TG News: కలిసి చదివి...కలల ప్రపంచానికి చేరి.. స్నేహితురాళ్ల విషాదాంతం

Eenadu icon
By Telangana News Desk Updated : 30 Dec 2025 04:28 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

గార్ల, న్యూస్‌టుడే: గ్రామంలో ఒకటో తరగతి మొదలు.. అమెరికాలో ఎంఎస్‌ దాకా కలిసి చదువుకున్న ఇద్దరు యువతులు ఆదివారం అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో విగతజీవులుగా మారారు. వారి మరణ వార్త తెలిసి మహబూబాబాద్‌ జిల్లా గార్ల, ముల్కనూరు గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... గార్ల మండల కేంద్రానికి చెందిన పుల్లఖండం మేఘనారాణి(25), ముల్కనూరు గ్రామవాసి కడియాల భావన(24) గార్లలో ప్రాథమిక విద్య మొదలుకొని హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ వరకు కలిసే చదువుకున్నారు. ఎంఎస్‌ చేసేందుకు మూడేళ్ల కిందట అమెరికా వెళ్లారు. అక్కడ ఒహాయో రాష్ట్రం డేటన్‌లో ఉంటూ యూనివర్సిటీ ఆఫ్‌ డేటన్‌లో ఎంఎస్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలో ఎనిమిది మంది మిత్రులు కలిసి రెండు కార్లలో విహారయాత్రకు అలబామా హిల్స్‌ వెళ్తుండగా మార్గమధ్యలో వీరి కారు లోయలో పడటంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మేఘనారాణి తల్లిదండ్రులు నాగేశ్వరరావు, శిరీష.. గార్లలో మీ-సేవ కేంద్రాన్ని నడుపుతున్నారు. భావన తండ్రి కోటేశ్వరరావు ముల్కనూరు గ్రామ ఉపసర్పంచి కాగా తల్లి రేణుక గృహిణి. మరో వారం రోజుల్లో(జనవరి 5) భావన పుట్టినరోజని, అంతలోనే తమకు దూరమైందని కన్నీరుమున్నీరు అవుతున్నారు. ప్రమాదం గురించి బాధిత కుటుంబాలకు సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు సమాచారం అందింది.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 30 Dec 2025 04:21 IST