Adulterated Ghee: హిందువుల మనోభావాలతో ఎలా ఆడుకుంటారు?

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 08 Feb 2026 03:33 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఈనాడు, అమరావతి: ‘మీ ప్రభుత్వ హయాంలో తితిదేకి పంపిన నెయ్యిలో భారీగా కల్తీ జరిగిందన్నది వాస్తవం. నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని వాదించడంలో అర్థమేంటి జగన్‌? మీరొక రాజకీయ పార్టీ నడుపుతున్నారు. బాధ్యతగా మాట్లాడండి. మీ మతవిశ్వాసాలతో ఎవరైనా ఆడుకుంటే ఊరుకుంటారా? హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేందుకు ఎలా అనుమతించారు? అసలు మీరేం చేస్తున్నారు?’

రిపబ్లిక్‌ ఛానల్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్ణబ్‌ గోస్వామి.. వైకాపా అధినేత జగన్‌నుద్దేశించి వేసిన ప్రశ్నలివి. కల్తీ నెయ్యి వ్యవహారం జాతీయ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. దాదాపు అన్ని టీవీ ఛానళ్లు దీనిపై డిబేట్లు నిర్వహిస్తున్నాయి. పత్రికలు కథనాలు ప్రచురిస్తున్నాయి. 

‘దేశవ్యాప్తంగా కోల్‌కతా నుంచి ముంబయి వరకు, లఖ్‌నవూ నుంచి చెన్నై వరకు, జమ్మూ నుంచి గువాహటి వరకు హిందువులంతా తిరుపతి లడ్డూ ప్రసాదం పొందడాన్ని గొప్ప ఆశీర్వచనంగా పరిగణిస్తారు. స్వామివారికి భక్తిశ్రద్ధలతో సమర్పించే లడ్డూను రసాయనాలతో కూడిన సింథటిక్‌ నెయ్యితో చేశారు. ఇది హిందువుల మనోభావాల్ని నేరుగా దెబ్బతీసినట్టే. ఈ దేశంలో 100 కోట్లకు పైగా హిందువులున్నారని, వారి సెంటిమెంట్స్‌తో ఆడుకోలేనన్న విషయాన్ని రాత్రి నిద్రపోయే ముందు, ఉదయం నిద్రలేచాక మీరు గుర్తు పెట్టుకోవాలి. కానీ మీరు ‘నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు కాబట్టి, పెద్ద విషయం కాదు’ అనడం హిందువుల సెంటిమెంట్స్‌తో ఆడుకోవడమే. మీరిలా చేయడాన్ని ఎవరూ అనుమతించరు జగన్‌’ అని అర్ణబ్‌ పేర్కొన్నారు.

స్వీయ అనుభవం పంచుకున్న ఆనంద్‌ నరసింహన్‌

‘నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని, వెజిటబుల్‌ ఆయిల్స్‌తో కల్తీ జరిగిందని తితిదే బోర్డు మాజీ ఛైర్మన్లు సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి చెబుతున్నారు. అది స్వామివారికి అపచారం కాదా?’ అని సీఎన్‌ఎన్‌-న్యూస్‌18 సీనియర్‌ యాంకర్‌ ఆనంద్‌ నరసింహన్‌ ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూ నాలుగైదు రోజులు దాటితే రంగు, రుచి, వాసన మారిపోయేదని, పోస్టల్‌ డిస్పాచ్‌ రెండు రోజులు దాటితే పాడైపోయేదని గుర్తుచేసుకున్నారు. ఆ తేడాను తాను స్పష్టంగా గుర్తించానని, తన తల్లి కూడా లడ్డూ గతంలో మాదిరిగా లేదని తనతో అన్నారని ఆనంద్‌ ఉటంకించారు. నెయ్యి కల్తీని 2022లోనే సీఎఫ్‌టీఆర్‌ఐ ల్యాబ్‌ నిర్ధారించినా, అప్పటి ఛైర్మన్, అధికారులు పట్టించుకోకపోవడాన్ని ప్రశ్నించారు. 

నెయ్యి కల్తీ రూ.250 కోట్ల కుంభకోణమని, 68 లక్షల కిలోల కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారని ఇండియా టుడే ఛానల్‌ రిపోర్టు చేసింది. కల్తీ నెయ్యితో తయారుచేసిన లడ్డూలను ఐదేళ్లపాటు భక్తులకు అందజేయడం దేశ ప్రజలను షాక్‌కు గురిచేసిందని పేర్కొంది.

చేతులు జోడించి క్షమాపణ కోరండి

‘2024లో చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాక నెయ్యి కల్తీ అంశాన్ని లేవనెత్తి మంచి పనిచేశారు. సీబీఐ దర్యాప్తులో కల్తీ నెయ్యి వాడినట్లు రుజువైంది. హిందువుల విశ్వాసాల్ని దెబ్బతీయడానికి ఇంత భారీ కుట్రకు ఎందుకు పాల్పడ్డారు? దీనికి మిమ్మల్ని ప్రేరేపించిన అంశమేంటి? 300 ఏళ్లుగా శుద్ధమైన నెయ్యితో లడ్డూ ప్రసాదాలు తయారుచేసే సంప్రదాయాన్ని మీ హయాంలో మంటగలిపారు. దీనికి మీరు బాధ్యులు కాదా? సిట్‌ నివేదిక మీకు క్లీన్‌చిట్‌ ఇవ్వలేదు జగన్‌. ఈ ఘోరతప్పిదానికి ‘సారీ’ చెబితే సరిపోదు. దేశప్రజల ముందు చేతులు జోడించి క్షమించాలని వేడుకోండి. అంతకుమించి మీకు మరో మార్గం లేదు’ అని అర్ణబ్‌ వ్యాఖ్యానించారు.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :