Savitribai Phule: అక్షరాలు దిద్దించిన ధీర

Eenadu icon
By Editorial Team Published : 03 Jan 2026 04:13 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

దిహేడేళ్ల యువతి, వివాహిత... అమ్మాయిల కోసం ఒక స్కూలు పెట్టింది. పిల్లలు ఉత్సాహంగా ఆమె దగ్గర అక్షరాలు దిద్దడానికి వెళ్తున్నారు. అది చూసి కొందరికి కన్నుకుట్టింది. ఆడపిల్లలకు, అదీ అన్ని కులాల వారికీ చదువు అవసరమా? అనుకున్నారు. వద్దని చెబితే వినడం లేదని బడికి వెళ్తున్నప్పుడు ఆమె మీద దాడులు చేశారు. అసభ్య పదజాలంతో అవమానించడం, రాళ్లు విసరడం, బురద చల్లడం... ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. అయినా ఆమె తొణకలేదు, బెణకలేదు! సంచీలో మరో చీర పెట్టుకుని బడికి వెళ్లి బురద అంటిన చీరను మార్చుకునేది. ఆరుగురు బాలికలతో మొదలై మూడేళ్లు తిరిగేసరికల్లా మూడు పాఠశాలలు, 150 మంది విద్యార్థినులకు విస్తరించింది ఆమె ప్రయత్నం. మరో ఏడాదికల్లా పుణె ప్రాంతంలో 18 స్కూళ్లు పెట్టారు ఆ దంపతులు. 175 ఏళ్ల క్రితం సమాజానికి ఎదురు నిలిచి వాళ్లు వేసిన పునాది మీదే నేటి మన స్త్రీవిద్య, మహిళాభ్యుదయం వేళ్లూనుకున్నాయి. ఆ దంపతులే- సావిత్రీబాయి ఫులె, జ్యోతిరావ్‌ ఫులె. ఈరోజు సావిత్రీబాయి పుట్టినరోజు.

మహారాష్ట్రలోని సతారా జిల్లా నైగావ్‌ గ్రామంలో 1831 జనవరి 3న ఖండోజీ నెవాసే పాటిల్, లక్ష్మి దంపతుల ఇంట జన్మించారు సావిత్రీబాయి. అప్పటి ఆచారం ప్రకారం పదేళ్లకే జ్యోతిరావు ఫులేతో ఆమె వివాహమైంది. ఆయన ఆధునిక భావాలు కలవారు. సావిత్రి చురుకుదనం, ఉత్సాహం గమనించిన ఫులె ఆమెకు చదవడాన్ని, రాయడాన్ని నేర్పించారు. అహ్మద్‌నగర్‌లోని మిషనరీ సంస్థలో చేరి టీచర్‌ ట్రైనింగ్‌ కూడా పూర్తిచేశారు సావిత్రి. కులప్రసక్తి లేకుండా బాలికలందరికీ చదువుచెప్పాలని పాఠశాలలను ప్రారంభించినందుకు నాటి సమాజం నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్నారామె. మామగారు సైతం కొడుకు, కోడళ్లను ఇంటినుంచి వెలివేశారు. ఇవేవీ ఆ దంపతుల సంఘ సంస్కరణాభిలాషను తగ్గించలేదు. 1852లో ‘మహిళా సేవా మండల్‌’ స్థాపించి మహిళలకు వారి హక్కులపై అవగాహన కల్పించడం మొదలెట్టారు సావిత్రి. బాల్య వివాహాలను వ్యతిరేకించి, కులాంతర వివాహాలను ప్రోత్సహించారు. వితంతువుల పట్ల సమాజం ఆచరిస్తున్న దురాచారాల నిర్మూలనకు పోరాడి గెలిచారు. కులవ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడటం తమ సామాజిక బాధ్యతగా భావించిన ఫులె దంపతులు అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎంతగానో కృషిచేశారు.

భర్త జ్యోతిరావు ఫులె మరణించిన తరవాత ఆయన చితికి తానే స్వయంగా నిప్పు పెట్టారు సావిత్రి. అప్పటివరకూ భర్తతో కలిసి పనిచేసిన ఆమె- ఆపై ఒంటరిగానే ప్రయాణం కొనసాగించారు. సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడటానికి 1873లో జ్యోతిరావు ప్రారంభించిన సత్యశోధక్‌ సమాజ్‌ను విజయవంతంగా నడిపించారు. అంటరానితనం నిర్మూలన, దళితుల విద్యకు ప్రాధాన్యమిచ్చారు. ‘కావ్య ఫులే’, ‘బవన్‌ కాశి సుబోధ్‌ రత్నాకర్‌’ అనే కవితా సంపుటాలను వెలువరించారు. 1897లో ప్లేగు బాధితులకు సేవచేస్తూ తానూ వ్యాధి బారినపడి మరణించారు. ఆ త్యాగమయి జ్ఞాపకార్థం పుణె వర్సిటీ పేరును సావిత్రీబాయి ఫులె విశ్వవిద్యాలయంగా మార్చారు. దేశంలో బాలికల కోసం తొలి పాఠశాలను పెట్టిన సావిత్రీబాయి సేవలకు గుర్తింపుగా ఆమె జయంతిని ‘మహిళా ఉపాధ్యాయ దినోత్సవం’గా నిర్వహించుకుంటున్నాం. 

మానవాళి నేడు ఎదుర్కొంటున్న సమస్యల్లో సగం చేజేతులా కొనితెచ్చుకున్నవే. ప్రకృతి వనరులను నాశనం చేసుకున్న ఫలితాన్ని అనుభవిస్తున్నాం. మన తరవాత తరం మరింత ఎక్కువగా ఆ నష్టాన్ని భరించాల్సి వస్తుంది. ఇప్పటికీ మేలుకోకపోతే ముందుతరాలవారు మనల్ని క్షమించరు.

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.