AI: మనం చూస్తున్న అతి పెద్ద మార్పు ఏఐ

Eenadu icon
By Telangana News Desk Published : 23 Dec 2025 04:04 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

‘మానవ గమనాన్ని మార్చేసే కొన్ని మార్పులు అప్పుడప్పుడూ వస్తుంటాయి. కృత్రిమ మేధ(ఏఐ) కూడా అంతే. ఒక తరం చూస్తున్న అతి పెద్ద మార్పు ఇది. దీన్ని స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. రానున్న రోజుల్లో మనం చేసే ప్రతి పనినీ ఏఐ ప్రభావితం చేస్తుంది’ అని  అంటున్నారు.. తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్‌ హబ్‌ సీఈవో ఫణి నాగార్జున. ‘ఈనాడు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాజంపై ఏఐ చూపే ప్రభావం, దాని వల్ల వచ్చే మార్పులు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై తన అభిప్రాయాలను ఇలా పంచుకున్నారు...

బాధ్యతాయుతమైన ఏఐ గురించి ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. ఇది నిజంగా అంత అవసరమా?

అవును. బాధ్యతాయుతమైన ఏఐ అంటే, ఉద్దేశించిన ప్రయోజనం అమలు అయ్యేలా చూడటం. ఒక ఏఐ టూల్‌ను తీసుకొచ్చేటప్పుడు అది సురక్షితంగా, నైతికంగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. దుర్వినియోగాన్ని నివారించేందుకు ఎలాంటి రక్షణ వ్యవస్థలున్నాయి అనేది చాలా ముఖ్యం. ఉదాహరణకు, ఆరోగ్య సంరక్షణకు సంబంధించి, పరిమిత సమాచారం మాత్రమే తీసుకొని, దాన్ని ఏఐతో విశ్లేషించి ఒక ఔషధాన్ని విడుదల చేస్తే, అది కొంతమందికి మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుంది. మరికొందరికి హాని కలిగించవచ్చు. బాధ్యతాయుతమైన ఏఐ పరిష్కారాలు ఎప్పుడూ సురక్షితంగా, జనాభాలో ఎక్కువ మందికి ఉపయోగపడేలా ఉండాలి.

సమాజంపై ఏఐ ఇప్పుడు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది?

ఏఐని నాగరికత మార్పుతో పోల్చవచ్చు. నేను గత 30 ఏళ్లలో ఇంటర్నెట్, మొబైల్, క్లౌడ్‌ అనే మూడు ప్రధాన సాంకేతిక పోకడలను చూశాను. కానీ, ఇది వీటన్నింటినీ మించి పోయింది. వ్యక్తిగత, కంపెనీలు, విస్తృత ఆర్థిక వ్యవస్థలో మన జీవితంలోని ప్రతి రంగాన్ని ప్రభావితం చేయబోతోంది. ఏఐ మానవ సమాజానికి పెద్ద ఎత్తున ప్రయోజనకరంగా ఉండాలంటే, దాన్ని మనం స్వీకరించేందుకు, ఆదరించేందుకు సిద్ధంగా ఉండాలి. అదే సమయంలో ఏఐని దుర్వినియోగం చేయకుండా ఉండటం చాలా ముఖ్యం.  

నిపుణులు, ఉద్యోగుల స్థానాన్ని ఏఐ భర్తీ చేస్తుందనే అందరూ అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం?

కృత్రిమ మేధ నిపుణులు, ఉద్యోగుల పనితీరును మరింత మెరుగుపరుస్తుందని నా అభిప్రాయం. ఉదాహరణకు వైద్య రంగంలో రేడియాలజిస్టులు మీ ఎక్స్‌-రేని చూసి, నివేదిక ఇస్తారు. కొన్నిసార్లు గుర్తించలేని అంశాలూ ఉండొచ్చు. కృత్రిమ మేధ ఎక్స్‌-రేలను విశ్లేషించి, మరింత లోతుగా సమాచారాన్ని రేడియాలజిస్టుకు అందించే వీలుంది. దీనివల్ల వారి ఉత్పాదకత పెరుగుతుంది. ఇది ఒక రంగానికి సంబంధించిదే కాదు.. మానవ ప్రమేయం అవసరమైన ప్రతి చోటా, ఏఐ వారికి ఒక అదనపు సామర్థ్యాన్ని అందిస్తుంది. 

ఈ విషయంలో తెలంగాణ చేస్తున్న కృషి ఏమిటి?

రాష్ట్రంలో జీసీసీలు (గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్లు) పెరుగుతున్నాయి. నిపుణులు అధికంగా అందుబాటులో ఉన్నారు. ప్రపంచానికి ఏఐ రాజధానిగా మారేందుకు అవసరమైన అన్ని అవకాశాలూ ఇక్కడ ఉన్నాయి. వ్యవసాయం, ఆరోగ్య, ఆర్థిక, ప్రభుత్వ సేవలు.. ఇలా ప్రతి రంగంలోనూ ఏఐని అనుసంధానం చేయాలి. అప్పుడే తెలంగాణ 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యం అవుతుంది. ఈ దిశగా తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్‌ హబ్‌ ఒక కీలక అడుగుగా చెప్పొచ్చు. రానున్న మూడేళ్లలో 50 లక్షల మందికి పైగా ఏఐలో శిక్షణ ఇవ్వాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :