India Women won by 15 runs On Srilanka

శ్రీలంకతో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసింది. చివరిదైన ఐదో టీ20లో గెలిచి టీమిండియా తన జైత్ర యత్రను కొనసాగించింది. ఐదో మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక 160 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. శ్రీలంక బ్యాటర్లలో హాసిని పెరీరా(65), ఇమేషా దులాని(50)లు రాణించినా జట్టుకు విజయం చేకూర్చలేకపోయారు. భారత మహిళా బౌలర్లలో దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, స్నేహ్‌ రానా, వైష్ణవి శర్మ, శ్రీచరణి, అమన్‌ జ్యోత్‌ కౌర్‌లు తలో వికెట్‌ తీసి విజయానికి సహకరించారు.

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన చివరి టీ20లో టీమిండియా ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్‌ చేసింది. తిరువనంతపురం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగి, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.

కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మెరుపు అర్ద సెంచరీతో (43 బంతుల్లో 68; 9 ఫోర్లు, సిక్స్‌) చెలరేగగా.. ఆఖర్లో అమన్‌జోత్‌ కౌర్‌ (18 బంతుల్లో 21; ఫోర్‌, సిక్స్‌), అరుంధతి రెడ్డి (11 బంతుల్లో 27 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌) బ్యాట్‌ ఝులిపించారు.

మిగతా బ్యాటర్లలో షఫాలీ వర్మ 5, అరంగేట్రం ప్లేయర్‌ కమలిని 12, హర్లీన్‌ డియోల్‌ 13, రిచా ఘోష్‌ 5, దీప్తి శర్మ 7, స్నేహ్‌ రాణా (8 నాటౌట్‌) పరుగులు చేశారు. లంక బౌలర్లలో కవిష దిల్హరి, రష్మిక సెవ్వండి, కెప్టెన్‌ ఆటపట్టు తలో 2 వికెట్లు తీయగా.. నిమిష మదుషని ఓ వికెట్‌ పడగొట్టింది.