యూట్యూబ్‌ రీల్స్‌తో తొలి సంపాదన..!

‘కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి..’ అన్నారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం. అయితే ఈ మాటల్ని యువతే కాదు.. 50 ఏళ్లు పైబడిన వారూ తమ ట్యాలెంట్‌తో నిజం చేసి చూపిస్తున్నారు. తద్వారా ‘వయసు కేవలం సంఖ్య మాత్రమే!’ అని రుజువు చేస్తున్నారు.

Eenadu icon
By Vasundhara Team Updated : 30 Dec 2025 16:01 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

(Photos: Screengrab)

‘కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి..’ అన్నారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం. అయితే ఈ మాటల్ని యువతే కాదు.. 50 ఏళ్లు పైబడిన వారూ తమ ట్యాలెంట్‌తో నిజం చేసి చూపిస్తున్నారు. తద్వారా ‘వయసు కేవలం సంఖ్య మాత్రమే!’ అని రుజువు చేస్తున్నారు. 52 ఏళ్ల మనీషా పరీక్‌ ఇందుకు తాజా ఉదాహరణ. యూట్యూబ్‌లో రీల్స్ పోస్ట్‌ చేస్తూ ఆరు నెలలు తిరక్కముందే ఆ సంస్థ నుంచి తొలి ఆదాయం అందుకుందామె. ఈ క్రమంలోనే తన సంతోషాన్ని కూతురు అన్షుల్‌ పరీక్‌తో పంచుకోగా.. అమ్మ హ్యాపీ మొమెంట్స్‌ని కెమెరాలో బంధించి ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. అది కాస్తా వైరల్‌గా మారడంతో వార్తల్లో నిలిచింది మనీషా. ఆ వీడియోకి చాలామంది ‘కంగ్రాట్స్‌ ఆంటీ జీ’ అంటూ కామెంట్లు పెట్టగా.. యూట్యూబ్‌ కూడా ఆమెను అభినందించడం విశేషం!

కుటుంబ కథలే స్ఫూర్తిగా!

రీల్స్‌, కార్టూన్లు అంటే యువతకు సంబంధించిన అంశమని, జెన్‌జీ తరం వారే వీటిపై కంటెంట్‌ రూపొందించగలరనీ చాలామంది భావిస్తుంటారు. అందుకు భిన్నంగా 52 ఏళ్ల వయసులో మనీషా పరీక్‌ యూట్యూబ్‌లో కార్టూన్‌ ఆధారిత రీల్స్ చేయాలని భావించింది. ఈ క్రమంలోనే ‘Life Unscripted’ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించింది. ఇందుకోసం కుటుంబంలో జరిగే కొన్ని సంఘటనలనే తన కథావస్తువుగా ఎంచుకుంది. వాటికి తనదైన హాస్యాన్ని జోడిస్తూ.. కార్టూన్‌ వీడియోలను రూపొందించి యూట్యూబ్‌లో పోస్ట్‌ చేయడం మొదలుపెట్టింది. అనతికాలంలోనే మనీషా ఛానల్‌కు ఆదరణ లభించడంతో వీక్షణలు పెరిగాయి. ఇలా ఆరు నెలలు తిరక్కముందే సుమారు 42 వేల మంది సబ్‌స్క్రైబర్లను పొందిన ఆమె.. ఇటీవలే యూట్యూబ్‌ సంస్థ నుంచి మొదటిసారి కొంత మొత్తాన్ని ఆదాయంగా అందుకుంది. అది మనీషా జీవితంలోనే మొదటి సంపాదన కావడంతో ఎగిరి గంతేసినంత పనిచేసిందామె. ఈ క్రమంలోనే తన సంతోషాన్ని కూతురు అన్షుల్‌ పరీక్‌తో పంచుకుంది. ఇలా తన తల్లి మెమరబుల్‌ మొమెంట్స్‌ని వీడియో రూపంలో కెమెరాలో బంధించిన అన్షుల్‌.. దీన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది.

కష్టే ఫలి!

ఈ వీడియోలో భాగంగా అన్షుల్‌ తన తల్లితో ‘నీ హ్యాపీనెస్‌కి కారణమేంటమ్మా?’ అని అడగ్గా.. ‘52 ఏళ్ల వయసులో.. జీవితంలోనే మొదటి సంపాదనను యూట్యూబ్‌ ద్వారా అందుకున్నా. అదీ ఆరు నెలల్లోనే.. కష్టపడితే తప్పకుండా ఫలితం వస్తుంది’ అంటూ సంబరపడిపోయింది మనీషా. ఈ వీడియోకి సుమారు 13 లక్షల వీక్షణలు వచ్చాయి. చాలామంది ‘కంగ్రాట్స్ ఆంటీ జీ’ అంటూ పోస్టులు చేస్తున్నారు. యూట్యూబ్‌ కూడా ‘యూట్యూబ్‌ క్రియేటర్స్‌ ఇండియా’ ఖాతా ద్వారా ‘మనీషా రీల్స్‌ స్ఫూర్తిదాయకం..!’ అంటూ కితాబిచ్చింది.



► Read latest Women Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 30 Dec 2025 15:23 IST