భక్తి... శరణాగతి

Eenadu icon
By Editorial Team Updated : 10 Jan 2026 16:15 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

నారదభక్తి సూత్రం భక్తికి నిర్వచనం భజన అంటుంది. భజన అంటే చేతులు కలిపి, గొంతెత్తి, పక్క వాద్యాలతో, బృందగానం చేయడం కాదు; విభజన లేని మానసిక స్మరణ, మనన, నిధి ధ్యాసనలను త్రికరణ శుద్ధితో చేయడం. అన్యచింతన లేకుండా, శరణాగతి కోరి, ఎవరైతే సేవ చేస్తారో అలాంటివారే తన భక్తులని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అలాంటి శ్రద్ధాసక్తులతో కొలిచే భక్తజనాల బాగోగులు తానే చూస్తానని కూడా అన్నాడు. ‘పాహిమాం- త్వమేవ శరణంమమ’ అంటే చాలు, చేసిన పాపాలన్నీ పటాపంచలు చేసి, ముక్తి ప్రసాదిస్తాను, నన్ను నమ్మమనీ భగవానుడు మాట ఇచ్చాడు. విన్నదెవరు? విని బాగుపడ్డవారు కోటికి ఒక్కరని ఆయనే అంచనా వేశాడు.

పరమాత్మ భక్తసులభుడే అయినా, శుద్ధభక్తి సిద్ధాన్నం కాదు. కష్టపడాలి, సాధించాలి. ఒక్కొక్క మెట్టు ఎక్కి కొండపైన కోవెల చేరిన చందాన చిత్తశుద్ధి, ఏకాగ్రబుద్ధి కలిగి, ప్రయత్నం చేసినప్పుడే ఫలితం దక్కుతుంది. శక్తి లేనిదే భక్తి లేదు; భక్తి లేనిదే ముక్తి లేదు. నమ్మకమే భక్తి, పైవాడొకడున్నాడని తెలుసుకోవడమే జ్ఞానం, పైవాడే అన్నీ చూసుకుంటాడన్న ధైర్యమే వైరాగ్యం. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు త్రివేణీ సంగమమైతే అందులో అంతర్లీనమై ప్రవహించే సరస్వతీ నదిలాంటిది భక్తి. అది లేనిదే జ్ఞాన, వైరాగ్యాలు పరిపూర్ణం కావు. ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు, అంబరీషుడు, శుకుడు, శౌనకుడు - అందరూ భగవద్భక్తి ద్వారా జ్ఞాన వైరాగ్యాలు పొంది, కర్తవ్య కర్మలను నిష్కామ బుద్ధితో చేసి, ముక్తజీవులై, చిరంజీవులుగా, సామాన్యులకు దారి దీపాలయ్యారు.  భాగవత కథను విన్నందువల్ల పరీక్షితుడికి మరణ భయం తొలగిపోయింది. బమ్మెర పోతన తన భాగవతాన్ని మనుషులకు అంకితం చేయనందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నా, చివరికి చరితార్థుడయ్యాడు.

భక్తి సులభం కాకపోయినా, భక్తుడి వేషం కట్టడం సులువే. ఆహార్యాలతో జనాన్ని మోసం చేయడం ఎంత పని! అలాంటి వ్యక్తులు సమాజంలో ఎందరో ఉన్నారు. కలికాలంలో అలాంటి వారి బలగం ద్విగుణం, బహుళం అయింది. అటువంటి వేషగాళ్లు, మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మనసా వాచా కర్మణా ఆ పరమాత్మనే నమ్మాలి. భక్తి ఒక అఖండజ్యోతి. ఒక దీపంతో ఎన్నో దీపాలు వెలుగుతాయి. ఆ వెలుగులో పయనించే మానవుడు ధన్యజీవి అవుతాడు. పరమాత్మ అవతార రహస్యం ప్రజలను భక్తిమార్గంలో నడిపించడం. సామాన్యుడికి సగుణభక్తి ద్వారా నిర్గుణానికి వెళ్లడం చాలా తేలిక. ‘కాల ప్రభావం వల్ల ఆత్మజ్ఞానం నశించింది. తత్త్వం తెలియజేయడానికే అవతారం ధరిస్తున్నాను’ అని ఆ భగవంతుడు స్వయంగా చెప్పాడు. పోతన అన్నట్టు ‘శ్రీ కైవల్యపదంబు చేరుటకు’ తప్పక మనం ఆ భగవంతుణ్ని ఆశ్రయించాలి; భజించాలి!

► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 08 Jan 2026 02:48 IST