాజీ సైనికుడు రైల్వే స్టేషన్లో ప్రయాణికులు చూస్తుండగా రైలు కింద ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ప్రమాదం ధాటికి తమ కళ్ల ముందే ఆ వ్యక్తి మొండెం, తల వేరయిపోవడంతో అందరూ భయంతో వణికిపోయారు. విశాఖ సమీప దువ్వాడ రైల్వేస్టేషన్లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మధ్యాహ్నం 1.10 గంటల సమయంలో హావ్డా-బెంగళూరు ప్రత్యేక రైలు ఒకటో ప్లాట్ఫాం మీదకు వస్తోంది. ఇంతలో ఫ్లాట్ఫాంపైన కూర్చున్న ఓ వ్యక్తి గబగబా వెళ్లి పట్టాలపై తల పెట్టి పడుకోవడంతో రైలు అతడి మీద నుంచి వెళ్లిపోయింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుణ్ని విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం నెల్లిముక్కుకు చెందిన నీలాపు వెంకటరమణారెడ్డి (65) అలియాస్ సైనికుడిగా గుర్తించారు. కొంతకాలం సైన్యంలో పనిచేసిన ఆయన.. పదవీ విరమణ తర్వాత ఉక్కు కర్మాగారంలో ఉద్యోగం చేశారు. గతంలో తెదేపా సైనికుల విభాగం అధ్యక్షుడిగానూ సేవలందించారు. ప్రస్తుతం కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, వివాహితులైన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శనివారం మధ్యాహ్నం వరకు కిరాణా దుకాణం నిర్వహించిన వెంకటరమణారెడ్డి.. తర్వాత రైల్వేస్టేషన్కు వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. గత కొన్నాళ్లుగా ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉండగా.. ఆ ఒత్తిడితోనే ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు.
► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 04 Jan 2026 05:25 IST