Ranji Trophy: KL Rahul in, Karun Nair out against Punjab and Devdutt Padikkal named Karnataka captain

కర్ణాటక ఆటగాడు దేవదత్‌ పడిక్కల్‌కు ప్రమోషన్‌ లభించింది. ఇటీవల ముగిసిన విజయ్‌ హజారే వన్డే టోర్నీలో ఆకాశమే హద్దుగా చెలరేగిన అతన్ని (725 పరుగులు 90.62 సగటుతో) కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ తమ రంజీ కెప్టెన్‌గా నియమించింది. ఈనెల 29 నుంచి పంజాబ్‌తో జరుగబోయే మ్యాచ్‌లో పడిక్కల్‌ కర్ణాటక కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. 

గ్రూప్‌ దశలో కర్ణాటకకు ఇదే చివరి మ్యాచ్‌. కీలకమైన ఈ మ్యాచ్‌కు కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ కేవలం రెండు మ్యాచ్‌ల అనుభవమున్న పడిక్కల్‌కు కెప్టెన్‌గా అవకాశమిచ్చి సాహసోపేత నిర్ణయం తీసుకుంది. రెడ్‌ బాల్‌ ఫార్మాట్‌లో పడిక్కల్‌ కెప్టెన్సీ చేపట్టడం ఇదే తొలిసారి. 2023లో అతను సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఓ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. పెద్దగా ఫామ్‌లో లేని మయాంక్‌ అగర్వాల్‌ను తప్పించి పడిక్కల్‌కు రంజీ కెప్టెన్‌గా అవకాశం ఇచ్చారు.

పంజాబ్‌తో మ్యాచ్‌కు ప్రకటించిన జట్టులో మరిన్ని ఆసక్తికర మార్పులు చోటు చేసుకున్నాయి. టీమిండియా ప్లేయర్లు కేఎల్‌ రాహుల్‌, ప్రసిద్ద్‌ కృష్ణ జట్టులోకి వచ్చారు. ప్రస్తుతం టీమిండియా విధులు లేకపోవడంతో వీరిద్దరూ రంజీ బాట పట్టారు.

మరో స్టార్‌ బ్యాటర్‌ కరుణ్‌ నాయర్‌ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ కరుణ్‌ స్థానాన్ని నికిన్‌ జోస్‌ భర్తీ చేశాడు. మరో స్టార్‌ ఆటగాడు అభినవ్‌ మనోహర్‌పై వేటు పడింది. మనోహర్‌ గత కొంతకాలంగా ఫామ్‌లో లేడు. మయాంక్‌ అగర్వాల్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించినా సాధారణ ఆటగాడిగా జట్టులో కొనసాగనున్నాడు.

కీలక పోరాటం  
గ్రూప్‌ బి పాయింట్ల పట్టికలో కర్ణాటక మూడో స్థానంలో ఉంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ ముందంజలో ఉండగా, సౌరాష్ట్ర వెనుక నుంచి (నాలుగో స్థానం) ఒత్తిడి పెంచుతోంది. క్వార్టర్‌ ఫైనల్‌ నేపథ్యంలో పంజాబ్‌తో మ్యాచ్‌ కర్ణాటకకు అత్యంత కీలకంగా మారింది.  

కర్ణాటక జట్టు (పంజాబ్‌ మ్యాచ్‌ కోసం)  
- మయాంక్‌ అగర్వాల్  
- కేఎల్‌ రాహుల్  
- అనీష్ KV  
- దేవదత్‌ పడిక్కల్‌ (కెప్టెన్‌)  
- స్మరణ్ R  
- శ్రేయస్‌ గోపాల్  
- కృతిక్‌ కృష్ణ (wk)  
- వెంకటేష్ M  
- విద్యాధర్‌ పటిల్  
- విద్యవత్‌ కావేరప్ప  
- ప్రసిద్ధ్‌ కృష్ణ  
- మొహ్సిన్‌ ఖాన్  
- శిఖర్‌ శెట్టి  
- శ్రీజిత్‌ (wk)  
- ధ్రువ్‌ ప్రభాకర్