ఆనంద హేలాపురి

- A
- A+
- A++

ఈనాడు డిజిటల్, భీమవరం, ఏలూరు రూరల్, న్యూస్టుడే: మనసులను మైమరపించిన పాటలతో.. తనువును ఊపేసిన నృత్యాలతో.. రంగు రంగుల దీపాల కాంతుల్లో.. హేలాపురి వాసులు ఆనంద డోలికల్లో మునిగారు. సంక్రాంతి సంబరాలు పది రోజులు ముందుగానే మొదలయ్యాయా అన్నట్లు ఈనాడు 50, ఈటీవీ 30 వసంతాల వేడుకలు అంబరాన్ని అంటాయి. ఏలూరు నరసింహరావుపేటలోని ఇండోర్ స్టేడియంలో ఎంపీ పుట్టా మహేశ్కుమార్ యాదవ్ సౌజన్యంతో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ వేడుకలు ఆద్యంతం అలరించాయి. ప్రాంగణమంతా రంగురంగుల విద్యుత్తు వెలుగులతో కొత్త శోభను సంతరించుకుంది. వారాంతం కావడంతో అంతా కుటుంబ సభ్యులతో తరలివచ్చారు. వినోదానికి ఏలూరు సిద్ధమా అంటూ వ్యాఖ్యతలు రవి, అశు హుషారుగా కార్యక్రమాన్ని ప్రారంభించగా ప్రముఖ గాయకులు ఆర్పీ పట్నాయక్, ఉషా, సునీత, గీతా మాధురి, సాకేత్, వాగ్దేవి, ఇండియన్ ఐడల్ రేవంత్ ఆలపించిన గీతాలు ప్రేక్షకులను కేరింతలు కొట్టించాయి. వయసుతో సంబంధం లేకుండా గాయనీ గాయకుల పాటలకు పదం కలపడంతోపాటు పైకిలేచి స్టెప్పులేశారు. వెయ్యి శుభములు కలుగు నీకు సీరియల్ నటులు శిల్పా చక్రవర్తి, సంయుక్త, జ్యోతి, మౌనిక, జబర్దస్త్ యాంకర్లు మానస్, కావ్య డ్యాన్సులతో అలరించారు. కార్యక్రమం అనంతరం బాణసంచా కాల్పులు మిరమిట్లు గొలిపాయి. కార్యక్రమానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ముఖ్యఅతిథిగా, విశిష్ట అతిథిగా ఎస్పీ కె.ప్రతాప్శివకిశోర్ హాజరయ్యారు.

ఈటీవీ ప్రసారాలను 30 ఏళ్లుగా ప్రజల గుండెల్లోకి చేర్చి, ఈటీవీతో ప్రయాణిస్తున్న ఎంఎస్వో, కేబుల్ ఆపరేటర్లు యాక్ట్ డిజిటల్, హోం ఎంటర్టైన్మెంట్స్ మణిశేఖర్, బీసీఎన్ తాడేపల్లిగూడెం కమ్యూనికేషన్స్ కందులపాటి శ్రీనివాసరావులకు జ్ఞాపికలు ఇచ్చి గౌరవించారు.

పుట్టా సేవలు..
- మహేశ్ అన్న పెళ్లి కానుక పేరిట వెనుకబడిన కుటుంబాలకు చెందిన నూతన దంపతులకు ఆర్థిక సహకారం అందిస్తున్నారు. విజయవాడ వరద బాధితుల కోసం సీఎం సహాయ నిధికి రూ.25లక్షలు వ్యక్తిగత సహాయం అందించారు. ఇతర సేవలను కొనియాడారు.
- ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ ఈనాడు 50, ఈటీవీ 30 వార్షికోత్సవం ఏలూరులో నిర్వహించడం చాలా గర్వకారణమన్నారు. ప్రజలకు ఈనాడు, ఈటీవీతో ఎనలేని అనుబంధం ఉందన్నారు.
అందుబాటులో ఉంటా..
కార్యక్రమం మధ్యలో ఎంపీ పుట్టా మహేశ్కుమార్ యాదవ్ ఏవీ ప్రదర్శించిన సమయంలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. కొల్లేరు సమస్య పరిష్కారానికి, యువతకు ఉపాధి కల్పించేలా పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నామన్నారు. ప్రజలు తమ ఇబ్బందులు చెప్పుకొనేందుకు కార్యాలయంలో వినతులు స్వీకరిస్తున్నామని, దిల్లీలో ఉన్నా వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తీరు వివరించారు. ప్రభుత్వ నిధులు రాబట్టడంతో పాటు సొంత నిధులతో చేపట్టిన అభివృద్ధి గురించి తెలిపారు.




గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.