Revanth Reddy: సభలో చర్చకు సిద్ధమా?

Eenadu icon
By Telangana News Desk Published : 22 Dec 2025 03:35 IST Ee Font size
  • A
  • A+
  • A++
5 min read

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి జలాలపై అవసరమైతే రెండేసి రోజుల చొప్పున శాసనసభలో చర్చకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చర్చలకు వస్తానని ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ అంగీకరిస్తే జనవరి 2 నుంచే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆదివారం సాయంత్రం తన నివాసంలో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. ‘‘జనవరి 2న సభకు వస్తానని కేసీఆర్‌ చెప్పకపోయినా... జనవరిలో అసెంబ్లీ శీతాకాల సమావేశాల ఏర్పాటుకు మంత్రివర్గ సమావేశంలో చర్చించి తేదీలు నిర్ణయిస్తాం. అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలపై చర్చించాలని కేసీఆర్‌ను అడుగుతుంటే బహిరంగ సభలకు వెళ్తానంటున్నారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతలా శాసనసభకు వచ్చి చర్చించాలని కేసీఆర్‌ను మేం ఆహ్వానిస్తున్నాం. సభలో ఆయన గౌరవమర్యాదలకు ఎలాంటి భంగం కలగకుండా చూసే బాధ్యత మాది. ఆయన గౌరవానికి భంగం కలిగేలా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని కూడా సభాపతికి విన్నవిస్తాను. నీళ్లు-నిజాలపై ఎవరేం చేశారనేది సభావేదికగా ముఖాముఖి చర్చిద్దాం. కేసీఆర్‌ తన అనుభవంతో రాష్ట్రానికి ఉపయోగపడే ఏ సూచన చేసినా ప్రభుత్వం ఆమోదిస్తుంది. కేసీఆర్‌కు వంతపాడేవారితో చర్చలకు సిద్ధంగా లేం. సభకు రాని కేసీఆర్‌ ప్రతిపక్ష నేతగా ఉండాలా వద్దా అనేది భారాస నిర్ణయించుకోవాలి. ఆయన ఆరోగ్యం ఎలా ఉందని భారాస ఎంపీలను మోదీ అడగగానే కేసీఆర్‌కు ఉత్సాహం వచ్చింది. లోక్‌సభ ఎన్నికలు, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత ప్రతిపక్ష నేత హోదా గుర్తుకొచ్చింది. 

కేంద్రంతో పనులు చేయించుకోవడానికే దిల్లీకి...

కేంద్ర ప్రభుత్వంతో పనులు చేయించుకోవడానికే దిల్లీకి వెళుతున్నా. కేంద్రంతో మాట్లాడటం వల్లే కేసీఆర్‌ గతంలో అధిక వడ్డీలకు తెచ్చిన రూ.26 వేల కోట్ల అప్పులను తీర్చేందుకు అనుమతి ఇచ్చింది. అధిక వడ్డీలపై తెచ్చిన మరో రూ.85 వేల కోట్ల అప్పులను తీర్చడానికి తక్కువ వడ్డీకి రుణాలను పొందేందుకు అనుమతించాలని ఇటీవల కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరాను. తక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చి, అధిక వడ్డీలకు తెచ్చినవాటిని కట్టేస్తే ఏటా రూ.4 వేల కోట్ల ఆర్థిక భారం తగ్గుతుందని భావిస్తున్నాం. కేసీఆర్‌ రూ.8.11 లక్షల కోట్ల అప్పులు చేశారు. 12% వడ్డీలకు అప్పులు తెచ్చి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారు. 

కుమారుడు, అల్లుడు కొట్లాడుకుంటున్నారు...

కేసీఆర్‌కు ఆయన కుటుంబం నుంచే ప్రమాదం పొంచి ఉంది. కుమారుడు కేసీఆర్‌ కుర్చీ కోసం, అల్లుడు ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్నారు. అల్లుడి చేతిలోకి పార్టీ పోతుందన్న భయంతోనే కేసీఆర్‌ ఫాంహౌస్‌ నుంచి బయటకు వచ్చారు. కేసీఆర్‌ ఉన్నంతకాలం హరీశ్‌రావు ఎక్కడికీ పోరు. పార్టీతో పాటు పార్టీ ఆస్తులపై ఆయన కన్నేశారు. కానీ, భారాసను కేటీఆర్‌ చేతిలో పెట్టాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. నేను కోటి మంది మహిళలకు చీర, సారె ఇచ్చి గౌరవిస్తే కేసీఆర్‌ కుటుంబం మాత్రం కవితను పార్టీ నుంచి బయటకు పంపింది. 

కేసీఆర్‌ పాలనలో తెలంగాణకు తీరని అన్యాయం

కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే మహబూబ్‌నగర్‌ జిల్లా. కృష్ణా జలాల్లో వాటా కోసమే తెలంగాణ ఉద్యమానికి పునాది రాయి పడింది. సమైక్య రాష్ట్రంలో కంటే కేసీఆరే తన పాలనలో తెలంగాణకు తీరని అన్యాయం చేశారు. ఆయన హయాంలోనే ఏపీ జలదోపిడీ జరిగింది. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాగా 299 టీఎంసీలు చాలని ఆయన సంతకాలు పెట్టి.... ఉమ్మడి పాలమూరు, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు మరణశాసనం రాశారు. కృష్ణా జలాలపై ఏపీకి శాశ్వతంగా హక్కులు రాసిచ్చారు. అందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కృష్ణా నది తెలంగాణలోకి ప్రవేశించే జూరాల నుంచి కాకుండా బాగా దిగువన ఉన్న శ్రీశైలంపై నుంచి పాలమూరు-రంగారెడ్డికి నీళ్లు తీసుకోవాలనే ప్రణాళికతో అన్యాయం చేశారు. పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి లాంటి ప్రాజెక్టులను ఏపీ నిర్మించుకున్నా పట్టించుకోలేదు. గోదావరి జలాలను అటు ఇచ్ఛాపురం వరకూ, ఇటు నాయుడుపేట, రాయలసీమలకు తరలించుకుపోవాలంటూ చంద్రబాబుకు సలహా ఇస్తూ... పట్టిసీమను కట్టినందుకు అభినందిస్తూ కేసీఆర్‌ అసెంబ్లీలో మాట్లాడిన వీడియో ఉంది. భారాస సభలు పెట్టే ప్రతి ఊర్లోనూ దాన్ని ప్రజల ముందు ప్రదర్శిస్తాం. 

ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే అధిక నీటి వినియోగం

భారాస పాలనలో సాగునీటి ప్రాజెక్టులపై రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి, వాటిలో రూ.1.80 లక్షల కోట్ల బిల్లులు చెల్లించారు. అయినా పదేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ, డిండి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఏ ఒక్కదాన్నీ భారాస ప్రభుత్వం పూర్తి చేయలేదు. వాటిని పూర్తి చేసిఉంటే తెలంగాణకు కృష్ణా జలాల్లో అధికంగా నీటిని వాడుకునే అవకాశం దక్కి ఉండేది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులపై రూ.6,800 కోట్లు ఖర్చు చేశాం. 

కాంట్రాక్టులు, కమీషన్లకు అమ్ముడుపోయారు

భారాస ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి డీపీఆర్‌ను సరిగా రూపొందించకపోవడంతోనే కేంద్రం వెనక్కి పంపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం ఆపాలని ఎన్‌జీటీలో కేసులు వేసిన బీరం హర్షవర్ధన్‌రెడ్డికి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ కొల్లాపూర్‌ టికెట్‌ ఇచ్చారు. కృష్ణా జలాల్లో ఏపీకి 64%, తెలంగాణకు 36% వాటా ఇస్తే చాలని కేసీఆర్‌ సంతకం చేసి... కాంట్రాక్టులు, కమీషన్లకు అమ్ముడుపోయారు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణా నది పరీవాహక ప్రాంతం లెక్కల ప్రకారం నదీ జలాల్లో 71% వాటా కావాలని పోరాడుతున్నాం. కేసీఆర్‌ 50% కూడా అడగలేదు. మొత్తం 94 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగితే 87 చోట్ల కాంగ్రెస్‌ మద్దతుదారులు నెగ్గారు. నిజనిర్ధారణ కమిటీ వేసి ఏ గ్రామానికైనా వెళ్లి పరిశీలిద్దాం. ఏ పార్టీ మద్దతుదారులు సర్పంచులుగా గెలిచారో తేలుద్దాం. యూరియా కోసం యాప్‌ను ప్రవేశపెట్టి అధునాతన టెక్నాలజీని వాడతామని చెపితే కేసీఆర్‌ భరించలేకపోతున్నారు’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. 

జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మేడారం మహాజాతర పోస్టర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • స్టాండింగ్‌లోనే.. సిట్‌.. ముందుకు కదలని బెట్టింగ్‌ యాప్‌ల కేసు దర్యాప్తు అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న బెట్టింగ్‌ యాప్‌లకు ముకుతాడు వేసేందుకు ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) పేరుకే పరిమితమైంది.
  • భారతీయ ప్రతిభా సామర్థ్య వేదిక ఆలోచనలు, ఆవిష్కరణలు, సంకల్పాల శక్తిమంత కలయిక ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ ఎక్స్‌పో-2026’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
  • సినీ నటి ప్రత్యూష మృతి కేసులో.. సిద్ధార్థరెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డికి తెలంగాణ హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసింది.
  • సినీనటుడు మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ విద్యార్థి నాయకుల కిడ్నాప్‌ కేసులో సినీనటుడు, మోహన్‌బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) ఛాన్స్‌లర్‌ మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
  • తీరంలో యుద్ధ నౌకల జాతర ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం రాత్రి విశాఖ ఈఎన్‌సీ ఆఫీసర్స్‌ మెస్‌లో విందు (ప్రెసిడెన్షియల్‌ బాంక్వెట్‌) ఇచ్చారు.
  • హంగ్‌లో అదృష్ట హస్తం ఛైర్‌పర్సన్‌ ఎన్నికలు వాయిదా పడిన 11 మున్సిపాలిటీల్లో మంగళవారం 8 చోట్ల ఆ ప్రక్రియను పూర్తిచేశారు.
  • బయో వరల్డ్‌గా తెలంగాణరాష్ట్రం ‘బయో ఆసియా తన పేరును దాటి.. బయో వరల్డ్‌గా మారుతోంది. ఈ సభను చూస్తుంటే.. బయో వరల్డ్‌గా తెలంగాణ ఎదుగుతుందనే విషయాన్ని నేను గర్వంగా చెప్పగలను.
  • రూ.1,700 కోట్ల పెట్టుబడులు బయో ఆసియా 2026 సదస్సు వేదికగా మంగళవారం తెలంగాణకు రూ.1,700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
  • విలువలు, విధానాలపై కుటుంబ సభ్యులకు స్పష్టత ఉండాలి వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే.. కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజా కిరణ్‌ అన్నారు.
  • మీ టాయిలెట్టే మీ డాక్టర్‌ వైద్యఆరోగ్య రంగంలో సాంకేతికంగా పెను మార్పులు వస్తున్నాయి. వైద్య నిర్ధారణ పరీక్షలు సులభతరం అవుతున్నాయి.
  • 70 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో పాత ఫీజులే రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్‌ఆర్‌సీ) షాక్‌ ఇవ్వనుంది.
  • డాన్‌.. సింబా.. లియో డాన్‌.. సింబా.. లియో.. చార్లీ.. టైసన్‌.. రాణా.. విరాట్‌.. పోలీసు సాయుధబలగాల్లో చేరేందుకు సిద్ధమైన సుశిక్షిత జాగిలాలివి.
  • చెత్త కనిపిస్తే సహించేది లేదు రాజధాని పరిధిలోకి వచ్చే మూడు నగరపాలక సంస్థల పరిధిలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
  • ఎప్‌సెట్‌ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు ఎప్‌సెట్‌ దరఖాస్తు స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా, రిజిస్ట్రేషన్‌ సంఖ్యను పోగొట్టుకున్నప్పటికీ మళ్లీ పొందేలా కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెచ్చినట్లు కన్వీనర్‌ ఆచార్య కె.విజయకుమార్‌రెడ్డి వెల్లడించారు.
  • రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం భాజపానే పురపాలిక ఎన్నికల్లో భాజపా కరీంనగర్‌ కార్పొరేషన్, నారాయణపేట మున్సిపాలిటీలను కైవసం చేసుకుందని, భవిష్యత్తులో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా శ్రేణులు శ్రమించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు పిలుపునిచ్చారు.
  • ప్రతి ముగ్గురిలో ఒక చిన్నారికి భారతీయ టీకాలు ప్రపంచంలోని ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరికి భారత్‌ నుంచి టీకాలు సరఫరా అవుతున్నాయని భారత్‌ బయోటెక్‌ చీఫ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రేచస్‌ ఎల్ల తెలిపారు.
  • నా బిడ్డకు పూర్తి న్యాయం జరగలేదు తన బిడ్డకు వందశాతం న్యాయం జరిగిందని భావించట్లేదని ప్రత్యూష తల్లి సరోజినీదేవి అన్నారు. ఆమె మంగళవారం ఇక్కడ ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు.
  • మాటలు.. మంటలు.. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో మంగళవారం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్లు, వైస్‌ఛైర్‌పర్సన్ల ఎన్నిక ప్రక్రియ సందర్భంగా కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
  • మున్సిపల్‌ ఎన్నికల్లో.. ముందూ.. వెనకా పంపకాలే మున్సిపల్‌ ఎన్నికల్లో ఆద్యంతం.. కాసుల హవాయే నడిచింది. పోలింగ్‌ వరకు ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంచిన రాజకీయ పార్టీలు.. కౌంటింగ్‌ తర్వాత బలసమీకరణలో భాగంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఆకట్టుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి.
  • పొత్తు కొనసాగేది.. లేనిది కాంగ్రెస్‌ చేతిలోనే కొత్తగూడెం కార్పొరేషన్‌గా ఏర్పడ్డ మొదటి ఎన్నికల్లోనే సీపీఐ అపూర్వ విజయం సాధించిందని, కాంగ్రెస్‌తో పొత్తు లేకున్నా సత్తాచాటామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.