Cafe 3 rules: చిన్నకార్లు.. పెద్ద దుమారం

Eenadu icon
By Business News Desk Updated : 21 Dec 2025 05:48 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

ఇపుడిపుడే విద్యుత్‌ వాహనా(ఈవీ)లను ప్రజలు ఆదరిస్తున్నారు. ఈ సమయంలో 909 కిలోల బరువులోపు పెట్రోలు వాహనాలకు సడలింపులు/మినహాయింపులు ఇస్తే.. పర్యావరణహిత కార్లను అందిపుచ్చుకోవాలన్న లక్ష్యానికి గండి కొట్టినట్లే అవుతుంది. భద్రత ప్రమాణాలకు దెబ్బ పడుతుంది. కేఫ్‌-3 నిబంధనల్లో ఎటువంటి మినహాయింపులూ ఇవ్వొద్దు.   

కొన్ని కంపెనీలు ప్రతిపాదిత కార్పొరేట్‌ యావరేజ్‌ ప్యూయల్‌ ఎఫీషియన్సీ(కేఫ్‌)-3 నిబంధనల్లో చిన్న కార్లకు వచ్చే సడలింపులపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.

కారు బరువు, అందుబాటు ధర ఆధారంగా ప్రతిపాదిత కేఫ్‌-3 నిబంధనల్లో చిన్న కార్లకు ఎటువంటి సడలింపులూ ఇవ్వరాదని కార్ల తయారీ కంపెనీల్లో కొన్ని గట్టిగా వాదిస్తుండగా.. దీనిపై తప్పుడు ప్రచారానికి తెరదీశారని మరి కొన్ని కంపెనీలు ఆరోపిస్తున్నాయి. దీంతో భారత వాహన పరిశ్రమ రెండు వర్గాలుగా విడిపోయినట్లయింది.

ఏమిటీ నిబంధనలు:2017లో కేఫ్‌ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కార్ల కంపెనీలకు సగటు ఇంధన వినియోగంపై, కర్బన ఉద్గారాలపై ఒక పరిమితిని ఇవి తీసుకొచ్చాయి. కార్ల తయారీదార్లు మొత్తం మీద ఇంధన సామర్థ్యాన్ని పెంచుకోవడం, ఉద్గారాలను తగ్గించడం వీటి లక్ష్యం. ఇక 2022లో కేఫ్‌-2 నిబంధనలను తీసుకొచ్చారు. తదుపరి కేఫ్‌-3 ఏప్రిల్‌ 2027 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కొత్త అర్హతలు ఇపుడు చర్చల్లో ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబరులో ముసాయిదా మార్గదర్శకాలు జారీ అయ్యాయి. దీని కింద చిన్న కార్లకు కొన్ని సడలింపులు ఉండొచ్చని సమాచారం.

ఇతర దేశాల్లో ఇలా..

‘ఈ కొత్త నిబంధనల వల్ల పెద్ద కార్ల ఇంధన సామర్థ్యం పెరుగుతుంది. ఉద్గారాలు తగ్గుతాయి. కానీ కొన్ని కంపెనీలు తమ తక్కువ మైలేజీ ఇచ్చే కార్ల నుంచి దృష్టిని మళ్లించడం కోసం బాధ్యతారహితంగా వాస్తవాలను వక్రీకరిస్తూ, తప్పుడు కథనాలను అల్లుతున్నాయ’ని మారుతీ సుజుకీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రాహుల్‌ భార్తి అంటున్నారు. ‘చిన్న కార్లపై ప్రపంచవ్యాప్తంగా సడలింపులున్నాయి. చైనాలో 1090, ఐరోపాలో 1115, కొరియాలో 1100 కిలోల లోపు కార్లకు మినహాయింపులిస్తున్నాయి. జపాన్, అమెరికాలూ తక్కువ బరువున్న కార్లకు ప్రోత్సాహం ఇస్తున్నాయి. ఈ దేశాలన్నీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నాయా? ఎవరైనా సరే ఈ దేశ ప్రభుత్వాలన్నిటిపైనా ఆరోపణ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి. పరిశోధన చేసి మాట్లాడాలి’ అని వాదిస్తున్నారు. మారుతీతో పాటు టయోటా కిర్లోస్కర్, హోండా కార్స్‌ భారత్‌లో చిన్న కార్లకు ప్రయోజనాలు ఇవ్వాలని అంటున్నాయి.

భద్రత మాటేమిటి..

కేఫ్‌-3 నిబంధనల్లో బరువు, ధర ఆధారంగా చిన్న కార్లపై ఎటువంటి దయా చూపించాల్సిన అవసరం లేదని టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ ఎండీ, సీఈఓ శైలేశ్‌ చంద్ర అంటున్నారు. అపుడు భద్రత ఫీచర్లపై రాజీ పడాల్సి వస్తుందని, ఇది సస్టెయినబుల్‌ మొబిలిటీ వైపు సరైన చర్యలు తీసుకోకుండా చేస్తుందని పేర్కొన్నారు. చిన్న కార్ల నిర్వచనంలో బరువును చేర్చే ఎటువంటి ప్రతిపాదనకూ టాటా మద్దతు ఇవ్వదని చంద్ర తేల్చి చెప్పారు. ఇటువంటి ప్రమాణాల వల్ల ప్రయాణికుల భద్రతకు ఇబ్బంది తలెత్తుతుందని భారత వాహన తయారీదార్ల సంఘం(సియామ్‌)కు ప్రెసిడెంట్‌గానూ ఉన్న చంద్ర అంటున్నారు. టాటా మోటార్స్‌కు మద్దతుగా మహీంద్రా, హ్యుందాయ్, కియా గళమెత్తుతున్నాయి.

ఎస్‌యూవీలనే కొంటున్నారా?

ప్రారంభ స్థాయి వినియోగదార్లు చిన్న కార్లను కొనడం లేదని, నేరుగా ఎస్‌యూవీలనే కొంటున్నారని కొంత మంది తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని రాహుల్‌ భార్తి అంటున్నారు. ఒకవేళ ఎస్‌యూవీలనే ప్రారంభ స్థాయి వినియోగదార్లూ కొనుగోలు చేస్తుంటే, జీఎస్‌టీ కోతకు ముందు పరిశ్రమ 20% పైగా వృద్ధిని నమోదు చేసి ఉండాలి. కానీ వృద్ధి పెద్దగా ఎందుకు లేదని ప్రశ్నించారు. భారత జనాభాలో 3% మంది కారు కలిగి ఉన్నారు. మిగతా 97 శాతమూ కారు కొనగలిగే స్థాయికి చేర్చడం మన బాధ్యత అని ఆయన అన్నారు.

చిన్నకార్లు కనుమరుగవుతాయా?

సడలింపులు ఇవ్వకపోతే ఆల్టో, ఎస్‌ ప్రెసో వంటి చిన్న కార్లపై ప్రభావం పడుతుందా అన్న ప్రశ్నకు సమాధానంగా ‘లక్ష్యాలు శాస్త్రీయంగా లేకపోతే తక్కువ ఉద్గారాలను వెలువరచే చిన్న కార్లు కనుమరుగవుతాయ’ని అన్నారు. భద్రత విషయానికొస్తే పెద్ద కార్లలాగే అన్ని నిబంధనలనూ చిన్న కార్లకూ పాటిస్తున్నామన్నారు. తమ అన్ని వేరియంట్లకూ 6 ఎయిర్‌బ్యాగ్‌లు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 21 Dec 2025 04:42 IST