అధికారమే పరమావధి!

Eenadu icon
By Editorial News Team Published : 10 Jun 2026 02:56 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

స్వేచ్ఛాయుత సమాజంలో అసమ్మతి స్వరాలు వినపడటం సహజమే. సొంత పార్టీతో సైద్ధాంతికంగా విభేదిస్తూ, స్వీయపక్షం విధానాలను విమర్శిస్తూ నాయకులు బయటికి రావడమూ సర్వసాధారణమే. ఇదంతా నిజాయతీగా నిష్కపటంగా జరిగితే ఎవరికీ అభ్యంతరం ఉండదు. అలా కాకుండా చాటుమాటు మంత్రాంగాలూ పదవీ బేరసారాల ఫలితంగా పార్టీ ఫిరాయింపులు వెల్లువెత్తితే ఇక ప్రజాస్వామ్యానికి జరిగే నష్టం అంతాఇంతా కాదు. అలవిమాలిన అధికార కాంక్షతో ఏ ఎండకు ఆ గొడుగు పట్టే తాలునేతల గూడుపుఠాణీ వ్యవహారాలు దశాబ్దాలుగా భారత ప్రజాతంత్ర ప్రతిష్ఠను పెళ్లగిస్తూనే ఉన్నాయి. అలాంటి గోడదూకుడు రాజకీయాలు ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో పరాకాష్ఠకు చేరాయి. మొన్నటి ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు 58 మంది ఇటీవలే వేరుకుంపటి పెట్టుకోగా- తాజాగా ఆ పార్టీకి చెందిన ఇరవై మంది ఎంపీలూ అదే బాటపట్టారు. నియోజకవర్గ అభివృద్ధి నిధుల వినియోగానికి మమతా బెనర్జీ అడ్డుపడటం, కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేయకపోవడం తదితర కారణాలను చెబుతూ తమ తిరుగుబాటును వారు సమర్థించుకుంటున్నారు. అదంతా నిజమే అనుకుంటే మరి ఇన్నాళ్లూ వాళ్లెందుకు నోరు మెదపలేదు? అసెంబ్లీ ఎలక్షన్లలో మమత పార్టీ మట్టికరిచిన తరవాతే ఇవన్నీ గుర్తుకొచ్చాయా?

ఒక పార్టీ గుర్తుపై బరిలోకి దిగి నెగ్గినవారు ఏరుదాటాక తెప్ప తగలేసి పోవడమంటే- తమకు ఓట్లేసి గెలిపించిన జనానికి వెన్నుపోటు పొడవడమే! బెల్లం చుట్టూ ఈగలు మూగినట్లు అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి పరిగెత్తే నేతల కపట నాటకాలు ప్రజాప్రయోజనాలకు సదా ప్రమాదకరమైనవే! 2011లో మమత సీఎం అయ్యాక ఆపై పదేళ్లలో దాదాపు నలభై మంది విపక్ష ఎమ్మెల్యేలకు తృణమూల్‌ తీర్థమిచ్చారు. కాలం తిరగబడిన తరవాత అవే స్వార్థ రాజకీయాల ధాటికి ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొద్దిరోజుల క్రితం ‘ఆప్‌’కు చెందిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలూ కమలదళం చెంతకుచేరారు. ఆ మాటకొస్తే సొంత పార్టీలకు జెల్లకొట్టి అధికారపక్షాలతో అంటకాగే నేతల అనైతికతకు సాక్ష్యాలు గడిచిన 75ఏళ్లలో అనేకం పోగుపడ్డాయి. 1951 నుంచి 1967 ఫిబ్రవరి మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 542 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. 1967-1983 నడుమ పందొమ్మిది వందల మంది విపక్ష నాయకులు కాంగ్రెస్, కాంగ్రెస్‌(ఐ) కండువాలు కప్పుకొన్నారు. 2014-2021 మధ్యలోనైతే సుమారు అయిదు వందల మంది ఎంపీలూ ఎమ్మెల్యేలు ఇతర పక్షాల పంచన చేరారు. ఫిరాయింపుల కట్టడికి తీసుకొచ్చిన చట్టమేమో చిల్లర కప్పగంతులను అడ్డుకుంటోంది కానీ, టోకు వలసలకు లాకులెత్తేస్తోంది. దీంతో గడచిన కొన్నేళ్లలో అరుణాచల్‌ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అర్ధాంతరంగా కుప్పకూలిపోయి ప్రజాస్వామ్యం పరిహాసాల పాలైంది!

గుండె వ్యాధులకూ మెరుగైన చికిత్సలున్నాయి కానీ, రాజకీయ ఫిరాయింపులనే జాడ్యానికి సరైన మందు లేకుండా పోతోందని ప్రధానిగా వాజ్‌పేయీ ఆవేదన వ్యక్తంజేశారు. పార్టీ మారిన చట్టసభల సభ్యులపై తక్షణం అనర్హత వేటువేయాలని ఎల్‌.కె.ఆడ్వాణీ సైతం అప్పట్లో పిలుపిచ్చారు. కానీ, ఫిరాయింపుల నిషేధ చట్టంలోని లోపాలను సవరించడానికి ఇన్నేళ్లలో తగినంత కసరత్తే జరగలేదు. అనర్హత పిటిషన్లపై నిర్ణయాధికారాన్ని స్పీకర్ల చేతుల్లోంచి తప్పించి స్వతంత్ర యంత్రాంగానికి అప్పగించే విషయాన్ని పరిశీలించాలంటూ ఆరేళ్ల క్రితం పార్లమెంట్‌కు సుప్రీంకోర్టు చేసిన సూచనకూ మన్నన దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకేతాను ముక్కలైన పార్టీల అధికార క్రీడలు రాజకీయాల్లో సిద్ధాంతాలూ విలువలకు పాతరేస్తున్నాయి. అంతిమంగా అవన్నీ కలిసి రాజ్యాంగ ఆదర్శాలను చెల్లనికాసులుగా మార్చేస్తున్నాయి!

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.