Shashi Tharoor  reaction on  Bangladeshi cricketer Removal

క్రీడల విషయంలో రాజకీయం చేయడం సరికాదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నుంచి బంగ్లాదేశ్ ప్లేయర్ ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ని తొలగించడంపై ఆయన మాట్లాడారు.  బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు ఈ విధంగా స్పందించడం సరికాదన్నారు.  

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇండియాలో తీవ్ర నిరసనలు వ్యక్తమ‍య్యాయి. ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీ ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ని జట్టు నుంచి విడుదల చేయాలని డిమాండ్లు పెరిగాయి. దీంతో బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ ఆయనను జట్టు నుంచి విడుదల చేసింది. అయితే ఇది సరైన చర్య కాదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు.

శశిథరూర్ మాట్లాడుతూ " క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టడం బుద్ధిహీనమైన చర్య ఒకవేళ ఆస్థానంలో బంగ్లాదేశ్ హిందూ ‍క్రికెటర్ లిట్టన్ దాస్, సౌమ్యాసర్కార్‌ ఉంటే ఈ విధంగానే చేసేవారా మీరు ఎవరిని శిక్షిస్తున్నారు, దేశాన్నా? మతాన్నా? వ్యక్తులనా? అని శశిథరూర్ అన్నారు. మైనార్టీలపై దాడులను మోయడానికి  క్రికెట్‌ను వాడకూడదు. బంగ్లాదేశ్ క్రికెటర్ రహ్మన్‌ విద్వేశపూరిత వ్యాఖ్యలు చేయలేదు. ఎవరిపైనా దాడి చేయలేదు. ఈ ఘటనలతో ఎటువంటి సంబంధం లేదు" అని  అన్నారు. ఆయన కేవలం ఒక ఆటగాడని అతనిని ఈ ఘర్షణలతో ముడిపెట్టడం సరికాదన్నారు.    

అంతేకాకుండా పొరుగుదేశాలతో ఏ దేశం క్రీడలు ఆడకుండా ఏకాకి చేయడం సరికాదని ఈ విషయంలో భారత్‌కు పెద్ద హృదయం ఉండాలని సూచించారు. అయితే బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై జరుగుతున్న దాడులను భారత్ తప్పనిసరిగా ఖండించాల్సిన అవసరం ఉందని తెలిపారు.