


USA: వెనెజువెలాపై మెరుపు దాడి

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
కారకాస్: దక్షిణ అమెరికా దేశం వెనెజువెలాపై శనివారం తెల్లవారుజామున ఉరుములేని పిడుగులా అమెరికా మెరుపు దాడులకు దిగింది. ఊహించని ఈ దాడులతో రాజధాని కారకాస్ దద్దరిల్లింది. రాజధాని గగనతలంపై అమెరికా యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టాయి. పేలుళ్లకు జనం భయపడి బయటకు పరుగులు తీశారు. సైనిక స్థావరాల్లో పొగ, అంధకారం అలముకున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. కారకాస్లోని లా కార్లోటా ఎయిర్ఫీల్డ్, ప్యూర్టే లియునా మిలిటరీ బేస్, లా గ్వైరా నౌకాశ్రయం మొదలైన కీలక సైనిక స్థావరాలపై అమెరికా దళాలు దాడులు చేశాయి. దేశం మేల్కొనేలోగా అధ్యక్షుడు నికొలస్ మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ను అమెరికా సైన్యం.. బంధించి న్యూయార్క్కు తరలించింది. అయితే అంతకుముందే దేశంలో అత్యవసర పరిస్థితిని మదురో విధించారు.
మరోవైపు దేశాధ్యక్ష బాధ్యతలను ఎవరు చేపట్టారన్న అంశం తేలలేదు. వెనెజువెలా చట్టాల ప్రకారం ఉపాధ్యక్షులుగా ఉన్నవారు అధ్యక్షులవుతారు. కానీ తాను బాధ్యతలు చేపట్టినట్లు ఉపాధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడ్రిగ్స్ ప్రకటించలేదు.
ముందస్తు అనుమతి లేకుండానే..
వెనెజువెలాపై దాడులకు సంబంధించిన వివరాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్’ద్వారా శనివారం తెల్లవారుజామున 4.30 గంటల తర్వాత ప్రకటించారు. అయితే ఈ దాడులకు ఆయన కాంగ్రెస్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోలేదు. శనివారం ఆ ప్రక్రియను ప్రారంభించారు. రాజధాని కారకాస్లో పలు చోట్ల పేలుళ్లు జరిగాయని, తక్కువ ఎత్తులో విమానాలు చక్కర్లు కొట్టాయని, ఆ వెంటనే పౌరులు, సైనిక స్థావరాలపై అమెరికా దాడులకు పాల్పడిందని వెనెజువెలా ప్రభుత్వం ప్రకటించింది. ఇది అమెరికా సామ్రాజ్యవాద దాడని, ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు నిర్వహించాలని కోరింది. వెనెజువెలాపై అమెరికా దాడిని కొన్ని దేశాలు ఖండించగా.. మరికొన్ని మధ్యవర్తిత్వం వహిస్తామని ముందుకొచ్చాయి. మరికొన్ని సమర్థించాయి. దాడిని మన దేశంలోని లెఫ్ట్ పార్టీలైన సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ ఖండించాయి.
- 2013లో హ్యూగో చావెజ్ మరణానంతరం దేశాధ్యక్షుడిగా మదురో బాధ్యతలు చేపట్టారు. 2018లో మళ్లీ ఎన్నికయ్యారు. అయితే ప్రతిపక్షాలు పోటీ చేయకుండా నిషేధం విధించడంతో ఆ ఎన్నికపై తీవ్రవిమర్శలొచ్చాయి.
- 1990లో పనామాపై దాడిచేసి అప్పటి అధ్యక్షుడు మాన్యుయెల్ ఆంటోనియో నోరీగాను బందీగా చేసుకున్న 36 ఏళ్ల తర్వాత మళ్లీ ఓ దక్షిణ అమెరికా దేశంపై అమెరికా దాడి చేయడం ఇదే కావడం గమనార్హం.
ఏడుచోట్ల పేలుళ్లు
కారకాస్లో తెల్లవారుజామున ఏడు చోట్ల పేలుళ్లు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు భయంతో వీధుల్లోకి వచ్చారు. ఈ దాడుల్లో ఎవరైనా మరణించారా అన్న సమాచారం తెలియరాలేదు. దాదాపు 30 నిమిషాలపాటు దాడులు కొనసాగాయి. దాడుల అనంతరం కారకాస్ శివార్లలోని అధికార పార్టీ బలంగా ఉన్న ప్రాంతంలో సైనికులు, పౌర మిలీషియా సభ్యులు వీధుల్లోకి వచ్చారు. మిగిలిన ప్రాంతాల్లోని వీధులు నిర్మానుష్యంగా కనిపించాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అయితే వాహనాలు యథావిధిగా తిరిగాయి.
ఒక సైనిక స్థావరంపై పొగ కమ్ముకున్న దృశ్యాలు, మరో సైనిక స్థావరం చీకట్లో ఉన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రసారమయ్యాయి.
అత్యవసర పరిస్థితి
‘బాహ్య శక్తుల నుంచి కల్లోలస్థితి’ని అధ్యక్షుడు మదురో ప్రకటించారని, అన్ని రక్షణ ప్రణాళికలను అమలు చేయాలని ఆదేశించారని వెనెజువెలా ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన వెల్లడించింది. అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో పౌరుల హక్కులను సస్పెండు చేస్తామని, అధ్యక్షుడికి అన్ని అధికారాలను కట్టబెడతామని తెలిపింది. సైనిక బలగాల పరిధిని మరింత విస్తరిస్తామని వివరించింది.
- మదురో, ఆయన భార్యను ఎక్కడికి తరలించిందీ వెల్లడించాలని రోడ్రిగ్స్ డిమాండు చేశారు. వారు బతికే ఉన్నారనే ఆధారాలను చూపించాలని కోరారు.
- మదురో చివరిసారిగా శుక్రవారం టీవీలో కనిపించారు. కారకాస్లో చైనా బృందంతో భేటీ అయ్యారు.
- ఈ దాడులను వెనెజువెలా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పాడ్రినో ఖండించారు. ఇది సామ్రాజ్యవాద దాడిగా అభివర్ణించారు. దేశ రక్షణ కోసం విదేశీ బలగాలను ఎదిరించాలని పౌరులకు పిలుపునిచ్చారు.
- మదురోను వెనక్కి పంపించాలని కారకాస్ మేయర్ కార్మెన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది.
న్యూయార్క్లో విచారణ
మదురో, ఆయన భార్య సిలియాను అమెరికా చట్టాల ప్రకారం న్యూయార్క్లోని కోర్టుల్లో విచారిస్తామని అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండీ తెలిపారు. మదురోపై అమెరికా 2020లో ‘నార్కో-టెర్రరిజం’ కుట్ర అభియోగాలను మోపింది. తాజాగా అదే కేసులను మోపారు.
‘బెడ్రూం నుంచి లాక్కెళ్లారు’
వెనెజువెలాపై దాడి చేసిన అమెరికా బలగాలు సైనిక స్థావరంలోని ఇంట్లో ఉన్న మదురో దంపతులను పట్టుకుని.. వారిని బెడ్రూం నుంచి లాక్కెళ్లినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి సమయంలో వారు నిద్రిస్తుండగా ఒక్కసారిగా అమెరికా బలగాలు దాడి చేశాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వారిని అమెరికా యుద్ధ నౌక ఐవో జిమా ఎక్కించారు. అది న్యూయార్క్కు బయలుదేరింది.
వెనెజువెలాపై దాడులతోపాటు అధ్యక్షుడు మదురోను బందీగా పట్టుకున్న ఆపరేషన్లో అమెరికా డెల్టా ఫోర్స్ పాల్గొంది. మదురోను బంధించడానికి వీలుగా కొన్ని రోజుల ముందే అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన ఎక్కడ ఉన్నాడన్నదీ గుర్తించే బాధ్యతలను సీఐఏకు అప్పగించారు.
చమురు నిల్వల కోసమే కుట్ర: మదురో
‘అమెరికాకు కావాల్సింది డ్రగ్స్ నియంత్రణ కాదు. వెనెజువెలాలో ఉన్న అపారమైన చమురు నిల్వలను దక్కించుకోవడమే వారి అసలు లక్ష్యం. అందుకే నా ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారు. మాదక ద్రవ్యాల అడ్డుకట్టకు అమెరికాతో చర్చించేందుకు నేను సిద్ధంగానే ఉన్నా. కానీ వారు చర్చలకు రాకుండా యుద్ధానికి దిగుతున్నారు. ఆగస్టులో కరీబియన్ సముద్రంలో భారీగా సైన్యాన్ని మోహరించడం ఇందులో భాగమే’ అని గురువారం ఓ ఇంటర్వ్యూలో మదురో స్పష్టం చేశారు. ఆయన అన్నట్లుగానే అమెరికా దాడులు చేసింది.
బాధ్యతలు ఎవరికి?
అధ్యక్షుడు మదురోను అమెరికా బందీగా చేసుకున్న నేపథ్యంలో వెనెజువెలా అధ్యక్ష బాధ్యతలను ఎవరు చేపడతారన్న దానిపై స్పష్టత రాలేదు. రేసులో ఉపాధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడ్రిగ్స్తోపాటు హోం మంత్రి డియోస్డాడో కాబెల్లా, రక్షణ మంత్రి పాడ్రినో ఉన్నారు. దాడులు జరిగిన కొన్ని గంటల తర్వాత వీరు ముగ్గురూ టీవీ ఛానళ్లలో కనిపించారు. వీరిలో పాడ్రినో, కాబెల్లోలకు సైన్యంపై పట్టుంది.
వాస్తవానికి డ్రగ్స్ సరఫరాను అడ్డుకోవాలంటూ గత కొన్ని నెలలుగా మదురో ప్రభుత్వంపై అమెరికా ఒత్తిడి తెస్తోంది. అదే సమయంలో తూర్పు పసిఫిక్, కరీబియన్ సముద్ర జలాల్లో సైన్యాన్ని అమెరికా మోహరిస్తోంది. ఇటీవలి కాలంలో పలుమార్లు వెనెజువెలా ఓడలపై దాడులు చేసింది. డ్రగ్ స్మగ్లర్లకు సహకరించే డాకింగ్ ప్రాంతంపై గత వారం దాడులకు దిగింది. శనివారం ఏకంగా ఆ దేశంపైనే డాడులు చేసింది.
- శుక్రవారం నాటికి మొత్తం 35 ఓడలపై అమెరికా దాడులు చేసింది. అందులో 115 మంది మరణించారు.
- వెనెజువెలాపై దాడుల నేపథ్యంలో కొలంబియా అప్రమత్తమైంది. రెండు దేశాల సరిహద్దుల్లో తన బలగాలను కొలంబియా మోహరించింది. దాదాపు 2,000 కిలోమీటర్ల సరిహద్దు ఈ రెండు దేశాల మధ్య ఉంది. కారకాస్పై దాడి నేపథ్యంలో భారీగా శరణార్థులు వచ్చే అవకాశమున్నందున ప్రభుత్వం అప్రమత్తమైంది.