Fact check: ఐటీ విభాగం చేతికి ‘సోషల్’ ఖాతాలు.. ప్రచారంలో నిజమెంత?

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Fact check | ఇంటర్నెట్ డెస్క్: పౌరుల సామాజిక మాధ్యమ ఖాతాలు, ఇ-మెయిల్స్ను ఆదాయపు పన్ను విభాగం (Income Tax Department) ఇకపై యాక్సెస్ చేయనుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026 ఏప్రిల్ 1) నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. అలాంటి అధికారమేదీ ఐటీ విభాగానికి ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్చెక్ విభాగం దీనిపై వివరణ ఇచ్చింది. (Fact check)
ఆదాయపు పన్ను చట్టం, 2025లోని సెక్షన్ 247 ప్రకారం.. ఐటీ విభాగం నిర్వహించే దాడులు, సోదాల సమయంలో మాత్రమే సామాజిక మాధ్యమాలు, ఇ-మెయిల్స్ను తనిఖీ చేసే అధికారాలను వినియోగించాల్సి ఉంటుందని కేంద్రం పేర్కొంది. అది కూడా తీవ్రమైన పన్ను ఎగవేత ఆరోపణలకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడు మాత్రమే వినియోగించాలి. చట్టబద్ధంగా వ్యవహరించే ఆదాయపు పన్ను చెల్లింపుదారుల డిజిటల్ ప్లాట్ఫారాలను యాక్సెస్ చేసే అధికారం ఐటీ విభాగానికి లేదని తెలిపింది. సోదాలు, తనిఖీల సమయంలో డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొనే అధికారం ఆదాయపు పన్ను చట్టం, 1961లో కూడా ఉందని, మారిన పరిస్థితులకు అనుగుణంగా డిజిటల్ రికార్డుల స్వాధీనం అనేది కొత్తగా చేర్చారని కేంద్రం స్పష్టం చేసింది. బ్లాక్మనీ, పన్ను ఎగవేతదారుల కట్టడికే తప్ప.. సాధారణ పౌరుల సోషల్మీడియా ఖాతాలను మానిటరింగ్ చేయడం ఈ అధికారాల ముఖ్య ఉద్దేశం కాదని పునరుద్ఘాటించింది.
► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :