సంగీతానికి గాయం!

Eenadu icon
By National News Desk Published : 24 Dec 2025 04:12 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

కోల్‌కతా: బంగ్లాదేశ్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని మైనక్‌ బిశ్వాస్‌ అనే తబలా విద్వాంసుడు వెల్లడించారు. ఆ దేశంలో చిక్కుకుపోయిన తాను 48 గంటల నరకాన్ని అనుభవించానని, పేరు మార్చుకుని బతికి పోయానని వివరించారు. ఢాకాలోని భారత్‌ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్న ప్రాంతంలో చిక్కుకున్న తాను ఎలాగోలా అక్కడి నుంచి బయటపడ్డానని తెలిపారు. ఢాకాలోని ధన్‌మోండీ ప్రాంతంలో ఛాయానౌత్‌ పేరుతో ప్రముఖ సరోద్‌ విద్వాంసుడైన సిరాజ్‌ అలీ ఖాన్‌ కార్యక్రమం ఏర్పాటైంది. అయితే ఆందోళనకారులు ఆ కార్యక్రమ వేదికను ధ్వంసం చేశారు. దీంతో ఆయన కార్యక్రమం రద్దయింది. ఆయన ఎలాగోలా తప్పించుకుని శనివారం కోల్‌కతాకు చేరుకున్నారు. ఖాన్‌ తల్లి ఆయేషా, ఆయన బృందంతోపాటు బిశ్వాస్‌ ఢాకాలో చిక్కుకుపోయారు. అల్లర్ల కారణంగా వారిని సోమవారం నాటికి భారత్‌ వెనక్కి తీసుకు రాగలిగింది. ఈ 48 గంటల్లో అత్యంత భయానక పరిస్థితులను వారు ఎదుర్కొన్నారు. 

ఎన్నోసార్లు వెళ్లా.. కానీ!

‘నేను బంగ్లాదేశ్‌కు ఎన్నోసార్లు వెళ్లా. కానీ ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ ఎదుర్కోలేదు. స్థానికుల మధ్య శత్రుత్వం తీవ్రంగా పెరిగింది. భయాందోళనల కారణంగా ఎక్కువ సమయం నేను హోటల్లోనే ఉన్నా. 18, 19 తేదీల్లో హింస చెలరేగడంతో లాబీలోకీ రానీయలేదు. అత్యవసర పనిమీద బయటకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో నా భారతీయ గుర్తింపును రహస్యంగా ఉంచాల్సి వచ్చింది. నా పేరును ముస్లిం శబ్దం వచ్చేలా మార్చుకున్నా. ఖాన్‌ సహాయకుడు పల్లబ్‌ ఘోష్‌సహా మిగతా సిబ్బంది అంతా సోమవారం ఉదయమే క్యాబ్‌ బుక్‌ చేసుకుని ఢాకా విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయ లాంజ్‌లో చాలా గంటలపాటు వారు వేచి ఉండాల్సి వచ్చింది. సాయంత్రం 6 గంటలకు వారి విమానం బయలుదేరింది’ అని బిశ్వాస్‌ వివరించారు. 

మానసిక ఒత్తిడికి గురయ్యాం

‘ఢాకా వీధుల్లో అల్లర్లు రోజూ జరుగుతుండటంతో మేం ఏ మాత్రం రిస్కు తీసుకోలేదు. 18వ తేదీ నుంచి 19వ తేదీ ఉదయం విమానాశ్రయంలో అడుగుపెట్టే దాకా మానసిక వ్యథను అనుభవించాం. విమానాశ్రయానికి వచ్చే దారిలో నా తబలా గురించి తీవ్రంగా ఆందోళన చెందా. దానిని ధ్వంసం చేస్తారని భయపడ్డా. అదృష్టవశాత్తూ దారిలో మేం ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కోలేదు. కోల్‌కతాలో నా తబలాను తీసుకున్నాక ప్రశాంతంగా అనిపించింది’ అని బిశ్వాస్‌ తెలిపారు.

ఏమీ మాట్లాడకుండా ఉన్నందువల్లే..

‘నేను ఏమీ మాట్లాడకుండా ఉండటంవల్లే ఢాకా వీధుల్లో దాడులకు గురికాకుండా తప్పించుకోగలిగా. అక్కడి ప్రజల్లో భారత్‌ వ్యతిరేక సెంటిమెంట్‌ స్పష్టంగా కనిపించింది. వారు నేరుగా నా ముందు వ్యక్తం చేయకపోయినా పరిస్థితి అర్థమైంది. భాష యాసను బట్టి భారతీయులని స్థానికులు గుర్తిస్తారనే భయంతో నోళ్లు మూసుకుని ఉన్నాం. హోటల్‌వద్ద క్యాబ్‌లను బుక్‌ చేసుకునేటప్పుడు పేర్లు మార్చుకున్నాం. దీనికి హోటల్‌ వ్యక్తి సహాయం చేశారు’ అని బిశ్వాస్‌ వివరించారు.

చక్కబడ్డాక మళ్లీ వెళ్తా..

‘పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. బంగ్లాదేశ్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాక మళ్లీ వెళ్తా. మా మాండలికాలు వేర్వేరుగా ఉండొచ్చు. కానీ ఒకే భాష మాట్లాడతాం. మేం వారికి శత్రువులం కాదు’ అని బిశ్వాస్‌ పేర్కొన్నారు.

ఢాకాలోని సాంస్కృతిక కేంద్రం ఛాయానౌత్‌ను 1960లో నిర్మించారు. ఇంక్విలాబ్‌ మంచా అధికార ప్రతినిధి షరీఫ్‌ ఉస్మాన్‌ హాదీ హత్యతో శుక్రవారం తెల్లవారుజామున అల్లరిమూక దానిని ధ్వంసం చేసింది. తబలా, హార్మోనియం వంటి పలు సంగీత పరికరాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఛాయానౌత్‌లో కచేరీ చేయాల్సిన సిరాజ్‌ అలీ ఖాన్‌ మూలాలు బంగ్లాదేశ్‌లోని బ్రహ్మాన్‌బెరియాలో ఉన్నాయి. కోల్‌కతాలో ఉంటున్న ఆయన ఢాకాలో కచేరీ కోసం ఈ నెల 16వ తేదీన బంగ్లాదేశ్‌ వెళ్లారు. అక్కడి హోటల్‌లో వారు సాధన చేస్తుండగా.. ఛాయానౌత్‌పై దాడి జరిగినట్లు సమాచారం వచ్చింది. దీంతో తన కార్యక్రమాన్ని రద్దు చేసుకుని శనివారమే ఖాన్‌ కోల్‌కతాకు వచ్చారు. కానీ ఆయన బృందం 22వ తేదీ వరకూ అక్కడే చిక్కుకుపోయింది. చివరకు వారు సోమవారం కోల్‌కతా చేరుకున్నారు.

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని