దేవాలయాలకు రాయితీపై రాతి, పంచలోహ విగ్రహాలు: తితిదే

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం సనాతన హిందూ ధర్మప్రచారంలో భాగంగా ఆలయాలకు మైక్ సెట్, గొడుగులు, శేషవస్త్రం, రాతి, పంచలోహ విగ్రహాలను రాయితీపై అందిస్తున్నట్లు పేర్కొంది. నిబంధనలకు అనుగుణంగా డీడీతోపాటు పూర్తి చేసిన దరఖాస్తులను కార్యనిర్వహణాధికారి, తితిదే పరిపాలనా భవనం, కేటీ రోడ్డు, తిరుపతి అనే చిరునామాకు పంపించాలి. ఇతర వివరాలకు నంబరు 0877-2264276 లో సంప్రదించాలని పేర్కొంది. ఇందుకోసం ఆలయ నిర్వాహకులు సంబంధిత పత్రం, తహశీల్దార్ / దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ నుంచి సిఫార్సు లేఖ, ఆధార్ కార్డు, ఆలయం ఫొటో, ఆలయం కరెంట్ బిల్లు జత చేసి తితిదేకు పంపించాల్సి ఉంటుంది.
- మైక్ సెట్: మైక్ సెట్ కొనుగోలుకు అయ్యే ఖర్చు రూ.25 వేలలో ఏపీకి సంబంధించి 90 శాతం, ఇతర రాష్ట్రాలకు 50 శాతం రాయితీతో అందిస్తోంది.
- గొడుగులు: హిందూ దేవాలయాలకు కేటగిరీలతో సంబంధం లేకుండా అర్హులైన దరఖాస్తుదారులకు రూ.14,500 విలువ చేసే గొడుగులను 50 శాతం రాయితీతో తితిదే అందిస్తుంది.
- శేష వస్త్రం: హిందూ దేవాలయాలకు ఉచితంగా శేష వస్త్రాన్ని తితిదే అందిస్తోంది.
- రాతి, పంచలోహ విగ్రహాలు: శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతీ అమ్మవారి రాతి విగ్రహాలను 5 అడుగులు, అంతకంటే తక్కువ ఎత్తులో ఉన్న విగ్రహాలను ఉచితంగా అందిస్తారు. మిగిలిన దేవతా విగ్రహాలకు 75 శాతం సబ్సిడీపై కేవలం 25 శాతం ధరను చెల్లిస్తే వివిధ వర్గాల వారికి అందిస్తారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ఉచితంగా రాతి విగ్రహాలను అందిస్తారు. దేవతా మూర్తుల రాతి, పంచలోహల విగ్రహాల పేర్లు, కొలతలతో కార్యనిర్వహణాధికారి, తితిదే వారికి ఆలయ అభ్యర్థన లేఖ పంపించాలి. ఎంఈవో లేదా డీఈవోల ఆమోదం పొందిన విద్యా సంస్థలకు సరస్వతీ దేవీ రాతి విగ్రహాన్ని 50శాతం సబ్సిడీతో తితిదే అందిస్తోంది. మఠాలు, ట్రస్ట్లకు, ఆశ్రమాలకు వివిధ దేవతామూర్తుల విగ్రహాలను 50శాతం రాయితీతో అందిస్తోంది.
