Pants unbeaten 67 propels Delhi to eight-wicket win over Services

విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఒడిశా చేతిలో అనుహ్యంగా ఓటమి చవిచూసిన ఢిల్లీ జట్టు తిరిగి విజయ బాటలో పడింది. ఈ టోర్నీలో భాగంగా శనివారం సర్వీసెస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయాన్ని అందుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స‌ర్వీసెస్ 42.5 ఓవర్లలో 178 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీ స్పీడ్‌ స్టార్‌ హర్షిత్‌ రాణా 4 వికెట్లు పడగొట్టి సర్వీసెస్‌ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు ప్రిన్స్‌ యాదవ్‌ మూడు, ఇషాంత్‌, సైనీ తలా వికెట్‌ సాధించారు. సర్వీసెస్‌ బ్యాటర్లలో వికాస్ హత్వాలా(26) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. పుల్కత్‌ నరాంగ్‌ 22 పరుగులు చేశాడు.

రాణా, పంత్‌ మెరుపులు..
అనంతరం 179 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం రెండు వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో ఊదిపడేసింది. ఓపెనర్‌ ప్రియాన్ష్‌ ఆర్య(45 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 72 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. టీ20 తరహాలో బ్యాటింగ్‌ బ్యాటింగ్‌ చేశాడు. కేవలం 37 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పంత్‌.. 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 67 పరుగులు చేశాడు.

ఈ ఏడాది సీజన్‌లో పంత్‌కు ఇది రెండో ఫిప్టీ. అంతకుముందు గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్ 70 పరుగులు చేశాడు. మిగితా మ్యాచ్‌లలో మాత్రం పెద్దగా రాణించలేకపోయాడు. 5 మ్యాచ్‌లలో ఇప్పటివరకు 188 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిని భారత వన్డే జట్టు నుంచి తప్పించాలని చాలా మంది డిమాండ్ చేశారు. కానీ అతడిపై సెలెక్టర్లు మరోసారి నమ్మకం ఉంచారు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు పంత్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు.