Tg HighCourt: ఓటమితో కుంగిపోకుండా గెలుపు దిశగా ప్రయత్నించాలి

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

నారాయణగూడ, న్యూస్టుడే: ఓటమికి కుంగిపోకుండా గెలుపు దిశగా ప్రయత్నించినపుడే ఆటల్లోనూ, జీవితంలోనూ ఉన్నతస్థాయికి చేరతారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర హైకోర్టు అధికారులకు ప్రత్యేక క్రీడాపోటీలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ.. తాను ఝార్ఖండ్ హైకోర్టులో ఉండగా అక్కడి ఉద్యోగులు, సిబ్బందికి ఏటా క్రీడా పోటీలు నిర్వహించేలా చేశానన్నారు. అదే తరహాలో ఇక్కడ కూడా తరచూ నిర్వహించాలని సంకల్పించినట్లు తెలిపారు. అనంతరం జస్టిస్ బి.విజయసేన్రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే జిల్లా కోర్టుల ఉద్యోగులకూ క్రీడాపోటీలు నిర్వహించడానికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ సహచర న్యాయమూర్తులతో కాసేపు సరదాగా క్రికెట్ ఆడారు. కార్యక్రమంలో అదనపు అడ్వొకేట్ జనరల్ తేరా రజనీకాంత్రెడ్డి, ముహమ్మద్ ఇమ్రాన్ఖాన్, క్రీడల పర్యవేక్షకులు శ్రీధర్రావు తదితరులు పాల్గొన్నారు.
