
తొమ్మిది ఆర్ధిక పాఠాలు చెప్పిన రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి'.. ఇప్పుడు తాజాగా లెసన్ 10 అంటూ తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. ఇందులో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు ఎలా ధనవంతులు కావాలి? అనే విషయం గురించి ప్రస్తావించారు.
మాటలను నియంత్రించుకోవాలి. ''మీరు మాట్లాడే మాటలే మీరు'' అవుతారని కియోసాకి అన్నారు. రిచ్ డాడ్ (ధనిక తండ్రి).. తన కొడుకు నుంచి చేతకాదు, చేయలేను.. అనే మాటలను ఒప్పుకోరు. ఎందుకంటే మాటలే మనల్ని నియంత్రిస్తాయని అంటారు.
పూర్ డాడ్ (పేద తండ్రి).. పదేపదే నేను చేయలేను అని చెప్పేవారు. ఆయన ఆ మాటలకే కట్టుబడిపోయారు. దీంతో ఆయన ఎంత డబ్బు సంపాదించినా జీవితాంతం పేదవాడిగానే ఉండిపోయారని కియోసాకి పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ.. దాన్ని ఎలా సాదించగలను అనే విషయం గురించి ఆలోచించాలి. ఇది మన మెదడును ఆలోచింపజేస్తుంది, పరిష్కారాలు వెతకమంటుంది, కొత్త మార్గాలు, అవకాశాలు చూపిస్తుంది. ఇలా పెద్ద పెద్ద ఆర్థిక సమస్యలను పరిష్కరించడం నేర్చుకుని మరింత ధనవంతులవుతారని వెల్లడించారు.
ఇదీ చదవండి:26ఏళ్ల వయసు.. ఫోర్బ్స్ జాబితాలో చోటు: ఎవరీ కళ్యాణి రామదుర్గం?
ఏదైనా ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు.. ఆస్తులు తక్కువ ధరలకు లభిస్తాయి. ఉదాహరణకు, 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ సమయంలో.. రియల్ ఎస్టేట్, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్లు, బంగారం, వెండి అన్నీ అమ్మకానికి వచ్చాయి. ఆ సమయంలో భయపడిన వాళ్లు అమ్మేశారు. సాహసం చేసిన వాళ్లు కొనేశారు. కొన్నవాళ్లే తర్వాత ధనవంతులయ్యారు. ఇప్పుడు ధనవంతులు కావడానికి ఇది మంచి అవకాశం, కానీ మీ మాటలను నియంత్రించగలిగితేనే.. అని కియోసాకి స్పష్టం చేశారు.