Blockchain: నేరగాళ్లపై బ్రహ్మాస్త్రం... బ్లాక్‌ చెయిన్‌!

Eenadu icon
By Editorial Team Published : 24 Dec 2025 03:08 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

డిజిటల్‌ యుగంలో సైబర్‌ నేరాలు, డేటా ఉల్లంఘనలు పెద్ద సవాలుగా మారాయి. ఇలాంటి నేరాలపై బ్లాక్‌ చెయిన్‌ సాంకేతిక పరిజ్ఞానం శక్తిమంతమైన ఆయుధంగా పనిచేస్తుంది. మొదట్లో క్రిప్టో కరెన్సీలకు ఉపకరించిన బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ ఇప్పుడు పలు రంగాలకు విస్తరిస్తోంది. ఇందులో ఒకసారి డేటాను నమోదు చేసిన తరవాత మార్చడం కుదరదు. పారదర్శకత, భద్రత అధికం. కాబట్టి పోలీసులు, సైబర్‌ భద్రతకు సమర్థంగా తోడ్పడనుంది. 

లావాదేవీలను అనేక కంప్యూటర్‌ వ్యవస్థలలో నమోదు చేసి భద్రపరిచే సురక్షిత భాగస్వామ్య డిజిటల్‌ లెడ్జరే బ్లాక్‌ చెయిన్‌. ప్రతి లావాదేవీ (బ్లాక్‌) ఎప్పుడు జరిగిందో కచ్చితంగా నమోదు చేస్తారు. అన్ని బ్లాకులు కాలానుగతంగా, ఒక

గొలుసు(చెయిన్‌)లా అనుసంధానమవుతాయి. ఈ సమాచారం అనేక కంప్యూటర్‌ నెట్‌వర్కులలో పంపిణీ అవుతుంది. డేటా లేదా బ్లాకులో ఏ మార్పునకైనా భాగస్వాములందరి ఏకాభిప్రాయం తప్పనిసరి. పూర్తి పారదర్శకంగా, వికేంద్రీకృతంగా పనిచేసేది పబ్లిక్‌ బ్లాక్‌ చెయిన్‌. ఏదో ఒక సంస్థ అధీనంలో ఉండేది- ప్రైవేటు బ్లాక్‌ చెయిన్‌. పలు సంస్థలు కలిసి నిర్వహించేది- కన్సార్షియం బ్లాక్‌ చెయిన్‌. పబ్లిక్, ప్రైవేట్‌ బ్లాక్‌ చెయిన్లు కలగలిస్తే హైబ్రిడ్‌ బ్లాక్‌ చెయిన్‌ అవుతుంది.

నిరంతర నిఘాకు అమోఘ సాధనం 

డేటాపై నిరంతరం నిఘా వేసి అనుమానాస్పద లావాదేవీలను చప్పున పసిగట్టడం ఈ సాంకేతికతతో వీలవుతుంది. నేర ముఠాల కార్యకలాపాలను, నెట్‌వర్కులను, డార్క్‌వెబ్‌ను కనిపెట్టడానికి ఉపకరిస్తుంది. ఓపెన్‌ సోర్స్‌ ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌తో బ్లాక్‌ చెయిన్‌ను అనుసంధానించి నగదు అక్రమ చలామణీని ఇట్టే పట్టేయవచ్చు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినవారెవరో, వారు కార్యకలాపాలు నడిపే తీరు ఏంటో కనిపెట్టవచ్చు. పకడ్బందీగా సాక్ష్యాధారాల నివేదన, వ్యక్తుల గుర్తింపు, డిజిటల్‌ పాలనా నిర్వహణకు బ్లాక్‌ చెయిన్‌ అమోఘ సాధనం. మన పోలీసు, భద్రతా వ్యవస్థలకు ఎంతో ప్రయోజనకరం. డిజిటల్‌ వేలిముద్రలను బ్లాక్‌ చెయిన్‌లో భద్రపరచవచ్చు. బాడీ కెమేరాల ద్వారా సేకరించిన ఆడియో, వీడియో సమాచారాన్నీ నిక్షిప్తం చేయవచ్చు. సీసీటీవీ దృశ్యశ్రవణ సమాచారాన్నీ పొందుపరచవచ్చు. ఈ డేటాలో ఎవరూ జోక్యం చేసుకోలేరు కాబట్టి కోర్టులకు పకడ్బందీ సాక్ష్యాధారాలుగా సమర్పించవచ్చు. నేరగాళ్ల ముఖచిత్రాలు, నేర చరిత్రను, ఫోరెన్సిక్‌ నివేదికలనూ బ్లాక్‌ చెయిన్‌లో డిజిటల్‌ రూపంలో నిక్షిప్తం చేయవచ్చు. ఈ సమాచారాన్ని తారుమారు చేయడం ఎవరికీ సాధ్యంకాదు. 

సైబర్‌ దాడుల నుంచి రక్షణకు...

బ్లాక్‌ చెయిన్‌ వల్ల కేసుల దర్యాప్తు, విచారణ వేగవంతమవుతుంది. పోలీసులు, నిఘా యంత్రాంగం, న్యాయవ్యవస్థ, అంతర్జాతీయ నేర నిరోధక సంస్థల మధ్య బ్లాక్‌ చెయిన్‌ చక్కని సమన్వయం ఏర్పరుస్తుంది. మన భద్రతా సంస్థల మధ్య కీలక, రహస్య సమాచారాన్ని మూడో కంటికి తెలియకుండా బ్లాక్‌ చెయిన్‌ ద్వారా పంపిణీ చేయవచ్చు. సైబర్‌ దాడులు, సైబర్‌ చౌర్యం నుంచి డేటాను కాపాడుకోవచ్చు. ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారాలను ఎదుర్కొనేందుకు సైతం ఈ సాంకేతికత ఉపకరిస్తుంది. బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీలో ఆరితేరిన అమెరికా, ఇజ్రాయెల్, ఎస్తోనియా వంటి దేశాల నుంచి భారతీయ భద్రతా సంస్థలు నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. అయితే, ఇందులో కొన్ని సాంకేతిక లొసుగులూ లేకపోలేదు. ఈ సాంకేతికతపై ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో అదుపు ఉండదు. అందులోని సమాచారం సీమాంతర, గుప్త స్వభావం కలిగి ఉంటుంది. ఇలాంటి లక్షణాలే బ్లాక్‌ చెయిన్‌ సాంకేతికతను పోలీసు, భద్రత, న్యాయ వ్యవస్థలు నూటికి నూరు శాతం చేపట్టేందుకు అడ్డుపడుతున్నాయి. 

మౌలిక వసతులు కరవు

భారత్‌లో బ్లాక్‌ చెయిన్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో చేపట్టడానికి అవసరమైన మౌలిక వసతులు ఏర్పడలేదు. కేంద్ర, రాష్ట్రాల సిబ్బందికి అవసరమైన శిక్షణ కూడా లేదు. ఒకరి అధికారాల్లో మరొకరు జోక్యం చేసుకోరాదనే నిబంధన ఎటూ ఉంది. అంతర్జాతీయ స్థాయిలో కేంద్రీకృత నియంత్రణ సంస్థ కూడా లేకపోవడంతో ఒక దేశంలో జరిగిన నేరంపై దర్యాప్తు చేసేందుకు ఇతర దేశాలు- ఎంతమేర ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించవచ్చనేది సందేహమే. ఇది సమస్యాత్మకంగా మారవచ్చు. క్రిమినల్‌ కేసుల్లో ఒక దేశం మరొక దేశ అధికార పరిధిని అతిక్రమించకూడదు కదా! అలాగే వ్యక్తిగత సమాచార గోప్యతకు అత్యధిక దేశాలు చట్టాలు చేశాయన్న సంగతి మరవద్దు. నేరగాళ్లు బోగస్‌ పేర్లు, చిరునామాలను ఉపయోగించడం వల్ల వారి సమాచారం ఎంతవరకు విశ్వసనీయమనే ప్రశ్న ఎటూ ఉంది. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీల విషయంలో ఈ ప్రశ్న చాలా కీలకం. నేరగాళ్లు అక్రమ ధనాన్ని దేశాల సరిహద్దులు దాటించడానికి బ్లాక్‌ చెయిన్‌ సాంకేతికతను ఉపయోగిస్తారు. వేర్వేరు దేశాల నుంచి కార్యకలాపాలు సాగించే ఈ అంతర్జాతీయ ముఠాలను గుర్తించడం సులభమేమీ కాదు. బ్లాక్‌ చెయిన్‌ నెట్‌వర్కులు స్వతంత్రంగా పనిచేసే కంప్యూటర్‌ యంత్రాంగాల నిర్వహణలో ఉంటాయి. వాటిపై ఏ ఒక్క దేశానికీ చట్టపరమైన అదుపు ఉండకపోవచ్చు. అవసరమైనప్పుడు ఈ కంప్యూటర్ల నుంచి మనకు కావాల్సిన సమాచారం పొందడం తేలిక కాకపోవచ్చు. 
మనదేశంలో 2000 సంవత్సరంనాటి సమాచార సాంకేతిక చట్టంతోపాటు రిజర్వు బ్యాంకు నిబంధనలూ బ్లాక్‌ చెయిన్‌ కార్యకలాపాలను నియంత్రిస్తాయి. వ్యక్తిగత సమాచారాన్ని కాపాడటానికి దాన్ని ఏయే సందర్భాల్లో చెరిపేయాలో, సరిదిద్దాలో 2023నాటి డిజిటల్‌ వ్యక్తిగత సమాచార గోప్యతా రక్షణ చట్టం నిర్దేశిస్తోంది. భారతీయ కోర్టులు ఎలక్ట్రానిక్‌ కాంట్రాక్టుల చెల్లుబాటును ఆమోదిస్తున్నా, బ్లాక్‌ చెయిన్‌ స్మార్ట్‌ కాంట్రాక్టులకు చట్టపరమైన ప్రాతిపదిక మాత్రం ఇంకా ఏర్పడాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇతర దేశాలు రూపొందించిన చట్టాలను భారత్‌ పరిశీలించాలి. అలాగే బ్లాక్‌ చెయిన్‌ సాంకేతికతను పౌరులపై నిఘాకు ఉపయోగించకూడదు. పౌర హక్కులకు భంగం కలగకుండా జాగ్రత్తపడాలి. నైతికపరమైన సందిగ్ధతకు తావివ్వకూడదు.  

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :