ఎంత పనిచేశావు భువనా!

Eenadu icon
By Andhra Pradesh Dist. Desk Published : 25 Feb 2026 04:31 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

ఏం చెబుతున్నాం బిడ్డలకు? ఏం నేర్పుతున్నాం విద్యార్థులకు? కష్టం వచ్చినప్పుడు ఎదుర్కొనే ధైర్యం చెప్పలేని చదువులెందుకు? బాధ కలిగినప్పుడు తట్టుకునే  ఓర్పునివ్వని విద్యలెందుకు? ఆర్థిక స్థితిని అర్థం చేసుకోవాలని  వివరించని వ్యవస్థలెందుకు? బీటెక్‌ చదువుతుండగానే ఉద్యోగం సాధించిన విద్యార్థిని కారణాలు  చెప్పకుండానే ఉరికి వేలాడింది

చిన్న చిన్న కారణాలకే  ప్రాణాలు తీసుకుంటే తప్పెవరిది? ఆలోచన నేర్పని పుస్తకాలదా? అణుకువను చెప్పని పెద్దలదా? ఆవేశం ఇచ్చిన సమాజానిదా?

ఏం నేర్చుకుంటున్నారు? ఏం చదువుతున్నారు? అన్ని అవయవాలు సక్రమంగా లేకున్నా చక్కటి జీవితాన్ని  గడుపుతున్న వారిని చూడరా! ... మనకే ఈ ప్రశ్నలు

తల్లిదండ్రులు సర్వం ధారపోసినా.. ప్రాణం పోయాక  బతకలేమన్న స్పృహ కలగడం లేదా? చచ్చి ఏం సాధిస్తారు.. బతికి కోరుకున్నది పొందాలన్న ఆలోచన చేయడం లేదా? ....విద్యార్థులారా మీకే ఈ ప్రశ్నలు

పుంగనూరు మండలం మంగళం గ్రామానికి చెందిన భువన (22) తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్‌ నాలుగో ఏడాది చదువుతోంది. సోమవారం సాయంత్రం గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన సురేంద్రరెడ్డి, జానమ్మలకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె భువన బీటెక్‌ నాలుగో సంవత్సరం చదువుతోంది. కొన్నిరోజుల క్రితం కళాశాలలో జరిగిన ప్రాంగణ ఎంపికల్లో ఏడాదికి రూ.9 లక్షల ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికైంది. ఈ ఏడాది మే నెలలో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. రెండు రోజుల క్రితం ఇంటికి వెళ్లి అందరితో ఎంతో సంతోషంగా గడిపి, ఉద్యోగం వచ్చిందన్న ఆనందాన్ని అందరితో పంచుకుంది.

సోమవారం మళ్లీ కళాశాలకు వెళ్లిన ఆమె ఏం జరిగిందో తెలియదుగానీ గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. కుమార్తె మృతదేహాన్ని చూసి హృదయం ద్రవించేలా కన్నీరు మున్నీరయ్యారు. ఎంతో చలాకీగా ఉంటు పది, ఇంటర్‌లో టౌన్, రాష్ట్రస్థాయిలో ఉత్తమ మార్కులు సాధించి ప్రతిభావంతు రాలైన కుమార్తె చనిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు బోరున విలపిస్తున్నారు. చేతికొచ్చిన బిడ్డ బలవన్మరణానికి పాల్పడడాన్ని తల్లిదండ్రులు జీర్ణించకోలేక తల్లడిల్లుతున్నారు. 

► Read latest Chittoor Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని