ancient India: ప్రాచీన భారత వైజ్ఞానిక పాటవమిది!

Eenadu icon
By Editorial Team Published : 30 Dec 2025 03:09 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

చరిత్ర అనగానే రాజులు, యుద్ధాలు, విప్లవాలు వంటివాటి ప్రస్తావనే ఉంటుంది. కానీ, ఆ బాహ్య పరిణామాల వెనక చింతనలో, మేధస్సులో జరిగే పరిణామాలు కూడా బలమైన ప్రభావం కలిగి ఉంటాయి. అందుకని, ఆయా దేశాల రాజకీయ చరిత్ర ఎంత ముఖ్యమో, వాటి వైజ్ఞానిక- మేధోచరిత్ర కూడా అంతే ముఖ్యం. 

ధునిక భౌతిక శాస్త్ర చరిత్ర పుస్తకాల్లో ఓ ఘట్టం తరచూ ప్రస్తావనకు వస్తుంటుంది. గెలీలియో గెలీలీ అనే ఇటాలియన్‌ శాస్త్రవేత్త పీసా నగరంలోని వాలుసౌధం మీదికి ఎక్కి అక్కడి నుంచి రెండు రాళ్లు (ఒకటి పెద్దది, మరోటి చిన్నది) కింద పడేసి రెండూ ఒకేసారి నేలను చేరుకుంటున్నాయని చూపించారు. ఇది 16వ శతాబ్దం ఆఖర్లో జరిగింది. బరువుతో నిమిత్తం లేకుండా వస్తువులు గురుత్వాకర్షణ శక్తిని బట్టి ఒకేలా పడతాయని ఇప్పుడు ఆరో తరగతి పిల్లలకూ తెలుసు. మరి, గెలీలియో ప్రయోగానికి ప్రాధాన్యం ఏముంది? క్రీ.పూ. 4వ శతాబ్దానికి చెందిన అరిస్టాటిల్‌ అనే గ్రీకు తాత్వికుడు ప్రకృతిలో ఎన్నో పరిణామాల మీద వ్యాఖ్యానించారు. (వాటిలో చాలా వరకు తప్పని ఇప్పుడు మనకు తెలుసు!) ఆ క్రమంలో బరువైన వస్తువులు తేలికైన వస్తువులకన్నా వేగంగా పడతాయన్నారు అరిస్టాటిల్‌. ఆ తప్పును గెలీలియో ప్రయోగాత్మకంగా ఎత్తిచూపారు. ఈ ఘట్టాన్ని నేటి భౌతికశాస్త్ర చరిత్ర పుస్తకాలు గొప్పగా వివరిస్తాయి. 

అద్భుత పరిణామాలు 

వెయ్యేళ్లపాటు మతం గుప్పిట్లో నలిగి, మేధస్సు చచ్చుబడిన ఐరోపా, ఒక్కసారిగా గెలీలియో ప్రయోగాలతో మేలుకున్నట్లు పుస్తకాలు రాస్తాయి. కానీ, 1900 ఏళ్ల కాలంలో రెండు రాళ్లు ఎత్తిపడేసి‡ ఏది ముందు పడుతుందో తేల్చుకోవాలనే కుతూహలం, ఇంగితం ఐరోపా ఖండంలోనే ఎవరికీ లేకపోయిందా? అయినప్పటికీ మనం గెలీలియోను ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడిగా గౌరవిస్తాం, సుమారు వెయ్యిన్నరేళ్ల పాటు మానసిక తమస్సులో జోగిన ఐరోపాను మన్నిస్తాం. ఆ కాలానికి ‘మధ్య యుగం’ వంటి అందమైన పేర్లు పెట్టి చరిత్రలో గౌరవ స్థానాన్ని కల్పిస్తాం. అయితే, ఆ ఒకటిన్నర సహస్రాబ్ద కాలంలోనే భారతావనిలో వైజ్ఞానిక రంగంలో అద్భుతమైన పరిణామాలు జరిగాయి. క్రీ.శ. 475-550 కాలంలో జీవించిన ఆర్యభట్టు భూమి తన అక్షం మీద తాను పరిభ్రమిస్తుందని ప్రతిపాదించారు. ఖగోళశాస్త్ర గణనాలకు సంబంధించిన పలు స్థిరాంకాలను కచ్చితంగా లెక్కించే విధానాలను కనిపెట్టారు. త్రికోణమితిలో ‘సైన్‌’ తదితర ప్రమేయాలను కచ్చితంగా లెక్కించే పద్ధతులను వెలుగులోకి తెచ్చారు. రమారమి క్రీ.శ. 920-1000 కాలంలో జీవించిన రెండో ఆర్యభట్టు అనే మరో గణితవేత్త ఉన్నారు. ఖగోళ, గణిత శాస్త్రాల మీద ‘మహా సిద్ధాంతం’ లేదా ‘ఆర్య సిద్ధాంతం’ అనే పుస్తకం రాశారు. అందులో అక్షరాలు, పద్యాలలో సంఖ్యలను వ్యక్తం చెయ్యడానికి ‘కటపయాది’ అనే పద్ధతి సూచించారు. దాని ప్రకారం ‘పై’ విలువ ‘‘గోపీ భాగ్య మధువ్రాత...’’ అనే శ్లోకంలో పొందుపరిచి ఉంది. క్రీ.శ. 598-668 కాలంలో జీవించిన బ్రహ్మగుప్తుడు అంకగణితంలో సున్నాను, రుణసంఖ్యలను ప్రవేశపెట్టారు. చరిత్రలో మొదటిసారిగా సున్నాను ప్రత్యేక సంఖ్యలా పరిగణిస్తూ- సున్నా, ఇతర సంఖ్యలకు మధ్య వివిధ గణిత చర్యలు జరిపితే ఏం జరుగుతుందనేది నిర్దేశిస్తూ సూత్రాలు నిర్వచించారు. అలా బీజగణితానికి పునాదులు వేశారు. ఆ పద్ధతులన్నీ ‘బ్రహ్మస్ఫుట సిద్ధాంత’ అనే గ్రంథంలో విశదీకరించారు. భౌతిక శాస్త్రంలో గురుత్వాకర్షణ అనే భావనను ప్రతిపాదించారు. దానివల్లే పైకి విసిరిన వస్తువు కింద పడుతుందని, భూమికి అన్ని పక్కలా మనుషులు ఒకే విధంగా నిటారుగా నిలుచుంటారని వివరించారు. ఇదంతా మనదేశంలో వెయ్యిన్నర ఏళ్ల నాటి మాట. మరోవైపు, ఐరోపాలో అయిదు వందల ఏళ్ల క్రితం కూడా చాలామంది భూమి బల్లపరుపుగా ఉందని నమ్మేవాళ్లు. అందుకే ఆ రోజుల్లో అక్కడి నావికులు తీరానికి మరీ దూరంగా ఓడలను నడిపేవారు కాదు. అలా దూరంగాపోతే తమ ఓడలు భూమి అంచుకు చేరి అగాధంలో పడిపోతాయనేది వాళ్ల భయం! 

పరిశోధనలోనూ ఆత్మనిర్భరత 

క్యాల్కులస్‌ను కనిపెట్టింది ఐసాక్‌ న్యూటన్‌ (క్రీ.శ. 1643-1721) అని చదువుకున్నాం. కేరళలో సంగమ గ్రామానికి చెందిన మాధవుడు (క్రీ.శ. 1340-1425) అనే గణితవేత్త క్యాల్కులస్‌కు మూలకర్త అని ఇటీవలి కాలంలో గణిత సమాజం అంగీకరిస్తోంది. క్యాల్కులస్‌కు మూలస్తంభాలైన అవకలన, వ్యవకలనాలను నిర్వచించి వాటిని ఎలా ప్రయోగించాలో వర్ణించారు. అందుకే టేలర్‌ సిరీస్‌ను ఇంటర్మీడియెట్‌ గణిత పుస్తకాల్లో ఇప్పుడు మాధవ-టేలర్‌ సిరీస్‌ అని పిలుస్తున్నారు. ఒక్క గణితంలోనే కాకుండా, ఖగోళ, లోహవిజ్ఞానం, భాషా శాస్త్రం, జీవ, వైద్య శాస్త్రాల్లో సైతం ప్రాచీన భారతీయులు సాధించిన పురోగతిని చరిత్రకారులు జనసామాన్యంలో ప్రచారం చెయ్యాలి. సుదీర్ఘ విజ్ఞాన శాస్త్ర చరిత్రలో భారతీయులకు సముచిత స్థానాన్ని కల్పిస్తూ, అంతర్జాతీయ వైజ్ఞానిక చరిత్ర పుస్తకాలను రాయాలి. కేవలం ఉత్పత్తుల రంగంలోనే కాకుండా, పరిశోధనా రంగంలోనూ ఆత్మనిర్భరత సాధించడానికి ఇలాంటి సాహిత్యం స్ఫూర్తిని కల్పిస్తుంది. 

ప్రపంచవ్యాప్తంగా వేగంగా మారుతున్న భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో చాలా దేశాలు తమ సైనిక పాటవాన్ని పెంచుకోవడంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. ఈ క్రమంలో రక్షణ సామగ్రి కొనుగోళ్లు, వాటి రూపకల్పన, బలగాల ఆధునికీకరణ, పరిశోధన-అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ), మౌలిక వసతుల కల్పన వంటి వాటిపై ఖర్చును పెంచుతున్నాయి. 2024లో ఆయా దేశాల జీడీపీలో సైనిక వ్యయం... (శాతాల్లో)

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :