Virat Kohli named in Delhi VHT 2025 squad Pant to captain

దేశవాళీ వన్డే టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీ-2025కి ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (డీడీసీఏ) తమ జట్టును ప్రకటించింది. టీమిండియా దిగ్గజం విరాట్‌ కోహ్లి తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. అదే విధంగా భారత టెస్టు జట్టు వైస్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌.. ఈ టోర్నీలో ఢిల్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది.

ఇక మరో టీమిండియా స్టార్‌ పేసర్‌ హర్షిత్‌ రాణా వీలు చిక్కినపుడు మ్యాచ్‌లకు వస్తాడని తెలిపిన డీడీసీఏ.. భారత మాజీ స్టార్‌ బౌలర్‌ ఇషాంత్‌ శర్మ, నవదీప్‌సైనీ కూడా ఈసారి జట్టులో భాగం కానున్నారని తెలిపింది. కాగా పంత్‌ డిప్యూటీగా ఆయుశ్‌ బదోని వ్యవహరించనుండగా.. తేజస్వి సింగ్‌ వికెట్‌ కీపర్‌గా సేవలు అందించనున్నాడు.

2010లో చివరిసారిగా
కాగా 2010లో చివరిసారిగా విరాట్‌ కోహ్లి తన సొంత జట్టు ఢిల్లీ తరఫున విజయ్‌ హజారే ట్రోఫీ ఆడాడు. వన్డే క్రికెట్‌లో రారాజుగా వెలుగొందుతూ అత్యధిక సెంచరీల (53) వీరుడిగా రికార్డులకెక్కిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ దేశీ క్రికెట్‌ బరిలో దిగనున్నాడు. 

ప్రతి ఒక్క ఆటగాడు కనీసం రెండు దేశీ మ్యాచ్‌లు అయినా ఆడాలన్న బీసీసీఐ నిబంధనల నేపథ్యంలో కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ముంబై తరఫున ఆరంభ మ్యాచ్‌లకు మాత్రం రోహిత్‌ శర్మ అందుబాటులో ఉండటం లేదని ఎంసీఏ చీఫ్‌ సెలక్టర్‌ సంజయ్‌ పాటిల్‌ తాజాగా వెల్లడించాడు.

విజయ్‌ హజారే ట్రోఫీ-2025 మ్యాచ్‌లకు ఢిల్లీ జట్టు
రిషబ్ పంత్ (కెప్టెన్‌), ఆయుష్ బదోని (వైస్‌ కెప్టెన్‌), అర్పిత్ రాణా, విరాట్ కోహ్లి, హర్షిత్ రాణా, నితీష్ రాణా, యశ్ ధుల్, సార్థక్ రంజన్, నవదీప్ సైనీ, ఇషాంత్ శర్మ, హృతిక్ షోకీన్, తేజస్వి సింగ్ (వికెట్‌ కీపర్‌), హర్ష్ త్యాగి, సిమర్‌జీత్ సింగ్, ప్రిన్స్ యాదవ్‌, ఆయుశ్‌ దొసేజా, దివిజ్‌ మెహ్రా, వైభవ్‌ కంద్పాల్‌, రోహన్‌ రాణా, అనూజ్‌ రావత్‌. 

చదవండి: ఊహించని షాకిచ్చిన రోహిత్‌ శర్మ!