Maduro: బస్సు డ్రైవర్‌ నుంచి దేశాధ్యక్షుడి వరకు..!

Eenadu icon
By International News Desk Published : 04 Jan 2026 04:31 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

అమెరికా నిర్బంధించిన నికొలస్‌ మదురో.. దాదాపు పన్నెండేళ్లుగా వెనెజువెలా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన ప్రముఖ వామపక్ష నేత, మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌కు అత్యంత సన్నిహితుడు. చావెజ్‌ మరణం తర్వాత అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. సామాన్య కార్మిక కుటుంబంలో జన్మించిన మదురో.. 90వ దశకంలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. అదే సమయంలో తీవ్ర విమర్శలూ ఎదుర్కొన్నారు. 

సాధారణ కుటుంబం నుంచి..

వెనెజువెలా రాజధాని కారకాస్‌లో 1962లో మదురో జన్మించారు. తండ్రి ఓ కార్మిక నాయకుడు. 1990ల్లో మదురో బస్‌ డ్రైవరుగా పనిచేశారు. అదే సమయంలో వామపక్ష రాజకీయ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. తదనంతర కాలంలో హ్యూగో చావెజ్‌కు అత్యంత సన్నిహితుడయ్యారు. 1999లో చావెజ్‌ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత మదురో దశ మారింది. ఆయనకు కీలక పదవులు లభించాయి. జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడిగా, విదేశాంగమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

చావెజ్‌ మరణంతో..

క్యాన్సర్‌తో 2013లో చావెజ్‌ మరణించడంతో దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా మదురో బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది జరిగిన ప్రత్యేక అధ్యక్ష ఎన్నికల్లో అతి తక్కువ మెజారిటీతో విజయం సాధించి.. పూర్తిస్థాయిలో అధ్యక్ష పగ్గాలు స్వీకరించారు. ఆ తర్వాత మరో రెండు ఎన్నికల్లో విజయం సాధించారు. కానీ ఆ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని విపక్షాలే కాదు.. చాలా దేశాలు కూడా ఆక్షేపించాయి. 

తీవ్రమైన అణచివేత..

మదురో పాలనలో వెనెజువెలా అనేక సంక్షోభాలను ఎదుర్కొంది. ముఖ్యంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటింది. తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. 2014, 2017లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ నిరసనలు జరిగాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చారు. వాటిని మదురో తీవ్రంగా అణచివేశారు. వేల మంది పౌరులను నిర్బంధించారు. 2025 జనవరిలో మదురో మూడోసారి దేశాధ్యక్ష పగ్గాలను చేపట్టారు. ఆ ఎన్నికలపైనా తీవ్ర దుమారమే రేగింది. మదురోను అధ్యక్షుడిగా గుర్తించడానికి అమెరికా తిరస్కరించింది. విపక్ష నేత ఎడ్మండో గొంజాలెజ్‌నే తాము గుర్తిస్తామని పేర్కొంది.

మదురో వర్సెస్‌ ట్రంప్‌

ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలను చేపట్టినప్పటి నుంచీ కథ మారింది. మదురోను ట్రంప్‌ లక్ష్యంగా చేసుకున్నారు. తమ దేశాన్ని అస్థిరపరచడానికి వెనెజువెలా అధ్యక్షుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. అమెరికాలోకి మాదకద్రవ్యాలు, అక్రమ వలసదారులు రావడానికి మదురోయే కారణమని నిందించారు. వెనెజువెలాలోని డ్రగ్స్‌ ముఠాలను ఉగ్రవాదులుగా ట్రంప్‌ ప్రకటించారు. పదవి నుంచి మదురో తప్పుకొంటే.. దేశం నుంచి సురక్షితంగా బయటకు వెళ్లే అవకాశం ఆయనకు కల్పిస్తామని ట్రంప్‌ ప్రతిపాదన కూడా చేశారు. మదురో దీన్ని తిరస్కరించారు. తమ దేశంలో చమురు నిల్వలపై అమెరికా కన్నేసిందంటూ ఆయన ఎదురు దాడిచేశారు. ఆ ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్యే మదురోను నిర్బంధించాలని ట్రంప్‌ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

మదురో.. పుట్టపర్తి సత్య సాయిబాబా భక్తుడు. ఆయన కార్యాలయంలో బాబా భారీ చిత్రపటం ఉంటుంది. 2005లో విదేశాంగమంత్రి హోదాలో భారత్‌ పర్యటనకు వచ్చిన ఆయన పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు. సాయిబాబాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్‌ మదురో ఆయన భార్య సిలియా ఫోర్‌ను అమెరికా నిర్బంధించిన నేపథ్యంలో తదుపరి ఏం జరగబోతోందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మదురో నిర్బంధం 1989లో పనామాపై అమెరికా జరిపిన దురాక్రమణను గుర్తుకు తెస్తోంది. అప్పట్లో తమ దేశ పౌరులకు రక్షణ కల్పించే సాకుతో అమెరికా పనామాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు మాన్యువెల్‌ నోరీగాను నిర్బంధించింది. నోరీగా అప్రజాస్వామిక విధానాలు అవలంబిస్తున్నారని, అవినీతికి పాల్పడుతూ మాదక ద్రవ్యాల వ్యాపారానికి ఊతమందిస్తున్నారని నాటి అమెరికా ప్రభుత్వం ఆరోపించింది.నోరీగా సుదీర్ఘకాలం అమెరికా, ఫ్రాన్స్, పనామా జైళ్లలో మగ్గారు. 2017లో 83 ఏళ్ల వయసులో బ్రెయిన్‌ ట్యూమర్‌ కారణంగా మరణించారు. అలాగే ఇరాక్‌ అధ్యక్షుడు సద్దాం హుసేన్‌ను కూడా అమెరికన్‌ బలగాలు 2003 డిసెంబరు 13న నిర్బంధించాయి. ఇరాక్‌ వద్ద భారీ విధ్వంసానికి దారితీయగల ఆయుధాలు ఉన్నాయన్న సాకుతో అమెరికా ఆ దేశంపై దాడి చేసి సద్దాం ప్రభుత్వాన్ని కూల్చి వేసింది. తన సొంత నేల అయిన తిక్రిత్‌లో ఒక సొరంగంలో దాగి ఉండగా అమెరికన్‌ సేనలు ఆయనను పట్టుకున్నాయి. అమెరికా పేర్కొన్న ఆయుధాలు ఇరాక్‌లో ఏనాడూ లభించలేదు. మానవాళికి వ్యతిరేకంగా నేరాలు చేశారంటూ సద్దాంపై అమెరికా అభియోగం మోపింది. దీనిపై విచారణ అనంతరం 2006 డిసెంబరు 30న సద్దాం హుసేన్‌ను ఉరితీశారు. 

► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • బంగ్లా పీఠంపై బీఎన్‌పీ బంగ్లాదేశ్‌లో దాదాపు ఏడాదిన్నరగా కొనసాగుతున్న రాజకీయ అస్థిరతకు తెరపడింది. దేశ 13వ సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ(బీఎన్‌పీ) ఘన విజయం సాధించింది.
  • ‘డార్క్‌ ప్రిన్స్‌’కు బంగ్లా పగ్గాలు ఒకప్పుడు విమర్శకుల చేత ‘డార్క్‌ ప్రిన్స్‌’గా మాటలు పడిన బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ(బీఎన్‌పీ) నేత తారిఖ్‌ రెహమాన్‌ ఇప్పుడు బంగ్లా పగ్గాలు చేపట్టబోతున్నారు.
  • ఐఎస్‌ఎస్‌కు పయనమైన నలుగురు వ్యోమగాములు వైద్యపరమైన అత్యవసర కారణాల వల్ల నలుగురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) నుంచి అర్ధాంతరంగా భూమికి తిరిగొచ్చిన నేపథ్యంలో వారి స్థానాన్ని భర్తీ చేయడానికి తాజాగా మరో బృందం నింగిలోకి పయనమైంది.
  • ఎప్‌స్టీన్‌తో బంధంపై కలకలం.. గోల్డ్‌మాన్‌ సాక్స్‌ న్యాయవాది రాజీనామా అంతర్జాతీయ లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
  • పర్యవసానాలు బాధాకరంగా ఉంటాయి అణు ఒప్పందానికి అంగీకరించకుంటే ఇరాన్‌ అత్యంత బాధాకరమైన పర్యవసానాలు చవి చూడాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పునరుద్ఘాటించారు.
  • వచ్చేవారం మళ్లీ రష్యా-ఉక్రెయిన్‌ చర్చలు యుద్ధం ముగింపు దిశగా రష్యా, ఉక్రెయిన్‌ మధ్య వచ్చేవారం జెనీవాలో మరో దఫా చర్చలు జరగనున్నాయి. 17, 18 తేదీల్లో ఈ చర్చలు జరుగుతాయని రష్యా అధ్యక్ష కార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ శుక్రవారం వెల్లడించారు.
  • సంక్షిప్త వార్తలు (3) సోవియట్‌ రష్యాలో స్టాలిన్‌ విధానాలను, కృశ్చెవ్, బ్రెజ్నెవ్‌ల హయాంలో రష్యా కమ్యూనిస్టు పార్టీ అనుసరించిన మార్క్సిజాన్నీ ప్రశ్నించిన విమర్శకుడు రాయ్‌ మెద్వెదేవ్‌ శుక్రవారం నూరేళ్ల వయసులో కన్నుమూశారు.
  • గాజా శాంతి బోర్డుపై ఇండోనేసియాలో వ్యతిరేకత గాజా కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన శాంతి సంస్థాపన బోర్డులో చేరిన ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబువో సుబియాంతో, అక్కడ నియోగించే అంతర్జాతీయ భద్రతా దళం (ఐఎస్‌ఎఫ్‌) కోసం 8 వేల మంది సైనికులకు శిక్షణ కార్యక్రమం చేపట్టారు.
  • కృత్రిమ మేధ ప్రభావం, ముప్పుపై ఐరాస నిపుణుల కమిటీ ఏర్పాటు అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో...కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావం, దాని ముప్పును అంచనా వేయడానికి ప్రపంచ స్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటయ్యింది.