Eggs Caught In Tirumala Staying Room

సాక్షి, తిరుమల:ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో వరుస అపచారాలు చోటుచేసుకుంటున్నాయి. టీటీడీ విజిలెన్స్‌ వైఫల్యాలు బయటపడుతున్న నేపథ్యంలో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తిరుమలలో మరో అపచారం జరిగింది. ఓ గదిలో భక్తుడి వద్ద కోడి గుడ్లను పట్టుకున్నారు. ఈ ఘటన కలకలం సృష్టించింది.

వివరాల ప్రకారం.. తిరుమలలో వరుస అపచారాలు, విజిలెన్స్ వైఫల్యాలు భక్తులను ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. గత నెలలో అలిపిరి మెట్లమార్గంలో నాన్ వెజ్ తింటూ ఉద్యోగాలు పట్టుబడిన సంగతి తెలిసిందే. అలాగే, గతంలో శ్రీవారి ఆలయం ముందున్న బస్టాండులో భక్తులు ఎగ్ బిర్యానీ తింటూ దర్శనమిచ్చారు. అలిపిరిలో మద్యం, నాన్‌వెజ్ కలకలం సృష్టించింది. అంతేకాకుండా తిరుమలలో మద్యం మత్తులో యువకులు హల్‌చల్‌ చేసిన వీడియోలు బయటకువచ్చాయి. ఇక, తాజాగా తిరుమలలో కోడి గుడ్లను టీటీడీ సిబ్బంది గుర్తించారు. కౌస్తుభంలోని 538 గదిలో భక్తుడి వద్ద గుడ్లు చూసిన సిబ్బంది వారిని పట్టుకున్నారు. అనంతరం, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.