Chiranjeevi: ఆమె మాటలకు కన్నీళ్లాగలేదు.. జీవితాంతం మిమ్మల్ని అలరిస్తా: చిరంజీవి

Eenadu icon
By Entertainment Team Published : 26 Jan 2026 00:08 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి పనిచేస్తానని ఏ ఆడబిడ్డ, మగబిడ్డ అయినా అంటే వారిని ప్రోత్సహించి పంపాలని, తెలుగు సినీ ఇండస్ట్రీ గొప్పదని అగ్ర కథానాయకుడు చిరంజీవి ( Chiranjeevi) అన్నారు. జీవితాంతం ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటానని తెలిపారు. ఆయన కీలక పాత్రలో అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. (Mana Shankara Vara Prasad Garu) నయనతార కథానాయిక. వెంకటేశ్‌ కీలక పాత్ర పోషించారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుని రూ.300 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఈ సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభలో చిరంజీవి మాట్లాడారు. 

ఆ సామర్థ్యం అనిల్‌కే ఉంది..

‘‘వింటేజ్‌ చిరంజీవినే కాదు.. మళ్లీ విజయోత్సవాలను జరుపుకొనే వైభవాన్ని తీసుకొచ్చిన ఘనత దర్శకుడు అనిల్‌ రావిపూడికి దక్కుతుంది. ఇంతటి ఘన విజయాన్ని అందించిన తెలుగు సినీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. సినిమా టీమ్‌ విజయానందాన్ని అనుభవిస్తుంటే, నాకూ సంతోషంగా ఉంది. అనిల్‌ను చూస్తుంటే రాఘవేంద్రరావుగారు గుర్తుకు వచ్చేవారు. రోజూ సెట్‌లో వినోదాన్ని పంచేవారు. ఈ మూవీ షూటింగ్‌కు వెళ్తుంటే ఎంతో ఆనందంగా ఉండేది. ప్రతి సినిమా కష్టపడి పనిచేస్తాం. కానీ, కొన్ని సినిమా ఫలితాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. అలాంటిదే ఈ మూవీ. ఈ సంక్రాంతికి దాదాపు అన్ని సినిమాలను ఆదరించారు. సినిమాలో వెంకీ ఉండాలని కోరుకున్నా. దాన్ని అనిల్‌ సాకారం చేశాడు. ఎంత పెద్ద స్టార్‌నైనా హ్యాండిల్ చేసే సామర్థ్యం అనిల్‌ రావిపూడికి ఉంది. మళ్లీ అనిల్‌తో చేసే అవకాశం మా ఇద్దరిలో ఎవరికి వస్తుందో చూడాలి.’’

సినీ ఇండస్ట్రీ అద్దంలాంటిది..

‘‘నిర్మాత సాహు గారపాటి అస్సలు మాట్లాడరు. కానీ, రషెస్‌ చూసి, హిట్‌ కొట్టేస్తున్నామని చెప్పేశారు. అన్నట్లుగానే మూవీ హిట్‌ అయింది. ఇక నా కుమార్తె ఇండస్ట్రీలోకి వస్తానంటే ప్రోత్సహించిన తొలి వ్యక్తి మా అబ్బాయి రామ్‌చరణ్‌. ‘రంగస్థలం’ కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌గా పనిచేసింది. కష్టం ఒక్కటే ఆయుధమని తెలుసుకున్న వ్యక్తి నా కుమార్తె సుస్మిత. సినీ ఇండస్ట్రీ అద్దంలాంటిది. మనం ఎలా ఉంటామో అలాంటి ఫలితాన్నే ఇస్తుంది.  ఎవరైనా సరే సినీ ఇండస్ట్రీలోకి వస్తానంటే వారిని ప్రోత్సహించాలి. ఇది గొప్ప ఇండస్ట్రీ. ‘ఇక్కడ నెగెటివ్‌ పీపుల్‌ ఉంటారు. చేదు అనుభవాలను ఎదురవుతాయి’ అనుకుంటే అది నీ తప్పిదం. నువ్వు నిక్కచ్చిగా ఉంటే ఎవరూ అవకాశం తీసుకోరు. క్యాస్టింగ్‌ కౌచ్‌లాంటివి ఉండవు. నువ్వు ప్రొఫెషనల్‌గా ఉండాలి. కొత్త టాలెంట్‌కు ఎప్పుడూ ప్రోత్సాహం లభిస్తూనే ఉంటుంది. ఇందులో చేసిన ప్రతి నటుడు, సాంకేతిక నిపుణుడు ఎంతో ఉత్సాహంగా నటించారు. నయనతార సినిమాలో చేయడమే కాదు, ప్రమోషన్స్‌ కూడా చేసింది. ఆ మెరిట్‌ కూడా అనిల్‌కే దక్కుతుంది. సినిమా పరుగులు పెట్టడానికి ఎడిటర్‌ తమ్మిరాజు కారణం. వీటీ గణేశ్‌ ఎపిసోడ్‌ను తీసేయాలనే మంచి నిర్ణయం తీసుకున్నారు. కొన్నిసార్లు త్యాగాలు తప్పవు’’

మీ పాజిటివ్‌ ఎనర్జీయే నాకు శక్తి..

‘‘ఇటీవల ఒకామె మాట్లాడిన వీడియో చూసి, భావోద్వేగానికి గురయ్యా. ‘ఏమయ్యా.. చిరంజీవి ఎప్పటి నుంచో కష్టపడుతూనే ఉన్నావు. మమ్మల్ని ఆనందింపజేయడానికి ఓపిక ఉన్నా లేకపోయినా ఇప్పటికీ అలాగే పనిచేస్తున్నావు. డబ్బుల కోసం నువ్వు పనిచేస్తున్నావని నేను అనుకోను. నువ్వు ఇలా కష్టపడుతుంటే నాకు బాధగా ఉంది’ అని అన్నారు. నిజంగా ఆ తల్లికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు చెబుతున్నా. ఇది అందరూ ఇచ్చే ప్రశంస కాదు. ఇలాంటి అభిమానులను భగవంతుడు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆ మాటలకు ఆనందంతో నా కళ్లు చెమర్చాయి. ‘అమ్మా.. మీకు ఆనందం ఇవ్వడానికి నేను కష్టపడినా దానిలో నేను సంతోషాన్ని పొందుతున్నాను.  చిరంజీవి మమ్మల్ని అలరించాలనే కోరుకునే మీ (అభిమానులు) పాజిటివ్‌ ఎనర్జీ నుంచే నాకు ఈ శక్తి వస్తోంది. ఈ జన్మ ఉన్నంత వరకూ మిమ్మల్ని అలరిస్తూనే ఉంటాను’’ అని చిరంజీవి అన్నారు.


► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :