Cybercrime: గంటకు రూ.8.54 లక్షల దోపిడీ.. క్షణాల్లో వందల ఖాతాల్లోకి సొత్తు మళ్లింపు

Eenadu icon
By Crime News Desk Published : 22 Dec 2025 06:45 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఈనాడు, అమరావతి: సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏపీలో సగటున ప్రతి గంటకు రూ.8.54 లక్షలు దోచుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ రూ.751.40 కోట్లు కొల్లగొట్టారు. డిజిటల్‌ అరెస్టులు, క్రెడిట్, డెబిట్‌ కార్డులు, ఓటీపీ, ఆన్‌లైన్‌ పెట్టుబడులు, ట్రేడింగ్, క్రిప్టోకరెన్సీ లావాదేవీలు, ఈ-కేవైసీ, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఉద్యోగాల పేరిట మోసాలు, న్యూడ్‌ వీడియోకాల్స్‌తో ఉచ్చులోకి లాగటం.. ఇలా ఒకటేమిటి ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులతో నేరాలకు పాల్పడుతున్నారు. కేంద్ర హోంశాఖ పరిధిలోని నేషనల్‌ సైబర్‌క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌లో ఈ ఏడాదిలో మన రాష్ట్రం నుంచి నమోదైన ఫిర్యాదుల ఆధారంగా ఈ గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. జనవరి నుంచి ఇప్పటివరకూ ఈ పోర్టల్‌కు ఏపీ నుంచి 57,673 ఫిర్యాదులు అందగా. ఆయా ఘటనల్లో బాధితులు రోజుకు సగటున రూ.2.05 కోట్లు పోగొట్టుకుంటున్నట్లు వెల్లడైంది. ఎన్‌సీఆర్‌పీకి అందిన ఫిర్యాదుల్లో ఒకే తరహాలో ఉన్నవాటన్నింటినీ వర్గీకరించి పోలీసులు 1,771 కేసులు నమోదు చేశారు.

ఒక్క శాతమైనా రికవరీ కావట్లేదు..

  • ఈ ఏడాదిలో జరిగిన నేరాల్లో సైబర్‌ నేరగాళ్లు బాధితుల నుంచి రూ.751.40 కోట్లు కొల్లగొడితే అందులో 2.21 కోట్లు (0.29%) మాత్రమే అధికారులు వెనక్కి తీసుకురాగలిగారు. బాధితులు పోగొట్టుకొంటున్న దాంట్లో కనీసం ఒక్క శాతమైనా రికవరీ కావట్లేదు. మరో రూ.89 కోట్లు (11.84%) నేరగాళ్లపరం కాకుండా బ్యాంకు ఖాతాల్లో స్తంభింపజేయగలిగారు. 
  • బాధితుడి బ్యాంకుఖాతా నుంచి తాము చెప్పిన ఖాతాల్లోకి సొమ్ము జమైన వెంటనే సైబర్‌ నేరగాళ్లు క్షణాల వ్యవధిలో దాన్ని వందల ఖాతాల్లోకి మళ్లించేస్తున్నారు. ఈ మ్యూల్‌ ఖాతాల సేకరణ కోసం కమీషన్లు ఇచ్చి మరీ ప్రత్యేక ముఠాలనే నడిపిస్తున్నారు. దీంతో సొత్తు రికవరీ దర్యాప్తు సంస్థలకు కష్టమవుతోంది.
  • ఈ సైబర్‌ నేరాల ముఠాల నిర్వాహకులు విదేశాల్లో ఉంటూ తమ తరఫున ఆపరేటర్లను ఇక్కడ పెట్టుకుని దోపిడీకి పాల్పడుతున్నారు. దీంతో కేసుల ఛేదన సవాల్‌గా మారుతోంది. 
  • నేరగాళ్లు వేర్వేరు దేశాలు, వివిధ ప్రాంతాల్లో ఉంటూ ఈ మోసాలకు తెగబడుతున్నారు. వారిని పట్టుకోవటం, సొమ్ము రికవరీ చేయటం కోసం ఎంతో శ్రమ పడాల్సి వస్తోంది. 
  • సైబర్‌ నేరాల బారిన పడిన మొదటి గంటలోగా (గోల్డెన్‌ అవర్‌లో) బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగలిగితే ఆ సొత్తు నేరగాళ్ల ఖాతాల్లోకి మళ్లిపోకుండా బ్యాంకు వద్దే స్తంభింపజేసేందుకు అవకాశముంటుంది. 
  • టోల్‌ఫ్రీ నంబర్‌ 1930కు కాల్‌ చేసి ఫిర్యాదు ఇవ్వొచ్చు.
► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :