చంద్రబోస్‌కు రూ.10లక్షలు సంపాదించి పెట్టిన పాట ఇది!

Eenadu icon
By Entertainment Team Updated : 03 Jan 2026 17:19 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ యవనికపై తెలుగు పాటకు పట్టం కట్టేలా చేసిన గేయ రచయిత చంద్రబోస్‌ (lyricist chandra bose). ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ‘నాటు నాటు’కు ఉత్తమ గేయ రచయితగా, సంగీత దర్శకుడు కీరవాణితో కలిసి ఆస్కార్‌ను అందుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన అనేక విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా గేయ రచయితల హక్కులు కాపాడటంతో పాటు, రాయల్టీ రూపంలో డబ్బులు ఎలా వస్తాయో వివరించారు.

‘‘సినిమా ఇండస్ట్రీలో కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. గేయ రచయితలకు పారితోషికం బాగానే ఉంటుంది. బాగా రాసి, బహుళ ప్రజాదరణ పొందితే ఐపీఆర్‌ఎస్‌ (ఇండియన్‌ ఫెర్మారింగ్ రైట్స్‌ సొసైటీ) ద్వారా రాయల్టీ కూడా వస్తూ ఉంటుంది. పాట విజయాన్ని, ఘనతను, చరిత్రను బట్టి ఆ మొత్తం ఉంటుంది. ఎక్కువ వేదికల్లో మార్మోగితే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. ఉదాహరణకు ఒక పాటకు రాయల్టీ రూపంలో రూపాయి వస్తే, అందులో రచయిత, సంగీత దర్శకుడికి చెరో పావలా, పబ్లిషింగ్‌ కంపెనీకి 50పైసలు ఇస్తారు. అత్యంత ప్రజాదరణ పొందిన పాటల్లో ‘చిరు చిరు చినుకై కురిశావే’ ఒకటి. ఆ పాట రాసినప్పుడు నాకు రూ.25వేలు ఇచ్చారు. ఇప్పటికి ఆ పాట రాయల్టీ రూపంలో రూ.10లక్షలు సంపాదించింది. ఇంకా వస్తూనే ఉంటుంది. రూ.50వేల నుంచి రూ.లక్ష వచ్చిన సందర్భమూ ఉంది. బ్రహ్మాస్త్ర’లో ‘కుంకుమలా నువ్వే’ పాట కూడా అంతే’’

  • ఈ ఏడాది మొదటి వారం ఓటీటీలో ప్రేక్షకులను అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!

‘‘మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకుంటే, ప్రతిదీ ఒక మెట్టు అవుతుంది. అనువాద గీతాలు చక్కగా రాయడం వల్ల కూడా రాయల్టీ వస్తోంది. గత పది పదిహేనేళ్లుగా రచయితల పరిస్థితి బాగానే ఉంది. సాధారణంగా సినిమా కోసం పాట రాస్తాం. కానీ, ఆ పాట సినిమా నుంచి బయటకు వచ్చి, దానిని మించి ఎదుగుతోంది. ఒక పాటను థియేటర్‌, టీవీ, సెల్‌ఫోన్‌, రేడియో, హోటల్‌ లాంజ్‌లు, రియాల్టీషో ఇలా చాలా చోట్ల వింటాం. ఇంతకు ముందు రచయితలు కష్టపడేవారు. మా హక్కులను కాపాడిన వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు. ఐపీఆర్‌ఎస్‌ చట్టం ఆనుపానులు ఆయన పరిశీలించారు, పరిశోధించారు. ఆరోగ్యం సహకరించకపోయినా నిర్మాతలు, పబ్లిషర్ల తరపున పోరాటం చేశారు. లాయర్లతో కూర్చొని చర్చించి, ఏది చేస్తే రచయితలకు మేలు జరుగుతుందో అనే విషయాల కష్టపడి పరిశీలించి, ఫలాలను మాకిచ్చి వెళ్లిపోయారు. కరోనా సమయంలో ఎవరికీ పనులు లేవు. కానీ, రాయల్టీ వచ్చింది. ప్రతి రచయితకు మూడు నెలలకు ఒకసారి రూ.50వేలు పంపారు. ఎంతో మంది యువ రచయితలకు ఇది ఉపయోగపడింది. ఆ సంస్థను కాపాడాలంటే మంచి పాటలు రాయాలి’’అని అన్నారు.


► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 03 Jan 2026 17:09 IST