Visakhapatnam: విశాఖలో 189 టన్నుల పశు మాంసం పూడ్చివేత

Eenadu icon
By Crime News Team Updated : 22 Dec 2025 18:20 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఆనందపురం: గోవులను వధించి.. ఆ మాంసాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేస్తున్న అంతర్జాతీయ రాకెట్‌ను విశాఖపట్నం సిటీ పోలీసులు ఛేదించారు. మొత్తం 189 టన్నుల మాంసాన్ని సీజ్‌ చేసి, కీలక నిందితులను అరెస్టు చేసినట్లు విశాఖ-1 డీసీపీ మణికంఠ మీడియాకు వెల్లడించారు. దేశవ్యాప్తంగా డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు ప్రధాన పోర్టుల్లో తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో, పశుసంవర్థకశాఖకు అందిన ఫిర్యాదుల మేరకు రాష్ట్ర విజిలెన్స్‌, ఫుడ్‌ సేఫ్టీ అధికారులతో కలిసి ఆనందపురం పరిధిలోని శ్రీ మిత్ర కోల్డ్‌ స్టోరేజ్‌లో తనిఖీలు నిర్వహించారు. అక్కడ విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంచిన మాంసంపై అనుమానం రావడంతో.. శాంపిల్స్‌ను హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపారు. ఈ పరీక్షల్లో ఆవు మాంసం, ఎద్దు మాంసం, గేదెమాంసం ఉన్నట్లు తేలింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రధాన నిందితుడైన ఫర్హాన్‌ను అరెస్టు చేశారు. విచారణలో ఇదో పెద్ద రాకెట్‌ అని తేలడంతో, ప్రధాన సరఫరాదారులైన మన్సూర్‌ అలీని మహారాష్ట్రలోని లోనావాలో, రషీద్‌ ఖురేషిని ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో అరెస్టు చేశారు. తప్పుడు ఇన్వాయిస్‌లు, ఈ-వే బిల్లులు, హెల్త్‌ సర్టిఫికెట్లు తయారు చేసి.. విశాఖపట్నం పోర్టు ద్వారా అక్రమంగా పశు మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు విచారణలో నిందితులు అంగీకరించారు.  మిగతా ఆరుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.  సీజ్‌ చేసిన మాంసాన్ని పూడ్చేందుకు కోర్టు అనుమతించడంతో.. జీవీఎంసీ, కాలుష్య నియంత్రణ మండలి, పశుసంరక్షణ శాఖ, రెవెన్యూ అధికారుల సమక్షంలో 189 టన్నుల మాంసాన్ని పూడ్చిపెట్టినట్లు డీసీపీ తెలిపారు.

► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Dec 2025 17:16 IST