
ఒక పది సెకన్లపాటు నీటమునిగితే అమ్మె, ఆ, ఊ, హే అంటూ ఎంతో ఇబ్బంది పడతాం కదూ. ఎందుకంటే నీటిలో మునిగితే శరీరానికి ప్రాణవాయువు అందక ప్రాణం తల్లడిల్లిపోతుంది. అయితే ఇక్కడ ఓ బాలిక మాత్రం ఏకంగా 20 అడుగుల నీటి లోతులో భరత నాట్యం చేసి అందరిని సంభ్రమాశ్చర్యంలో ముంచేసింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారిన ఈ వీడియోన చూసిన నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.
ప్లాస్టిక్ వల్ల కలిగే హాని ఎలాంటిదో అందరికీ తెలుసు అయినప్పటికీ దాని వాడకాన్ని ఏమాత్రం తగ్గించట్లేదు. ప్లాస్టిక్ వస్తువులతో పాటు ఇతర హానికరమైన వస్తువులు సముద్రగర్భంలో పడేయడం ద్వారా జలగర్భంలో నివసించే ఎన్నో రకాల ప్రాణులకు హాని కలుగుతుంది. ఈ విషయం చాలా మందికి తెలిసినా ఆ వాడకాన్ని అరికట్టలేక పోతున్నారు. అయితే సముద్ర కాలుష్యం వల్ల జల చరాలకు కలిగే హాని, ఇతర ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి ఓ 11ఏళ్ల చిన్నారి టీఏ తారగై ఆరాధన వినూత్న ప్రయత్నం చేసింది.
తమిళనాడులోని రామేశ్వరం సముద్రతీరంలో 20 అడుగుల లోతులో ఆరాధన భరత నాట్య ప్రదర్శన చేసింది. నీటి అడుగునా ప్రాణవాయువు అందకున్నా తన ప్రదర్శనలో ఆ బాలిక ఏటువంచి అసౌకర్యానికి లోను కాలేదు. సాధారణ ప్రదేశంలో నృత్యం చేసిన మాదిరిగానే నీటిలోనూ తన కళను ప్రదర్శించింది. భరత నాట్యంలోని వివిధ భంగిమలు చేస్తూ అందరిని ఔరా అనిపించింది.
ఆరాధన తండ్రి ప్రొఫెషనల్ డీప్-సీ- డైవింగ్ కోచ్ దీంతో తన తన పిల్లలైన టీఏ తారగై ఆరాధన, ఎస్డీ అశ్విన్ బాలకు శ్వాస నియంత్రణపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. దీంతో వారు సులువుగా ఈ ప్రదర్శన చేయగలుగుతున్నారు. ప్రస్తుతం తారగై ఆరాధన సముద్ర గర్భంలో చేసిన భరత నాట్య ప్రదర్శన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.