Jemimah Rodrigues and KL Rahul set to be named new Captains of Delhi Capitals in WPL and IPL

ఐపీఎల్‌, డబ్ల్యూపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ కెప్టెన్లను మార్చనుందని సోషల్‌మీడియా కోడై కూస్తుంది. ఐపీఎల్‌లో అక్షర్‌ పటేల్‌ స్థానంలో కేఎల్‌ రాహుల్‌.. డబ్ల్యూపీఎల్‌లో మెగ్‌ లాన్నింగ్‌ స్థానంలో జెమీమా రోడ్రిగ్స్‌ డీసీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నారని సమాచారం. 2026 సీజన్‌ ప్రారంభం నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నట్లు తెలుస్తుంది. కెప్టెన్ల మార్పు విషయాన్ని డీసీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఐపీఎల్‌ వర్గాల్లో సైతం జోరుగా ప్రచారం జరుగుతుంది.

గత ఐపీఎల్‌ సీజన్‌లో డీసీ అక్షర్‌ పటేల్‌ నేతృత్వంలో ఆశించిన స్థాయి ప్రదర్శనలు చేయలేకపోయింది. వాస్తవానికి గత సీజన్‌లోనే కేఎల్‌ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినప్పటికీ.. అతను సుముఖత వ్యక్తం చేయలేదని ప్రచారం జరిగింది. ఈసారి ఎలాగైనా కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవాలని మేనేజ్‌మెంట్‌ రాహుల్‌పై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అక్షర్‌ పటేల్‌ నేతృత్వంలో డీసీ గత సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో సగం గెలిచినా ప్లే ఆఫ్స్‌ అవకాశాలను తృటిలో (ఐదో స్థానం) కోల్పోయింది. రానున్న సీజన్‌లో ఎలాగైనా ప్లే ఆఫ్స్‌కు చేరాలనే ఉద్దేశంలో భాగంగా కెప్టెన్‌ మార్పు జరిగినట్లు సమాచారం.

డబ్ల్యూపీఎల్‌ విషయానికొస్తే.. గత సీజన్‌లో డీసీ అద్బుతమైన ప్రదర్శనలు కనబర్చి ఫైనల్‌కు చేరినా, తుది పోరులో ముంబై ఇండియన్స్‌ చేతిలో స్వల్ప తేడాతో ఓడి, మరోసారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. డబ్ల్యూపీఎల్‌లో కెప్టెన్‌ మార్పు అవసరం లేకపోయినా.. స్వదేశీ ప్లేయర్‌ కెప్టెన్‌గా ఉండాలనే ఉద్దేశంతో డీసీ మేనేజ్‌మెంట్‌  జెమీమా రోడ్రిగ్స్‌కు కెప్టెన్సీ అప్పజెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. 

ఈ క్రమంలో ప్రస్తుత కెప్టెన్‌ మెగ్‌ లాన్నింగ్‌ను తప్పిస్తారని సమాచారం. జెమీమా ఎంపికకు ఆమె ప్రపంచకప్‌ ప్రదర్శనలను కూడా కొలమానంగా తీసుకున్నట్లు తెలుస్తుంది. జెమీమా తాజాగా ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రదర్శనలు చేసి టీమిండియా టైటిల్‌ గెలవడంలో ప్రధానపాత్ర పోషించింది. ముఖ్యంగా ఆసీస్‌తో జరిగిన సెమీస్‌లో జెమీమా చేసిన సూపర్‌ సెంచరీ చరిత్రలో నిలిచిపోయేదిగా ఉంది.