

CM Revanth Reddy: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పంచాయతీ ఫలితాలే

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు రెండేళ్ల ప్రజాపాలనపై ప్రజలు ఇచ్చిన తీర్పు అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మూడింట రెండో వంతు స్థానాలు కాంగ్రెస్కే దక్కాయని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ తీర్పు పునరావృతమై రాష్ట్రంలో రెండోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని స్పష్టం చేశారు. భాజపా, భారత రాష్ట్ర సమితి కలిసి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమని, గత లోక్సభ ఎన్నికల్లో, ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో అవి కలిసే పోటీ చేశాయని ఆరోపించారు. ఇవన్నీ భవిష్యత్తులో ఆ రెండు పార్టీల మైత్రికి నిదర్శనమని చెప్పారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై గురువారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్రంలోని 12,728 పంచాయతీలకు గాను 12,702కు ఎన్నికలు పూర్తయ్యాయి. రెండేళ్ల పరిపాలన తరువాత పంచాయతీ ఎన్నికల రూపంలో ప్రజల వద్దకు వెళ్తే సంపూర్ణ విశ్వాసం ప్రకటించి ఆశీర్వదించారు.
కష్టపడిన కార్యకర్తలు, ఆశీర్వదించిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు. రాష్ట్రంలో 7,527 గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు, 808 గ్రామాల్లో కాంగ్రెస్ రెబల్స్ గెలిచారు. మొత్తం 8,335 పంచాయతీలతో 66 శాతం ఫలితాలను సాధించాం’ అని తెలిపారు. భారత రాష్ట్ర సమితి, భాజపా కూటమిగా పోటీ చేశాయని ఆరోపిస్తూ... అయినా అవి 4,221 (33శాతం) గ్రామాల్లోనే గెలుపొందాయని అన్నారు. ఇందులో భారత రాష్ట్ర సమితి 3,511, భాజపా 710 స్థానాలు సాధించాయని.. మరో 146 స్థానాల్ని సీపీఎం, సీపీఐ, ఇతర పార్టీల మద్దతుదారులు కైవసం చేసుకున్నారని వివరించారు. మంత్రులు, ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లో అక్కడి పరిస్థితుల ప్రకారం పంచాయతీ ఎన్నికలు ఉంటాయని అన్నారు. అధికారికంగా జాబితా విడుదల చేస్తామని.. ఎవరికైనా అనుమానాలు ఉంటే నిజనిర్ధారణ కమిటీ వేసుకుని పరిశీలించుకోవచ్చని చెప్పారు. సోనియాగాంధీ, రాహుల్గాంధీపై పెట్టిన అక్రమ కేసులపై కోర్టులు చీవాట్లు పెట్టినా కేంద్రం తీరు మారలేదన్నారు. ప్రజాస్వామ్యపార్టీలే ప్రజలకు రక్ష అని... అందుకే తెలంగాణలో ప్రజలు పార్టీకి అండగా ఉన్నారన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనపై త్వరలోనే అసెంబ్లీలో చర్చించి జడ్పీటీసీ, ఎంపీటీసీ, పురపాలక ఎన్నికలపై నిర్ణయానికి వస్తామని తెలిపారు. రాష్ట్రంలో 43 వేల పోస్టుల భర్తీపై అన్ని విషయాలు పరిశీలించి, సభలో చర్చించి నిర్ణయం తీసుకుని నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. విద్యుత్తు సంస్థలకు రూ.35 కోట్ల లోటు చెల్లిస్తామని, దుబారా తగ్గించుకుని ఆదాయాన్ని పెంచుకుంటున్నామని చెప్పారు. సోనియాగాంధీ తీసుకువచ్చిన ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చి.. కేంద్రం ఆ పథకం పేదలకు అందకుండా చేస్తోందని ఆరోపించారు.
ఏడో గ్యారంటీగా స్వేచ్ఛను అందిస్తున్నాం
‘‘భారత రాష్ట్ర సమితి నాయకులు ఉప ఎన్నికలను రెఫరెండం అన్నారు. మహానగరంలో జరిగిన రెండు ఉపఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని గౌరవించి అధిక స్థానాలు కట్టబెట్టారు. ప్రజా ప్రభుత్వం.. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేర్చడంతో పాటు ఏడో గ్యారంటీగా స్వేచ్ఛను అందిస్తోంది. గెలిస్తే అహంకారంతో కళ్లు నెత్తికి ఎక్కడం లాంటి పరిస్థితులకు దూరంగా ఉంటూ మేము ప్రజలకు మరింత దగ్గరవుతూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజలు, ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలు చేపట్టలేదు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటువేసి, తీర్పు ఇచ్చే అవకాశం కల్పించాం. అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు.
కేటీఆర్ వెనుక హరీశ్ గోతులు తవ్వుతున్నారు
భారత రాష్ట్ర సమితి నాయకత్వం కోసం హరీశ్రావు... కేటీఆర్ వెనుక గోతులు తవ్వుతున్నారు. ఆ విషయాన్ని మరుగుపరచాలని కేటీఆర్ ఆత్మీయ సమ్మేళనాలు అంటూ పర్యటనలు చేస్తున్నారు. కేటీఆర్ నాయకత్వంలో ఆ పార్టీ ఏ ఎన్నికల్లోనూ గెలవలేదు. కేటీఆర్ ఉంటే.. భారత రాష్ట్ర సమితి పార్టీ ఉండదని హరీశ్రావు వర్గం, సోషల్మీడియా నుంచి నినాదాలు వస్తున్నాయి.
వారికి అహంకారం తగ్గలేదు..
ప్రతిపక్షంలో ఉన్నా అహంకారం తగ్గలేదు. మీ అసూయ, అహంకారం, ద్వేషంతో రాష్ట్రానికి నష్టం కలిగించవద్దు. తెలంగాణకు అంతర్జాతీయంగా గొప్ప స్థానం ఉంది. రాష్ట్రంలో ఇంకా అభివృద్ధి జరగాలి. సంపద పెరగాలి. పెరిగిన సంపద పేదలకు పంచాలన్న విధానంతో ముందుకు వెళ్తున్నాం. ప్రతిపక్షాలు ప్రభుత్వ నిర్ణయాలకు సహకరించాలి. భాజపా, భారత రాష్ట్ర సమితి ఒక్కటే. ఒకరి తరువాత ఒకరు ప్రెస్మీట్లు పెట్టి ఒకే విషయం మాట్లాడతారు. భారత రాష్ట్ర సమితి ఉన్నపుడే రాష్ట్రం బాగున్నట్లు కిషన్రెడ్డి మాట్లాడుతుంటారు.
వాళ్లేమైనా పిల్లలా.. అందరూ మేజర్లు.. నిజాన్ని స్పీకర్ ముందు చెప్పారు
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం మీద రాజకీయ పార్టీగా స్పందించబోం. వాళ్లేమైనా పిల్లలా.. అందరూ మేజర్లు.. నిజాన్ని స్పీకర్ ముందు చెప్పారు. తీర్పు ఎవరికైనా నచ్చకుంటే న్యాయస్థానాలు ఉన్నాయి. హరీశ్రావు పదేపదే శాసనసభలో 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. ఆ మేరకు సమయం కావాలంటారు. అసెంబ్లీలో భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్ష కార్యాలయ నిర్వహణ కోసం ఆ పార్టీ ఎమ్మెల్యేల నుంచి ప్రతి నెల రూ.5వేలు తీసుకుంటున్నారు. ఇప్పుడేమో సొంతపార్టీ వారిని ‘మా వాళ్లు కాదు’ అంటున్నారు.
రాష్ట్రానికి కేసీఆర్ తీరని ద్రోహం చేశారు
రాష్ట్రం ఆవిర్భవించాక నీటిపారుదల ప్రాజెక్టులపై తెలంగాణకు కేసీఆర్ తీరని ద్రోహం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కన్నా ఎక్కువ నష్టం జరిగింది. ఆధారాలతో సహా సభలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కృష్ణా, గోదావరి నదీ జలాలు, నీటి ప్రాజెక్టులపై చర్చ చేపట్టేందుకు ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ను లేఖ రాయమంటున్నా. మూడు నాలుగు రోజులైనా సరే సభ నిర్వహిద్దాం. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు ఇచ్చేలా కేసీఆర్ ఒప్పందాలు చేసుకున్నారు. పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, సీతారామసాగర్కు నీటి కేటాయింపులు చేయలేదు. సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు మంత్రి ఉత్తమ్ సాధించారు. శాసనసభ సమావేశాలు నిర్వహించి పూర్తివివరాలు ప్రజలకు వివరిద్దాం. మావైపు లోపం ఉంటే ప్రశ్నించాలి. అంతేకాని బురదజల్లి పారిపోతామంటే ఊరుకోం’’ అని సీఎం రేవంత్ అన్నారు. విలేకరుల సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, సీతక్క, ఎమ్మెల్యేలు జైవీర్రెడ్డి, అనిల్కుమార్రెడ్డి, భూపతిరెడ్డి, రాజేందర్రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి పాల్గొన్నారు.
కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో లేరు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ వైపు నిలబడ్డారు. అక్కడ ఆయన ఓడిపోయినట్టే. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా ప్రయోజనం లేదని మెజార్టీ పంచాయతీల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇప్పుడు ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదు.
ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించారు. గ్రామీణ ప్రాంతాల్లో 94 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్ పార్టీ 87 నియోజకవరాల్లో, భారత రాష్ట్ర సమితి 6, భాజపా ముథోల్ నియోజకవర్గంలో మెజారిటీ సర్పంచ్ స్థానాలు పొందాయి. 2023 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ 66 నియోజకవర్గాలు గెలుపొందగా... పంచాయతీ ఎన్నికల నాటికి మరో 21 నియోజకవర్గాలు ఎక్కువగా గెలిచాం.



గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- స్టాండింగ్లోనే.. సిట్.. ముందుకు కదలని బెట్టింగ్ యాప్ల కేసు దర్యాప్తు అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న బెట్టింగ్ యాప్లకు ముకుతాడు వేసేందుకు ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పేరుకే పరిమితమైంది.
- భారతీయ ప్రతిభా సామర్థ్య వేదిక ఆలోచనలు, ఆవిష్కరణలు, సంకల్పాల శక్తిమంత కలయిక ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో-2026’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
- సినీ నటి ప్రత్యూష మృతి కేసులో.. సిద్ధార్థరెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డికి తెలంగాణ హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసింది.
- సినీనటుడు మోహన్బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో సినీనటుడు, మోహన్బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) ఛాన్స్లర్ మోహన్బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
- తీరంలో యుద్ధ నౌకల జాతర ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం రాత్రి విశాఖ ఈఎన్సీ ఆఫీసర్స్ మెస్లో విందు (ప్రెసిడెన్షియల్ బాంక్వెట్) ఇచ్చారు.
- హంగ్లో అదృష్ట హస్తం ఛైర్పర్సన్ ఎన్నికలు వాయిదా పడిన 11 మున్సిపాలిటీల్లో మంగళవారం 8 చోట్ల ఆ ప్రక్రియను పూర్తిచేశారు.
- బయో వరల్డ్గా తెలంగాణరాష్ట్రం ‘బయో ఆసియా తన పేరును దాటి.. బయో వరల్డ్గా మారుతోంది. ఈ సభను చూస్తుంటే.. బయో వరల్డ్గా తెలంగాణ ఎదుగుతుందనే విషయాన్ని నేను గర్వంగా చెప్పగలను.
- రూ.1,700 కోట్ల పెట్టుబడులు బయో ఆసియా 2026 సదస్సు వేదికగా మంగళవారం తెలంగాణకు రూ.1,700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
- విలువలు, విధానాలపై కుటుంబ సభ్యులకు స్పష్టత ఉండాలి వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే.. కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ అన్నారు.
- మీ టాయిలెట్టే మీ డాక్టర్ వైద్యఆరోగ్య రంగంలో సాంకేతికంగా పెను మార్పులు వస్తున్నాయి. వైద్య నిర్ధారణ పరీక్షలు సులభతరం అవుతున్నాయి.
- 70 ఇంజినీరింగ్ కళాశాలల్లో పాత ఫీజులే రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) షాక్ ఇవ్వనుంది.
- డాన్.. సింబా.. లియో డాన్.. సింబా.. లియో.. చార్లీ.. టైసన్.. రాణా.. విరాట్.. పోలీసు సాయుధబలగాల్లో చేరేందుకు సిద్ధమైన సుశిక్షిత జాగిలాలివి.
- చెత్త కనిపిస్తే సహించేది లేదు రాజధాని పరిధిలోకి వచ్చే మూడు నగరపాలక సంస్థల పరిధిలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
- ఎప్సెట్ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు ఎప్సెట్ దరఖాస్తు స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా, రిజిస్ట్రేషన్ సంఖ్యను పోగొట్టుకున్నప్పటికీ మళ్లీ పొందేలా కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెచ్చినట్లు కన్వీనర్ ఆచార్య కె.విజయకుమార్రెడ్డి వెల్లడించారు.
- రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం భాజపానే పురపాలిక ఎన్నికల్లో భాజపా కరీంనగర్ కార్పొరేషన్, నారాయణపేట మున్సిపాలిటీలను కైవసం చేసుకుందని, భవిష్యత్తులో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా శ్రేణులు శ్రమించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు పిలుపునిచ్చారు.
- ప్రతి ముగ్గురిలో ఒక చిన్నారికి భారతీయ టీకాలు ప్రపంచంలోని ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరికి భారత్ నుంచి టీకాలు సరఫరా అవుతున్నాయని భారత్ బయోటెక్ చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ డాక్టర్ రేచస్ ఎల్ల తెలిపారు.
- నా బిడ్డకు పూర్తి న్యాయం జరగలేదు తన బిడ్డకు వందశాతం న్యాయం జరిగిందని భావించట్లేదని ప్రత్యూష తల్లి సరోజినీదేవి అన్నారు. ఆమె మంగళవారం ఇక్కడ ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు.
- మాటలు.. మంటలు.. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో మంగళవారం మున్సిపల్ ఛైర్పర్సన్లు, వైస్ఛైర్పర్సన్ల ఎన్నిక ప్రక్రియ సందర్భంగా కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
- మున్సిపల్ ఎన్నికల్లో.. ముందూ.. వెనకా పంపకాలే మున్సిపల్ ఎన్నికల్లో ఆద్యంతం.. కాసుల హవాయే నడిచింది. పోలింగ్ వరకు ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంచిన రాజకీయ పార్టీలు.. కౌంటింగ్ తర్వాత బలసమీకరణలో భాగంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఆకట్టుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి.
- పొత్తు కొనసాగేది.. లేనిది కాంగ్రెస్ చేతిలోనే కొత్తగూడెం కార్పొరేషన్గా ఏర్పడ్డ మొదటి ఎన్నికల్లోనే సీపీఐ అపూర్వ విజయం సాధించిందని, కాంగ్రెస్తో పొత్తు లేకున్నా సత్తాచాటామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.