YS Jagan: అమరావతిపై మళ్లీ విషం కక్కిన జగన్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఈనాడు, అమరావతి: అధికారంలో ఉన్న ఐదేళ్లూ అమరావతిని సర్వనాశనం చేయడమే లక్ష్యంగా కుట్రలు చేసిన వైకాపా అధ్యక్షుడు జగన్ ఇప్పటికీ రాజధానిపై విషం కక్కడం మానలేదు. అవాకులు, చవాకులతో మరోసారి రాష్ట్ర ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. గురువారం జాతీయ మీడియాతో మాట్లాడుతూ అమరావతిపై జగన్ విద్వేషం వెళ్లగక్కారు.
ఈ మహానగరాలన్నీ ఇలానే..
చంద్రబాబు రివర్ బేసిన్లో సోకాల్డ్ రాజధాని కట్టాలనుకుంటున్నారని జగన్ వ్యాఖ్యానించారు. కానీ.. మానవచరిత్రలో గొప్ప నాగరికతలన్నీ నదీతీరాల వెంబడే విలసిల్లాయి. లండన్ (థేమ్స్ నది), న్యూయార్క్ (హడ్సన్), కైరో (నైలు) బాగ్దాద్ (టైగ్రిస్), మాస్కో (మొస్కావా), బెర్లిన్ (స్ప్రీ), షాంగై (హువాంగ్పు) రోమ్ (టైబర్)... ఇలా అనేక మహానగరాలు నదీ తీరాల్లోనే అభివృద్ధి చెందాయి. మన దేశ రాజధాని దిల్లీ యయునా నది ఒడ్డున ఉంది. కోల్కతా, లఖ్నవూ, వారణాసి, కాన్పుర్, పట్నా, ప్రయాగ్రాజ్, ఆగ్రా, మథుర, నాసిక్, కటక్ లాంటి నగరాలన్నీ నది ఒడ్డునే ఉన్నాయి. తాగునీరు, వ్యవసాయం, రవాణా వంటివాటికి అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతో నదీతీరంలో మహానగరాల నిర్మాణం జరిగింది. కృష్ణా నదికి ఒక ఒడ్డున విజయవాడ ఉన్నప్పుడు, మరో ఒడ్డున అమరావతిని నిర్మిస్తే జగన్కు వచ్చిన ఇబ్బందేంటి? రాజధాని నిర్మాణానికి ఎన్జీటీ కూడా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
హైకోర్టు స్పష్టంగా చెప్పినా..
రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, నిర్దేశిత గడువులోగా నిర్మాణం పూర్తిచేయాలని హైకోర్టు స్పష్టంగా చెప్పినా పట్టించుకోని జగన్.. తాను అధికారంలో ఉన్నన్నాళ్లూ అదే పాట పాడారు. అధికారం పోయినా అమరావతి విషయంలో ఆయన వైఖరిలో మార్పులేదని మరోసారి రుజువైంది.
ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందేమో!
అమరావతిపై నాలుక మడతేయడం, మాటమార్చేయడం జగన్కు వెన్నతో పెట్టిన విద్య. గుంటూరు-విజయవాడ మధ్య 35 వేల ఎకరాల్లో రాజధాని నిర్మించాలని, రాజధానిగా అమరావతి తమకు ఆమోదయోగ్యమేనని ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్... 2019 ఎన్నికల వరకు అదే పాట పాడారు. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని 2019 ఎన్నికల సమయంలోనూ జగన్, వైకాపా నాయకులు ఢంకా భజాయించి చెప్పారు. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు.. ఈ మూడూ ఎక్కడుంటే అదే రాజధాని అని జగన్ ఒక సభలో చెప్పారు.
2019 ఎన్నికల్లో ఓట్ల కోసం నటించిన జగన్... గెలిచాక అసలు రూపం బయటపెట్టారు. మూడు రాజధానుల పేరుతో అమరావతిని సర్వనాశనం చేసేందుకు నడుం కట్టారు. 2024 ఎన్నికల్లో తల బొప్పి కట్టడంతో... మూడు రాజధానులపై తమ పార్టీలో చర్చించుకుని తమ విధానం ప్రకటిస్తామని బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి వేర్వేరు సందర్భాల్లో చెప్పారు. వైకాపా మళ్లీ అధికారంలోకి వస్తే సీఎంగా జగన్ అమరావతిలోనే ఉంటారని, విశాఖ వెళ్లరని 2025 సెప్టెంబరు 13న సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వైకాపా నాయకుల నిజస్వరూపమేంటో, అమరావతిపై వారి వైఖరేంటో జగన్ తాజా వ్యాఖ్యలతో మరోసారి స్పష్టమైంది.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 09 Jan 2026 04:07 IST