Revanth reddy: కేసీఆర్‌ది చెరగని దగా చరిత్ర

Eenadu icon
By Telangana News Desk Published : 08 Feb 2026 04:45 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
5 min read

నిబంధనలకు విరుద్ధంగా ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడి.. అధికారులు, రాజకీయ నేతలు, న్యాయమూర్తులు, జర్నలిస్టుల ఫోన్లతోపాటు భార్యాభర్తల సంభాషణలు విన్న కేసీఆర్‌ను విచారణకు పిలిస్తే తప్పేంటి? లాక్కెళ్లి విచారణ చేయగల చట్టాలున్నా.. మా పోలీసులు మంచోళ్లు కాబట్టి ఆ పనిచేయలేదు. కేసీఆర్‌ వయసును గౌరవించి హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో విచారణ చేశారు. తన ఫాంహౌస్‌కు వచ్చి విచారణ చేయాలని ఆయన కోరడం సమంజసమేనా?

ఈనాడు, సంగారెడ్డి; న్యూస్‌టుడే, పరిగి: ‘భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చరిత్రను నేను చెరిపేస్తున్నానని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. కానీ ఆయన దగా చరిత్ర నేను చెరిపినా చెరగదు’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. వికారాబాద్‌ జిల్లా పరిగి శివారులోని నారాయణపూర్‌లో శనివారం ‘ప్రజాపాలన-ప్రగతి బాట’ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్న ఈ సభలో సీఎం మాట్లాడుతూ... దళితుణ్ని ముఖ్యమంత్రి చేస్తానని ఆ వర్గాన్ని మోసం చేసిన చరిత్రతోపాటు మూడెకరాల భూమి ఇస్తానని మాటిచ్చి తప్పి.. ఇంటికో ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగ యువతను మోసం చేసిన కేసీఆర్‌ చరిత్రను ఎవరు మార్చగలరని ప్రశ్నించారు. రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇస్తామని నిరుపేదలను మోసం చేసిన చరిత్రను ఎలా తొలగించగలమని అన్నారు. 

పెళ్లి పెద్దను చూసి పిల్లనివ్వగలమా? 

‘‘అసెంబ్లీ, లోక్‌సభ, పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన భారాస.. దొంగచాటుగా పురపాలికల ఎన్నికల్లో విజయం సాధించేందుకు భాజపాతో చీకటి ఒప్పందం చేసుకుంటోంది. ఇటీవల తాండూరుకు చెందిన భాజపా నేతలు కాంగ్రెస్‌లో చేరిన సమయంలో ఆ పార్టీ నేతలే స్వయంగా తమ పార్టీ టికెట్లను భారాస కార్యాలయాల్లో జారీ చేస్తున్నారని చెప్పారు. దీన్నిబట్టే ఆ రెండు పార్టీల కుమ్మక్కు బయటపడుతోంది. భాజపా నాయకులు మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా ప్రధాని మోదీని చూసి ఓట్లేయాలని అడుగుతున్నారు. 

పెళ్లి పెద్దను చూసి పిల్లనిస్తే సంసారం ఆగమవుతుంది. పెళ్లికొడుకు గుణాలు చూసి పిల్లనిస్తేనే కాపురం బాగుంటుంది. మోదీని చూసి ఓటేస్తే స్థానిక సమస్యలు ఎలా పరిష్కారమవుతాయి? దిల్లీలో యమునా రివర్‌ ఫ్రంట్‌ పేరిట యమునా నదిని, గుజరాత్‌లో సబర్మతి, ఉత్తర్‌ప్రదేశ్‌లో గంగా నదిని భాజపా ప్రభుత్వాలు శుద్ధి చేశాయి. ఇక్కడ మూసీ నదిని ప్రక్షాళన చేస్తామంటే భాజపా, భారాస నాయకులు మోకాలడ్డుతున్నారు. ఐదేళ్లు పరిపాలించేందుకు ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే.. భారాస, భాజపా నాయకులు మమ్మల్ని రెండేళ్లు పూర్తికాగానే దిగిపొమ్మంటున్నారు. వారికి సవాల్‌ విసురుతున్నా.. మిగిలి ఉన్న మూడేళ్లతో పాటు మరో ఐదేళ్లు.. అంటే వచ్చే ఎనిమిదేళ్లు రాష్ట్రంలో ఇందిరమ్మ పాలనే ఉంటుంది. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్‌దే విజయం.

మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ యువతకు 70 వేల ఉద్యోగాలిచ్చాం. 15 ఏళ్ల తర్వాత గ్రూప్‌-1 ఉద్యోగాలు భర్తీ చేశాం. బీసీలు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలకు గ్రూప్‌-1 ఉద్యోగాలు వస్తే జీర్ణించుకోలేక కొందరు కోర్టుల్లో కేసులు వేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన కేసీఆర్‌.. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారు. రూ.లక్ష కోట్ల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం మూడేళ్లలోనే కూలేశ్వరంగా మారింది. దోపిడీ చేసిన నిధులతో ఎర్రవల్లిలో కేసీఆర్, జన్వాడలో కేటీఆర్, శంకర్‌పల్లిలో కవిత, మొయినాబాద్‌లో హరీశ్‌రావులు ఫాంహౌస్‌లు నిర్మించుకున్నారు. 

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై కేసీఆర్‌ కక్ష సాధింపు 

గోదావరిలో ఏటా 3 వేల టీఎంసీలు వృథాగా పోతున్నాయని భారాస అధినేత కేసీఆర్‌ స్వయంగా అసెంబ్లీలో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చి చెప్పారు. ఆంధ్రాలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు గోదావరి జలాలను తరలించుకోవాలని ఏపీకి సూచించారు. ఏపీ మాజీ మంత్రి రోజా ఇంట్లో భోజనం చేస్తూ రాయలసీమను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసుకోవాలని కేసీఆర్‌ సలహా ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు ప్రతిపాదించిన ప్రాణహిత-చేవెళ్ల పనులను వికారాబాద్‌ వరకు పొడిగించాలని నిర్దేశించినా.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై కక్షతో కేసీఆర్‌ ఆ పనులను పక్కన పెట్టారు. 300 టీఎంసీల గోదావరి జలాలను రంగారెడ్డికి తరలిస్తే సస్యశ్యామలం అయ్యేది. రాష్ట్రం అంతటికీ వడ్డించేది.. సమకూర్చేది మేమే కాబట్టి పుర ఎన్నికల్లో పొరపాటున ఇతర పార్టీలకు ఓటేస్తే ఇబ్బందులొస్తాయి. బల్దియాలను పదేళ్లపాటు భారాస నేతలే పాలించారు. వాళ్లు సమస్యల్ని పరిష్కరించి ఉంటే.. ఇప్పుడు ప్రజలే పిలిచి వారికి ఓట్లేసేవారు. ప్రస్తుతం గల్లీల్లో సమస్యలు.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా.. ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. 

రంజిత్‌రెడ్డిని మంత్రిని చేస్తాం  

చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి.. పురపాలక సంఘాలను అభివృద్ధి చేసే ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తాం. ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తా. కేసీఆర్‌ ప్రభుత్వంలో బతుకమ్మ చీరలు ఇస్తే ధరించడానికి పనికిరావని... పంట పొలాలకు రక్షణగా కట్టుకునేవారు. మా ప్రభుత్వం పంపిణీ చేసిన ఇందిరమ్మ చీరలు కట్టుకున్న ఆడపడుచులు పాలపిట్టల్లా మెరిసిపోతున్నారు’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా... వికారాబాద్‌ జిల్లాలోని మహిళా స్వయంసహాయక సంఘాలకు రూ. 567.69 కోట్ల స్త్రీ నిధి రుణాల చెక్కును సీఎం అందజేశారు. సభలో శాసనమండలి చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు టి.రామ్మోహన్‌రెడ్డి, బి.మనోహర్‌రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి, కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ కె.సుజాత, వికారాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :